సాక్షి, హైదరాబాద్: రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 600 కోట్లు గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. మేం అధికారంలోకి వచ్చాక రూ.2408 కోట్లు ఆరోగ్యశ్రీకి పేమెంట్ చేశామన్నారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీనెల రూ.52 కోట్లు ఆరోగ్యశ్రీకి ఖర్చు పెడితే.. తమ ప్రభుత్వం ప్రతీనెల ఆరోగ్యశ్రీకి రూ.89 కోట్లు ఖర్చు పెడుతుందన్నారు.
ఇవాళ వరకు ఆరోగ్యశ్రీకి రూ.720 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇందులో ప్రైవేటు ఆసుపత్రులకు 200 కోట్ల మించి బకాయిలు లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ను దుర్వినియోగం చేశారు. బీఆర్ఎస్ ముఖ్య నేతల పీఏలు ఇందులో ఉన్నారు. 2046 కోట్ల రూపాయలు సీఏం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతీ కుటుంబానికి జీవిత బీమా సౌకర్యం కల్పిస్తాం.
..మెడికల్ కాలేజీలకు ఆరోగ్యశ్రీ అనుసంధానం చెస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి. గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తున్నాం. విద్యా, వైద్యం విషయంలో కోతలు ఉండవు. కోతలు పెట్టాల్సివస్తే వేరే వారికి కోతలు పెడతాం. పేదల విద్య, వైద్యం విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు’’ అని రేవంత్రెడ్డి తేల్చి చెప్పారు.


