ప్రొఫెసర్‌ ఖాసీం అరెస్టు.. గజ్వేల్‌కు తరలింపు

Police Raids On Virasam State Secretary Professor Khasim House - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఉస్మానియా యూనివర్సీటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఖాసీం ఇంట్లో పోలీసుల సోదాలు ముగిశాయి. ఓయూలోని క్వార్టర్స్‌లో ప్రొఫెసర్‌ ఖాసీం ఇంట్లో దాదాపు 5 గంటలపాటు తనిఖీలు చేసిన పోలీసులు కీలకమైన డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్‌డిస్కులు, విప్లవ సాహిత్యం, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం ఆయనను అరెస్టు చేసిన పోలీసులు గజ్వేల్‌కు తరలించారు. మవోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతోనే ఈ తనిఖీలు చేపట్టినట్టు సమాచారం.

గజ్వేల్‌ ఏసీపీ నారాయణ నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఖాసీం ఇటీవలే విప్లవ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికవడం గమనార్హం. అయితే, ప్రొఫెసర్‌ ఖాసీంపై 2016లో నమోదైన కేసులో భాగంగానే సోదాలు నిర్వహించినుట్టు పోలీసులు చెప్పారు. ములుగు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన ఈ కేసులో ఖాసీం ఏ-2గా ఉన్నారు. నాడు ఖాసీం కారులో విప్లవ సాహిత్యం దొరికినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇదే కేసులో మరోసారి సెర్చ్‌ వారెంట్లతో సోదాలు చేశామని వెల్లడించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top