ఇక  రెండో విడత

Panchayat Elections Phases Two Nominations Nizamabad - Sakshi

నిజామాబాద్‌అర్బన్‌: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్‌ జారీ కానుండగా బోధన్‌ డివిజన్‌లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ డివిజన్‌లోని ఆరు మండలాల్లో 142 గ్రామ పంచాయతీలు, 1,296 వార్డులు ఉన్నాయి. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను అధికారులు స్వీకరిస్తారు. 13వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 14న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 17న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటిస్తారు. 25న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు విజేతలను ప్రకటిస్తారు.

అర్హులు వీరే...
సర్పంచు, వార్డు స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఓటు హక్కు కలిగి ఉండాలి. 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అభ్యర్థులను ప్రతిపాదించే వారికీ ఓటు ఉండాలి. వార్డు సభ్యుడిగా పోటీచేసే అభ్యర్థికి వార్డులో ఓటు ఉన్నవారే ప్రతిపాదించవల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇంటి పన్నులు బకాయిలు లేకుండా చూసుకోవాలి. బకాయి చెల్లించిన రశీదును జతపరచాలి. బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. ఎస్సీ,ఎస్టీ, బీసీ రిజర్వు పంచాయతీల్లో పోటీచేసే వారు. సంబంధిత కుల ధ్రువీకరణ పత్రం జతచేయాలి. వార్డు సభ్యునిగా పోటీచేసే జనరల్‌ అభ్యర్థులకు నామినేషన్‌ ఫీజు రూ. 500 , బీసీ,ఎస్సీ,ఎస్టీలకు రూ. 200 ఉంటుంది. సర్పంచు స్థానాలకు పోటీ చేసే జనరల్‌ అభ్యర్థులు నామినేషన్‌ ఫీజు రూ.2,000, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది.

పక్బడందీగా ఏర్పాట్లను పూర్తి చేసిన అధికార యంత్రాంగం 
బోధన్‌రూరల్‌: రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకారం రెండో విడతలో బోధన్‌ మండలంలోని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికల నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధం అయ్యింది. బోధన్‌ మండలంలో మొత్తం 38 సర్పంచ్‌లు, 340 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా శుక్రవారం నుంచి  నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై ఆదివారం వరకు కొనసాగనుంది.

మండంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ అధికార యంత్రాంగం ఏర్పాట్లు పక్బడందీగా ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావ్, బోధన్‌ ఆర్డీవో గోపిరాం నేతృత్వంలో రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులకు (స్టేజ్‌–1, అసిస్టెంట్‌ స్టేజ్‌–1 అధికారులకు) పక్కగా శిక్షణ ఇచ్చి ఎన్నికల విధులను సాఫీగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.  కావాల్సిన ఎన్నికల సామగ్రిని అధికారులు పంపిణీ చేశారు. సర్పంచ్‌లు, వార్డులు నామినేషన్లు వేసేందుకు కావాల్సిన పత్రాలు, డ్యాంకుమెంట్లను అభ్యర్థులకు జీపీ ఎన్నికల అధికారులు తెలియచేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top