తుర్కపల్లి : అక్రమవెంచర్లకు అడ్డేదీ ?

No Limits For Illegal Ventures In Thurkapalli Village - Sakshi

    అనుమతి లేకుండా ప్లాట్ల ఏర్పాటు 

    నష్టపోతున్న కొనుగోలుదారులు    

సాక్షి, తుర్కపల్లి : రియల్‌ ఎస్టేట్‌ భూమ్‌ పెరిగి పోవడంతో భూముల ధరలు కూడా అమాంతం పెరిగాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వ్యవసాయ భూములను స్వల్ప ధరలకు కొనుగోలు చేసుకొని వాటిలో ప్లాట్‌లు చేసి వెంచర్లుగా మార్చి విక్రయిస్తున్నారు.అధికార యంత్రాంగానికి ఈ తంతు  తెలిసినా తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు. దాంతో ఈ దందా మూడు పూలు ఆరుకాయలుగా కొనసాగుతుంది.హైదరాబాద్‌కు 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న తుర్కపల్లి మండలంలో అక్రమ వెంచర్ల హవా కొనసాగుతున్నా అధికారులకు పట్టకపోవడం శోచనీయం. 
తక్కువ ధరలకు భూముల కొనుగోలు..
వ్యవసాయ భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేసుకొని, ఆ భూమిలోనే 200 గజాలు, 100 గజాలు ప్లాట్లు చేసి విక్రయిస్తున్నా రు. మండల కేంద్రం హైదరాబాద్‌కు 30 కిలో మీటర్ల దూరంలో ఉం డటం, యాదాద్రి పుణ్యక్షేత్రం పునఃనిర్మాణం కావడంతో రోడ్డుకు ఇరు వైపులా ఉన్న వ్యవసాయభూములు ఎకరానికి కోటి నుంచి కోటి 50 లక్షలకు  కొనుగోలు చేస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రైతుల దగ్గర నుంచి ఎకరాల చొప్పున కొనుగోలు చేసుకొని ఎ టువంటి అనుమతులు లేకుండా ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు.  
అనుమతులు కరువు ..
తుర్కపల్లి, మాదాపూర్, దత్తాయపల్లి, ఇబ్రహీంపూర్, వెంకటాపూర్, పల్లెపహాడ్, ముల్కలపల్లి, రుస్తాపూర్‌ గ్రామాల్లో ఈ రియల్‌ ఎస్టేట్‌ దందా మూడు పూలు ఆరుకాయలుగా కొనసాగుతుంది. వ్యవసాయ భూములను విక్రయించి వాటిని ప్లాట్లుగా మార్చేటప్పుడు డీటీసీపీ అనుమతులు పొందాలి. కాలుష్య నియంత్రణ మండలి, విద్యుత్‌శాఖ, అటవీశాఖ, గ్రామపంచాయతీ అనుమతులు, నీటి పారుదల శాఖ ముందస్తు అనుమతులు పొందాలి. అధికారులు వెంచర్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సి ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు.   

అక్రమ వెంచర్లపై చర్య తీసుకుంటాం..
మండలంలో నిర్వహిస్తున్న అక్రమ వెంచర్లపైన చర్యలు తీసుకుంటాం. గతంలో మా దృష్టికి వచ్చిన వాటికి హద్దురాళ్లు తొలగించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులపైన చర్యలు తీసుకున్నాం. గ్రామ కార్యదర్శులకు ఈ విషయంలో అవగాహన కలిగించి సత్వర చర్యలు తీసుకుంటాం.

– చంద్రమౌళి, ఈఓపీఆర్‌డీ    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top