నెలాఖరుకు కొత్త ఎంపీడీఓలు | New MPDOs In Ranga Reddy District | Sakshi
Sakshi News home page

నెలాఖరుకు కొత్త ఎంపీడీఓలు

Aug 17 2019 1:38 PM | Updated on Aug 17 2019 1:38 PM

New MPDOs In Ranga Reddy District - Sakshi

సాక్షి, రంగారెడ్డి : ఈ నెలాఖరు నాటికి ఆయా మండలాలకు కొత్త ఎంపీడీఓలు రానున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంత మండలాలు 21 ఉండగా.. ఇందులో 8 మండలాలకు సంబంధించి ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఈఓఆర్‌డీలు, సూపరింటెండెంట్లు ఇన్‌చార్జి ఎంపీడీఓలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలో జరగనున్న పదోన్నతుల్లో భాగంగా ఈ మండలాలకు రెగ్యులర్‌ ఎంపీడీఓలు బాధ్యత తీసుకోనున్నారు. జిల్లా పరిషత్‌లో ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఎంపీడీఓగా పదోన్నతి పొందేందుకు పది మంది సూపరింటెండెంట్లు, ఈఓఆర్‌డీ పోస్టుల కోసం 11 మంది సీనియర్‌ అసిస్టెంట్లు దరఖాస్తు చేసుకున్నారు.

సీనియారిటీ, పనితీరు ఆధారంగా వీరికి పదోన్నతులు లభించనున్నాయి. రిమార్కులు, మెమోలు ఉంటే.. పదోన్నతులు పొందేందుకు అనర్హులే. అందిన దరఖాస్తులను నిర్దేశిత ప్రమాణాల మేరకు జిల్లా పరిషత్‌ అధికారులు పరిశీస్తున్నారు. పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తికానున్నట్లు వారు పేర్కొంటున్నారు. ఈ పదోన్నతుల ద్వారా ఎంపీడీఓలు, ఈఓఆర్‌డీ పోస్టు లు భర్తీ కానున్నాయి. అంతేగాక డివిజన్‌ లెవల్‌ పంచాయతీ అధికారులు కూడా రానున్నారు. జిల్లాలో ఐదు డీఎల్‌పీఓ పోస్టులకుగాను.. ఒక్కరే పనిచేస్తున్నారు. నాలుగు పోసు ్టలు ఖాళీగానే ఉన్నాయి. తాజాగా జరగబోయే పదోన్నతుల ద్వారా ఇవి భర్తీ కానున్నాయి.

ఖాళీలు ఇక్కడే.. 
మహేశ్వరం, కడ్తాల్, చౌదరిగూడం, నంది గామ, కొందుర్గు, షాబాద్, కేశంపేట, తలకొండపల్లి మండలాల్లో ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్త జిల్లాల వారీగా జిల్లా పరిషత్‌లు ఏర్పాటు కావడంతో.. జూన్‌ 4 నుంచి కడ్తాల్, నందిగామ, చౌదరిగూడ మండల పరిషత్‌లు మనుగడలోకి వచ్చాయి. తలకొండపల్లి ఎంపీడీఓ పోస్టు ఏడాదిగా, మిగిలిన నాలుగు మండలాల్లో దాదాపు ఆరునెలలుగా ఖాళీగా ఉన్నాయి. అప్పటి ఇక్కడ ఇన్‌చార్జి ఎంపీడీఓలే ఉన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement