బాలికపై అత్యాచారయత్నం | Molest girl As a youngster cases | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారయత్నం

Mar 20 2016 2:46 AM | Updated on Jul 28 2018 8:53 PM

మండలంలోని గోపాల్‌నగర్ గ్రామానికి చెందిన బాలిక(13)పై అత్యాచారానికి యత్నించిన తాండూర్ గ్రామానికి చెందిన ....

 యువకుడిపై కేసులు నమోదు
తాండూర్ :  మండలంలోని గోపాల్‌నగర్ గ్రామానికి చెందిన బాలిక(13)పై అత్యాచారానికి యత్నించిన తాండూర్ గ్రామానికి చెందిన ఆలేటి సిద్ధార్థపై పలు కేసులు నమోదయ్యాయి. ఎస్సై కె.అశోక్‌కుమార్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గోపాల్‌నగర్‌కు చెందిన బాలిక తాండూర్‌లో ఏడో తరగతి చదువుతోంది. శుక్రవారం పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు తాండూర్‌లో ఆటో కోసం ఎదురుచూస్తోంది. ఆ సమయంలో మోటారుసైకిల్‌పై వచ్చిన సిద్ధార్థ తాను గోపాల్‌నగర్ వైపే వెళ్తున్నానని, తనతో వస్తే తీసుకెళ్లి దింపుతానని నమ్మబలికి మోటారుసైకిల్ ఎక్కించుకున్నాడు.

తాండూర్ శివారు దాటిన తర్వాత నిర్మానుష్య ప్రదేశం వైపు తీసుకెళ్లాడు. పక్కనే ఉన్న పొదల్లోకిలాక్కెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ బాలిక కేకలు వేసింది. అది విని సమీప పంట చేలల్లో పని చేస్తున్న వారు పరుగెత్తుకు వచ్చారు. వారి రాకను గమనించిన సిద్ధార్థ పారిపోయాడు. బాలిక తల్లిదండ్రులు తాండూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై శనివారం బెల్లంపల్లి డీఎస్పీ రమణారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో విచారణ చేపట్టారు. యువకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, నిర్భయ, పోక్సో కేసులను నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement