హామీల అమలులో సీఎం విఫలం  | MLC Kura Ragotham Reddy Speech In Siddipet | Sakshi
Sakshi News home page

హామీల అమలులో సీఎం విఫలం 

Sep 2 2019 1:03 PM | Updated on Sep 2 2019 1:04 PM

MLC Kura Ragotham Reddy Speech In Siddipet - Sakshi

సత్యాగ్రహదీక్షలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి 

సాక్షి, సిద్దిపేట: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారిస్తానని సీఎం కేసీఆర్‌ తాను ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం అయ్యారని, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు రోడ్డెక్కుతున్నారని కరీంనగర్‌ టీచర్‌ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. గత సంవత్సరం అన్ని ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘంగా చర్చించి ఒక్క సమస్యను పరిష్కరించక పోవడం సరికాదన్నారు. ఆదివారం స్థానిక ముస్తాబాద్‌ చౌరస్తాలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పీఆర్‌టీయూ టీఎస్‌ ఆధ్వర్యంలో ఒక్క రోజు సత్యాగ్రహదీక్ష నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ఉపాధ్యాయులు అడుగుతున్న డిమాండ్లు అన్నీ న్యాయమైనవేనని అవి పరిష్కరించే వీలున్నప్పటికి పరిష్కారానికి నోచుకోక పోవడం శోచనీయమన్నారు.  ప్రమోషన్లు, సీపీఎస్‌ రద్దు, సర్వీస్‌రూల్స్, పీఆర్‌సీ అమలు, స్పెషల్‌టీచర్లకు ఇంక్రిమెంట్ల హామీలు నెరవేర్చాలన్నారు.    పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి, కొత్త నరేందర్‌రెడ్డిలు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో రాష్ట్రశాఖ పిలుపుమేరకు ఒక్క రోజు సత్యాగ్రహదీక్షను చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులు సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర బాద్యురాలు లక్కిరెడ్డి విజయ, నాయకులు జయపాల్‌రెడ్డి, రాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement