మహాజాతరకు నేడు అంకురార్పణ | Medaram Jatara Ankurarpana On 22/01/2020 | Sakshi
Sakshi News home page

మహాజాతరకు నేడు అంకురార్పణ

Jan 22 2020 4:49 AM | Updated on Jan 22 2020 4:49 AM

Medaram Jatara Ankurarpana On 22/01/2020 - Sakshi

ములుగు: రెండేళ్లకోసారి ములుగు జిల్లా మేడారంలో జరిగే సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు బుధవారం అంకురార్పణ జరగనుంది. జాతరలో తొలి ఘట్టం(గుడిమెలిగె)తో మొదలు కానుంది. కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం, మేడారంలోని సమ్మక్క ఆలయాల్లో పూజారులు గుడిమెలిగె పండుగ నిర్వహించనున్నారు. సమ్మక్క–సారలమ్మ ఆలయా ల్లో కాక వంశీయులు, సిద్దబో యిన వంశీయులు తెచ్చిన గడ్డి తో పైకప్పుగా అలంకరిస్తారు.

ఆలయంలోని బూజు దులిపి అమ్మవార్లకు దీపం పెడతారు. ఈ దీపాలు రెండేళ్ల తర్వాత వచ్చే మహాజాతర వరకు వెలు గుతూనే ఉంటాయి. కాగా, మేడారం జాతరలో 4 బుధవారాలకు ప్రాముఖ్యత ఉంటుంది. తొలి బుధవారం (ఈ నెల 22) గుడిమెలిగె, రెండో బుధవారం (29న) మండమెలిగె పూజలు జరుగుతాయి. మూడో బుధవా రం (ఫిబ్రవరి 5) మహాజాతర ప్రారంభమవుతుంది. నాలుగో బుధవారం (12) తిరుగువారం జాతరతో మహాజాతర ఘట్టం ముగుస్తుంది.

జాతర క్రమం ఇలా.. 
ఫిబ్రవరి 5న ఉదయం సమ్మక్క సారలమ్మ ఆలయాల్లో పూజారు లు ముగ్గులు వేసి అలంకరిస్తారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, చీర, సారెలు సమర్పిస్తారు. మహబూబాబాద్‌ జిల్లా గంగా రం మండలం పూనుగొండ్ల నుం చి పెనక వంశీయులు పగిడిద్ద రాజును, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి దబ్బగట్ల వంశీయుల ఆధ్వర్యంలో వడ్డె పోదెం బాబు గోవిందరాజులును తీసుకొచ్చి అమ్మవార్ల పక్కన ఉన్న గద్దెలపై ప్రతిష్టిస్తారు. సాయంత్రానికి ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలంలోని కన్నెపల్లి నుంచి కాక వంశీయులు భారీ భద్రత మధ్య సారలమ్మను జంపన్న వాగును దాటుకుంటూ తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టించడంతో జాతర ప్రారంభమవుతుంది.

ప్రధాన ఘట్టాలు 
ఫిబ్రవరి 6: చిలుకలగుట్ట నుంచి సాయంత్రం సమ్మక్క తల్లిని ప్రభుత్వ లాంఛనాల మధ్య తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టిస్తారు.  
ఫిబ్రవరి 7: సమ్మక్క–సారలమ్మలతో పాటు పగిడిద్ద రాజులు, గోవిందరాజులు గద్దెలపై ఉంటారు. దీంతో కోటి మందికి పైగా భక్తులు తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. 
ఫిబ్రవరి 8: అమ్మవార్లు తిరుగు ప్రయాణంగా వన ప్రవేశం చేయడంతో జాతర ముగిసినట్లవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement