అమ్మానాన్నల పేరిట దేవాలయం | Madhusudanachari construct tempel for their parents | Sakshi
Sakshi News home page

అమ్మానాన్నల పేరిట దేవాలయం

Mar 6 2018 2:20 AM | Updated on Mar 6 2018 2:20 AM

Madhusudanachari construct tempel for their parents - Sakshi

హుస్నాబాద్‌: ‘కష్టేఫలికి నిదర్శనం మీ జీవితం. కర్తవ్య నిర్వహణకే మీ జీవితం అంకితం. కలలు సాకారం చేసుకోవడం మీ అభిమతం. కలతలెరుగని దంపతులుగా మీ కీర్తి శాశ్వతం. కన్నవారికి సదా ఆచరణీయం మీ ఇంగితం. మీ అనురాగస్మృతుల అనుభూతి మా గుండెల్లో పదిలం. మీ స్ఫూర్తితో నిత్య చైతన్యంగా జీవనం సాగిస్తున్న వారసులం..’అంటూ అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనచారి తన తల్లిదండ్రులపై కవిత్వం రాసి గుండెల్లో నింపుకున్న ప్రేమను చాటారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంలో సోమవారం స్పీకర్‌ మధుసూదనాచారి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్ననాటి స్నేహితులతో జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తన స్వగ్రామమైన నర్సక్కపల్లిలో మూడెకరాల స్థలంలో తన తల్లిదండ్రులు దివంగత వెంకటలక్ష్మి, వెంకటనర్సయ్య జ్ఞాపకార్థం దేవాలయం నిర్మిస్తున్నట్లు తెలిపారు.

అక్కడే స్మృతివనం, వృద్ధాప్య ఆశ్రమం నిర్మించి అందులోనే ఉంటూ తల్లిదండ్రులకు రోజూ పూజలు చేసుకోవడమే తన కోరిక అన్నారు. తల్లిదండ్రులను ప్రతి ఒక్కరు ప్రేమగా చూడాలని వారిని, బాధించరాదని ఆయన ఉద్వేగంతో చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, తెలంగాణ వికాస సమితి రాష్ట ఉపాధ్యక్షుడు కవ్వ లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement