పరీక్ష అడ్డుకున్నందుకు లాయర్ల అరెస్ట్ | lawyers arrested due to trying to stop civil judge exam | Sakshi
Sakshi News home page

పరీక్ష అడ్డుకున్నందుకు లాయర్ల అరెస్ట్

Mar 8 2015 9:51 AM | Updated on Sep 2 2017 10:31 PM

జూనియర్ సివిల్ జడ్జిల నియామకం కోసం నిర్వహించే పరీక్షను అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెలంగాణ న్యాయవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు.


హైదరాబాద్ : జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీ కోసం నిర్వహించే పరీక్షను అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెలంగాణ న్యాయవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. మీర్పేటలో జరుగుతున్న జూనియర్ సివిల్ జడ్జిల నియామక పరీక్షను నిర్వహించరాదంటూ, పరీక్షను అడ్డుకునేందుకు తెలంగాణకి చెందిన కొందరు న్యాయవాదులు ప్రయత్నించారు. పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పోలీసులు పరీక్షను అడ్డుకునేందుకు ప్రయత్నించిన న్యాయవాదులను అరెస్ట్ చేశారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సివిల్ జడ్జి పోస్టుల భర్తీ కోసం జారీచేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తాను తెలంగాణ న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీ కోరిన విషయం తెలిసిందే. మంజూరు చేసిన పోస్టుల ఆధారంగా తెలంగాణ, ఏపీలకు జిల్లా జడ్జీలు, సీనియర్, జూనియర్ సివిల్ జడ్జీల కేడర్‌ను ఖరారు చేయాలని విజ్ఞప్తి చేసింది. జేఏసీ కన్వీనర్, కో కన్వీనర్లు ఎం.రాజేందర్‌రెడ్డి, గండ్ర మోహనరావు మంగళవారం ప్రధాన న్యాయమూర్తికి గతంలో లేఖ రాశారు.

ప్రస్తుతం ఉన్న ఖాళీలను తెలంగాణ, ఏపీలకు 42:58 నిష్పత్తిలో కేటాయించాలని, ఖాళీల భర్తీకి ఇరు రాష్ట్రాలకూ వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేయాలని కోరారు. జూనియర్ సివిల్ జడ్జీల పోస్టుల భర్తీకి విభజనకు ముందే నోటిఫికేషన్ జారీ చేశారని గుర్తు చేశారు.  కేంద్రం ఇప్పటికే హైకోర్టు విభజన చర్యలు ప్రారంభించిందని, అందులో భాగంగా ఇరు హైకోర్టులకు న్యాయమూర్తుల సంఖ్యను ఖరారు చేసిందని తెలిపారు.


 

Advertisement
 
Advertisement
Advertisement