ఈ ఇళ్లకు దారేది..? | Karepalli Village Facing Road Problems | Sakshi
Sakshi News home page

ఈ ఇళ్లకు దారేది..?

Nov 29 2018 11:54 AM | Updated on Nov 29 2018 11:54 AM

Karepalli Village Facing Road Problems - Sakshi

ఇరువైపులా పెరిగిన తుమ్మ చెట్లతో గొందేరుబావి వీధి

సాక్షి, కారేపల్లి: ఈ ఊరికి ఆ వీధులే ప్రతి రూపాలు.. ఊరు పుట్టినప్పుడు పుట్టిన వీధులు పాలకుల నిర్లక్ష్యంతో నేడు అంద వికారంగా మారాయి. పాత ఊరని, పాత బజార్లని, ఆ పాలకులకు చిన్నచూపుమో..! అభివృద్ధికి ఆమడ దూరంలో పెట్టారు. ఒకప్పుడు జనాల రద్దీతో సందడి సందడిగా ఉండే వీధులు నేడు చెత్తాచెదారం,  పిచ్చి మొక్కలు, కంప, తుమ్మ చెట్లతో వెక్కిరిస్తున్నాయి. ఇక వర్షాకాలంలో అయితే ఈ వీధుల దుస్థితి వర్ణణాతీతం. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. ఊరికి ఎవరింటికైన బంధువులు వస్తే.. ఫలాన వాళ్ల ఇంటికి వెళ్లాలి.. ఆ ఇంటికి దారేది..? ఎటునుంచి పోవాలి..?అనే ప్రశ్నలు వినాల్సిన దుస్థితి ఈ వీధివాసులకు తారసపడటం పరిపాటిగా మారింది. ఇదంతా మండలంలోని ఏ మారుమూల గ్రామమో అనుకుంటే పొరపాటే, ఇది మండల కేంద్రం కారేపల్లిలోని 1, 2, 3, 4, 5, 6వ వార్డుల్లోని పాత శివాలయం,  గొందేరుబావి, మదీన సెంటర్, మసీద్‌ గల్లీ బజార్, భారత్‌నగర్,  జంగల్‌ బజార్‌ వీధుల దుస్థితి. గొందేరుబావి వీధిలో ఉన్న పాడుపడిన బావిని పూడ్చకపోవడంతో చెత్త చెదారంతో పాటు  వర్షం నీరు నిలిచి మురిగిపోయి, దుర్వాసన వెదజల్లుతుంది. దీనికి తోడు విష పురుగులకు నివాసంగా గొందేరు బావి నిలిచిందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.  


విషపురుగులకు నిలయంగా పాడుపడిన గొందేరుబావి  


 పిచ్చిమొక్కలతో నిండిన మసీదు గల్లీ    

ఈ సారైనా బాగుచేస్తారా..? అభ్యర్థులను ప్రశ్నిస్తున్న ప్రజలు.. 
గత పాలకులు ఎలాగో పట్టించుకోలేదు. ఈ సారైనా మా ఊరిని బాగు చేస్తారా.. చేయ్యరా..? అని ప్రజలు ప్రచారానికి వచ్చిన అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. తప్పకుండా చేస్తాం, రోడ్లు బాగు చేయకపోతే మీ ఊళ్లోకి రానివ్వకండని.. గట్టిగానే హామీలను గుప్పిస్తున్నారు నాయకులు.  

Advertisement
 
Advertisement
Advertisement