
'ఎంతటి వారినైనా శిక్షించాల్సిందే'
ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు ముడుపులు ఇవ్వజూపి ఏసీబీకి దొరికిపోయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓటు నోటు వ్యవహారంలో ఎంతటి వారినైనా శిక్షించాల్సిందేనని సీఎల్పీ నేత జానారెడ్డి తెలిపారు.
హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు ముడుపులు ఇవ్వజూపి ఏసీబీకి దొరికిపోయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓటు నోటు వ్యవహారంలో ఎంతటి వారినైనా శిక్షించాల్సిందేనని సీఎల్పీ నేత కె. జానారెడ్డి తెలిపారు. స్టీఫెన్సన్ తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిపిన ఫోన్ సంభాషణలు ఆయన వాయిస్ లానే అనిపిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో ఎవరు ఎవరు వేధించాల్సిన అవసరం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా జానారెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర ఏర్పాటుకు కొంత రాజీ అవసరమని భావించి హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా అంగీకరించాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ సాధ్యమైందన్న వాస్తవాన్ని గ్రహించాలన్నారు. కాంగ్రెస్ ను విమర్శించి పబ్బం గడుపుకోవడం సరికాదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరి నేను ధూషణలకు పాల్పడలేనని.. హుందాగానే వ్యవహరిస్తానని జానారెడ్డి పేర్కొన్నారు.