కాంగ్రెస్‌నే మోరీల్లో వేస్తారు..

jagadeesh reddy reacts on bodupally congress leader murder - Sakshi

మొండాలు మోరీలలో అనే భాష మాకు రాదు

తాగిన మత్తులో చేసుకున్న హత్యలతో టీఆర్‌ఎస్‌కు ఏం సంబంధం

అభివృద్ధే టీఆర్‌ఎస్‌ ఎజెండా

విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

నిడమనూరు (నాగార్జునసాగర్‌) : టీఆర్‌ఎస్‌ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేని కాంగ్రెస్‌ను ప్రజలు 2019 ఎన్నికల్లో మోరీల్లో వేస్తారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని గుంటిపల్లి, ఎర్రబెల్లిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాన చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి సభలో మంత్రి మాట్లాడుతూ తాగిన మత్తులో చేసుకున్న హత్యను రాజకీయలబ్ధికి కాంగ్రెస్‌ రాష్ట్ర, జాతీయ నాయకులు వాడుకోవడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మొండేలతో మోరీలు నిండుతాయని కాంగ్రెస్‌ నేతలు చెప్పారని.. మా ఆలోచన అలాంటిది కాదని.. అభివృద్ధే ఎజెండాగా పనిచేస్తామని చెప్పారు.

ఎక్కువ శాఖలు చేసిన అని గొప్పలు చెప్పుకుంటున్న జానారెడ్డి తన సమక్షంలో అధికార పార్టీ ఎమ్మెల్యే, మంత్రి మీద ఆరోపణలు చేస్తుంటే ఎందుకు మిన్నకున్నారని ప్రశ్నించారు. జానారెడ్డి నియోజకవర్గంలో సమస్యలు ఉండవనుకున్నానని.. కానీ మిగతా నియోజకవర్గాలతో పోల్చితే ఇక్కడే ఎక్కువ ఉన్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో డజను సీట్లు టీఆర్‌ఎస్‌ గెలుచుకుంటుందని అన్నారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంతో పాటు జిల్లాలో ప్రతి గ్రామానికి శుద్ధిచేసిన జలాలను అందిస్తామన్నారు.

కేసీఆర్‌ వెంటే.. సాగర్‌ నియోజకవర్గం ఉంటదని ఎర్రబెల్లి ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో నిరూపన అయ్యిందన్నారు. ఎక్కువ కాలం జానారెడ్డికి ఓటు వేయడంతో నియోజకవర్గ ప్రజల చేతులు కాయలు కాచాయన్నారు. మండలంలోని జంగాలగూడెం, ఎర్రబెల్లిలో రూ.7.5లక్షలతో నిర్మించే రెండు కమ్యూనిటీ హాళ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నోముల నర్సింహయ్య, బడుగుల లింగయ్యయాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు నూకల వెంకట్‌రెడ్డి, ఎంపీపీ దాసరి నర్సింహ, కేవీ రామారావు, అంకతి వెంకటరమణ, మన్నెం రంజిత్‌యాదవ్, సర్పంచ్‌ తాటి సత్యపాల్, ఎంపీటీసీ మన్నెం వెంకటరమణ, తహసీల్దార్‌ నాగార్జునరెడ్డి, ఎంపీడీఓ వెంకటాచారి, మేరెడ్డి వెంకట్‌రెడ్డి, సూలకంటి వీరారెడ్డి, గడ్డం రవీందర్‌రెడ్డి, మంజుల సీతారాములు, బైరెడ్డి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top