
జోగిపేట కూడలి వద్ద ఓ బంగారం దుకాణంలో తనిఖీలు చేస్తున్న ఆదాయపు పన్ను సిబ్బంది
నరసన్నపేట: నియోజకవర్గ కేంద్రం నరసన్నపేటలో బంగారం దుకాణాలపై ఐటీ శాఖ అధికారులు మంగళవారం మెరుపు దాడులు చేశారు. ఉదయానికే నరసన్నపేటకు 13 వాహనాల్లో చేరుకున్న ఐటీ శాఖ సిబ్బంది 14 జట్లుగా ఏర్పడి ముందుగా నిర్దేశించుకున్న దుకాణాలకు వెళ్లి తనిఖీలు చేపట్టారు. దీంతో బంగారం వ్యాపారులు హడలెత్తారు. మిగిలిన షాపులు మూసి పరుగులు తీశారు. ఉదయం 10.30 సమయంలో నరసన్నపేటకు చేరుకున్న ఐటీ సిబ్బంది ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో వాహనాలు నిలిపి షాపులకు వెళ్లారు.
జోగిపేట, పంచాయతీ కూడలి, బజారు వీధుల్లో ఉన్న ప్రధాన షాపుల్లో తనిఖీలు చేపట్టారు. రాత్రి వరకూ పరిశీలనలు కొనసాగుతాయని, బుధవారం ఉదయానికి కొలిక్కి వస్తాయని ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ దాడుల్లో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
పన్ను చెల్లింపుల్లో భారీ వ్యత్యాసం..
జిల్లాలో ఇతర ప్రాంతాలతో పోల్చి చూస్తే నరసన్నపేటలో బంగారం వ్యాపారులు పన్ను చెల్లింపులో భారీ వ్యత్యాసం ఉందని, అందుకే మెరుపు దాడులు చేపట్టాల్సి వచ్చిందని విశాఖకు చెందిన ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ ఓం కారేశ్వరరావు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొత్తగా మారిన నిబంధనల ప్రకారం నరసన్నపేట వ్యా పారులు పన్ను చెల్లించడంలేదన్నారు.
రూ.లక్షల్లో వ్యాపారం చేస్తున్నా రూ.వందల్లో పన్ను చెల్లిస్తున్నారని చెప్పారు. అందుకే కొద్దిరోజులుగా నిఘా వేసి ఇక్కడి జరుగుతున్న బంగారం వ్యాపారాన్ని అంచనా వేశామని అన్నారు. భారీగా తేడాలు ఉండటంతో దాడులకు దిగామని స్పష్టం చేశారు. తనిఖీలు చేస్తున్న షాపుల నుంచి నిబంధనల ప్రకారం పన్ను మదించి కట్టిస్తామని తెలిపారు.