
భర్త చేతిలో భార్య హతం
వారికి మూడు నెలలక్రితమే వివాహమైంది.. దైవ దర్శనానికి తీసుకెళ్లి అంతలోనే గొడవపడి కట్టుకున్న భార్యనే భర్త దారుణంగా ...
► మూడు నెలల క్రితమే వివాహం
► కాలూర్తిమ్మన్దొడ్డి శివారులో ఘటన
► నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు
గట్టు : వారికి మూడు నెలలక్రితమే వివాహమైంది.. దైవ దర్శనానికి తీసుకెళ్లి అంతలోనే గొడవపడి కట్టుకున్న భార్యనే భర్త దారుణంగా చంపేసి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు చిత్రీకరించబోయాడు.. చివరకు అతడిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. మూడునెలల క్రితం కర్ణాటక రాష్ర్టంలోని మాన్వితండాకు చెందిన మాణిక్యమ్మ (23) కు గట్టు మండలంలోని మల్లాపురంతండా వాసి రంగనాయక్తో వివాహమైంది. అప్పటి నుంచి దంపతులు రాయచూర్ జిల్లా మట్మారి-మరిసెపాడు దగ్గర కట్టె (వంట చెరుకు) లను సేకరించి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా, మూడు రోజుల క్రితమే ఇద్దరూ స్వగ్రామానికి వచ్చి కుటుంబ విషయమై గొడవపడ్డారు.
ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ధరూర్ మండలంలోని పాగుంట స్వామి దైవ దర్శనానికి బైక్పై వెళ్లారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో కాలూర్తిమ్మన్దొడ్డి శివారులోకి చేరుకోగానే ఆపి భార్యను బండరాయితో మోది చంపేశాడు. అక్కడి నుంచి కాలూర్తిమ్మన్దొడ్డికి తీసుకెళ్లి ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని గ్రామస్తులకు చెప్పగా వారు నమ్మలేదు.
చివరకు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో అసలు విషయం బయటపడింది. సంఘటన స్థలాన్ని గద్వాల డీఎస్పీ బాలకోటి, అలంపూర్ సీఐ వెంకటేశ్వర్లు పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.