మహిళలకు కుచ్చుటోపీ!
అధిక వడ్డీ ఆశచూపి నగదు వసూలు
ఆందోళనకు దిగిన బాధితులు
పోలీసుల అదుపులో దంపతులు
రామచంద్రాపురం : అధిక వడ్డీ ఆశచూపి కుచ్చుటోపీ పెట్టిన ఓ మహిళను రామచంద్రాపురం పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం... బెంగళూరుకు చెందిన భారతి, వీరేందర్సింగ్లు దంపతులు. వీరు ఏడాదిన్నర క్రితం అమీన్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లారెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. ఓ ఇంటిని అద్దెకు తీసుకొని అందులో జ్యువెలరీ, గృహాలంకరణ వస్తువుల విక్రయంతోపాటు బట్టల దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఓ వస్తువుకొంటే మరో వస్తువు ఉచితమంటూ ప్రచారం చేశారు. అదీగాక రూ.లక్ష రూపాయలిస్తే రోజుకు రూ. 5 వేల వడ్డీని ఇస్తామని మహిళలకు ఆశచూపారు. నమ్మిన స్థానిక మహిళలు పెద్ద ఎత్తున నగదు, బంగారాన్ని భారతికి ఇచ్చారు. తమ డబ్బులు తమకివ్వాలంటూ గత రెండు రోజులుగా బాధితులు ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చారు. గురువారం రాత్రి బాధితులు ఒక్కసారిగా ఆమె ఇంటి వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారతి దంపతులను అదుపులోకి తీసుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ సుమారు 200 మంది బాధితులు పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.