ప్రమాదం ఎలా జరిగింది..?

High Level Committee Inquiry Into MMTS Train Accident - Sakshi

ఎంఎంటీఎస్‌ రైలు ప్రమాదంపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ

సాక్షి, హైదరాబాద్‌: ఎంఎంటీఎస్‌ రైలు ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కమిటీ బుధవారం కాచిగూడ రైల్వేస్టేషన్‌లో సమావేశమైంది. ప్రమాదం జరిగిన తీరు, తీవ్రత, తదనంతర పరి ణామాలపై అధికారులు విచారణ చేపట్టారు. రైల్వే భద్రత కమిషనర్‌ రాంకృపాల్‌ నేతృత్వంలో జరి గిన ఈ సమావేశంలో హైదరాబాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ సీతారాం, వివిధ విభాగాలకు చెంది న ఉన్నతాధికారులు, ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారు లు పాల్గొన్నారు. ప్రమాద సమయంలో నమోదైన సీసీటీవీ ఫుటేజీలను అధికారులు పరిశీలించారు.

ఆ సమయంలో ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ కనీసం 50 కిలోమీటర్‌లపైనే వేగంతో వెళ్తున్నట్లు గుర్తించారు. వేగం వల్లే ఎక్కువ బోగీలు ధ్వంసమైనట్లు తేల్చా రు. ప్రమాద సమయంలో లూప్‌లైన్‌లో నెమ్మదిగా క్రాస్‌ చేస్తున్న హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ వాకిం గ్‌ స్పీడ్‌తో ముందుకెళ్లడం వల్ల కూడా ప్రమాద తీవ్రత తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ప్రమాద సమయంలో విధి నిర్వహణలో ఉన్న కాచిగూడ స్టేషన్‌ మేనేజర్‌ దశరథ్, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది, సిగ్నలింగ్‌ స్టాఫ్‌ను విచారించారు. ప్రయాణికులు, ప్రత్యక్ష సాక్షుల నుంచీ వివరాలు సేకరించారు.

హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ లోకోపైలట్‌ బాలకిషన్‌తోనూ ఉన్నతస్థాయి విచారణ కమిటీ సమావేశమైంది. ఎంఎంటీఎస్‌ లోకోపైలట్‌ చంద్రశేఖర్‌ మానసిక స్థితిని అంచనా వేసేందుకు అధ్యయనం చేపట్టారు. అతడితో పనిచేస్తున్న సహోద్యోగులు, పైఅధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కేవలం ఏమరుపాటుగానే సిగ్నల్‌ను గమనించకుండా ముందుకు వెళ్లి ఉంటే ఆ ఏమరుపాటుకు దారితీసిన అంశాలేంటీ అనే దానిపైనా దృష్టి సారించారు. గురువారం కూడా విచారణ కొనసాగనున్న దృష్ట్యా లోకో పైలట్‌కు సన్నిహితులైన వ్యక్తుల నుంచి అదనపు సమాచారం సేకరించాలని భావిస్తున్నారు.  

విషమంగానే లోకోపైలట్‌ పరిస్థితి
లోకోపైలట్‌ చంద్రశేఖర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. నాంపల్లి కేర్‌ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉంచి డాక్టర్లు అత్యవసర వైద్య చికిత్సలు అందిస్తున్నారు. మరో 24 గంటలు గడిస్తే తప్ప అతడి ఆరోగ్యంపై ఏమీ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top