
సాక్షి, హైదరాబాద్: బుడిబుడి అడుగులు వేసే బాలుణ్ని ఒకటో తరగతి చదవకుండానే రెండో తరగతిలో ఎలా చేర్చుకుంటారని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్పీఎస్)ను హైకోర్టు ప్రశ్నించింది. ఈ విధానాన్ని తాము అంగీకరించేది లేదని, ఒకటో తరగతికి డిమోట్ చేయాలని స్కూల్ ప్రిన్సిపల్ను హైకోర్టు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తన మనవడు కొమ్మిరెడ్డి అద్వేత్యను ఒకటో తరగతికి డిమోట్ చేయమని కోరినా హెచ్పీఎస్ యాజమాన్యం పట్టించుకోకుండా రెండో తరగతిలోనే కొనసాగించడంపై బాలుడి నానమ్మ కొమ్మిరెడ్డి జ్యోతిదేవి హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం విచారించింది.
పిటిషనర్ కోరిన మేరకు రెండో తరగతిలో చేర్చుకున్నామన్న హెచ్పీఎస్ యాజమాన్యం వాదనల తర్వాత వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి కొట్టివేశారు. దాంతో బాలుడి నాయనమ్మ అప్పీల్ చేయడంతో ధర్మాసనం ముందుకు మరోసారి విచారణకు వచ్చింది. చదువుకు బీజాలు పడే చిన్న వయసులోనే చిన్నారులను ఒత్తిడికి లోనయ్యేలా చేయడం ఎంతమాత్రం సబబుకాదని ధర్మాసనం అభిప్రాయపడింది.