‘పురపోరు’లో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయం 

Gutha Sukender Reddy Speech In Nalgonda - Sakshi

తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌కు కృతజ్ఞతలు

రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి

సాక్షి, నల్లగొండ : మున్సిపల్‌ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్‌ విజయఢంకా మోగించడం ఖాయమని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, నల్లగొండ మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ అభ్యర్థి గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ వల్లే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ పరుగులు పెడుతున్నాయన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలనే ఆసక్తిని సీఎం దృష్టికి తీసుకెళ్లాను.. అందుకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ అంగీకరించి ఎమ్మెల్సీగా ప్రకటించారన్నారు. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఎమ్మెల్సీగా ప్రకటిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 7, లేదా 10న నామినేషన్‌వేస్తానని అందుకు సీఎం పొలిటికల్‌ కార్యదర్శి సుభాష్‌రెడ్డిని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ సెక్యులర్‌పార్టీ అని ప్రజల భవిష్యత్‌ టీఆర్‌ఎస్‌తోనే ముడిపడి ఉందన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేస్తున్న సంక్షేమపథకాలు ఆదర్శంగా నిలిచాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం అమలు చేశారన్నారు. జిల్లా అభివృద్ధి కోసం మంత్రి జగదీశ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా అభివృద్ధికి పాటుపడతానన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయించడంతోపాటు నీటిలభ్యత ఉన్న ప్రాంతాలను గుర్తించి సద్వినియోగపరుస్తామన్నారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలోనే జిల్లాను అభివృద్ధిలో ముందుంచుతామన్నారు. పార్టీ సభ్యత్వాన్ని భారీగా చేపట్టామన్నారు. బీజేపీ నాలుగు సీట్లు గెలిచి ప్రత్యామ్నాయం అనుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బండా నరేందర్‌ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సొరంగమార్గం, బివెల్లెంల, డిండి, చర్ల ప్రాజెక్టులను పూర్తి చేసి బీడు భూములకు సాగునీరు అందించి రైతు కళ్లల్లో ఆనందం నింపుతామన్నారు.

కాంగ్రెస్‌ పాలనలో వెనుకబడిన జిల్లాను సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో జిల్లా అభివృది పథంలో నడుస్తుందన్నారు. ఎమ్మెల్సీగా ప్రకటించినందుకు కేసీఆర్, కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, భాస్కర్‌రావులు మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించుకోవాలన్నారు. గుత్తాకు ఎమ్మెల్సీ టికెట్‌ ఇవ్వడం పట్ల సీఎం కేసీఆర్‌కు, కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్‌ కోఆర్డినేటర్‌ మాలె శరణ్యారెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ పుల్లెంల వెంకట్‌నారాయణగౌడ్, మాజీ ఎంపీపీ దైద రజిత పాల్గొన్నారు. అనంతరం గుత్తాను జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యేలు కంచర్ల, భూపాల్‌రెడ్డి, భాస్కర్‌రావు.. గుత్తాను సన్మానించారు. పార్టీ నాయకులు సుంకరి మల్లేశ్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, రంగయ్య, యాదయ్య, ప్రసాద్, జగిని వెంకన్న, అంజయ్య, శరణ్యారెడ్డి, మామిడి పద్మ, సరోజ, బాలామణి పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top