రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలి | for all farmer must apply to forgive the debt | Sakshi
Sakshi News home page

రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలి

Jun 7 2014 3:58 AM | Updated on Aug 15 2018 9:20 PM

రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలి - Sakshi

రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలి

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

 నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక డీసీసీబీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరికీ రుణమాఫీ వర్తింపజేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ నేడు షరతులు విధించడం సరికాదన్నారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు రైతులకు ఎంతచేసినా తక్కువేనని చెప్పారు.
 
 సూర్యాపేట, భువనగిరిలోని సహకార బ్యాంకు భవన నిర్మాణాలను పూర్తి చేయడానికి రిటైర్డ్ ఇంజినీర్‌ను కాంట్రాక్టు పద్ధతిని నియమించనున్నట్లు తెలిపారు. నిధులు మంజూరై నాలుగేళ్లు గడిచినప్పటికీ నిర్మాణ బాధ్యతలు నిర్వహించే వారులేక పూర్తి చేయలేదన్నారు. జిల్లాలో గోదాముల నిర్మాణాల కోసం రూ. 2 కోట్లు త్వరలో విడుదల కానున్నాయని చెప్పారు.
 
సహకార బ్యాంకు ద్వారా రూ.40 కోట్ల దీర్ఘకాలిక రుణాలను ఇవ్వనున్నామన్నారు. దీర్ఘకాలిక రుణాలను వసూలు చేయడంలో జిల్లా బ్యాంకు రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. వ్యాపారాలు నిర్వహించడానికి ముందుకు వచ్చే సొసైటీలకు సహకారం అందిస్తామని చెప్పారు. ఈ నెల 12న బోర్డు సమావేశం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ సమావేశంలో డెరైక్టర్‌లు పాశం సంపత్‌రెడ్డి, చాపల లింగయ్య, గరిణె కోటేశ్వర్‌రావు, నరేందర్‌రెడ్డి, రమణారెడ్డి, పీర్‌నాయక్, ముత్యంరావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement