కొలిచేవారేరీ..?

Food Adulteration in Hyderabad - Sakshi

గ్రేటర్‌లోయథేచ్ఛగాకల్తీ ఆహారం తయారీ

గత ఏడాది సుమారు 3వేల కేసులు నమోదు

కేవలం 11 మందే ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు

వేధిస్తున్న సిబ్బంది కొరత  

కరోనాపై అప్రమత్తతే కీలకమంటున్న వైద్యులు

సాక్షి, సిటీబ్యూరో: కరోనా (కోవిడ్‌–19) అలర్ట్‌తో గ్రేటర్‌ పరిధిలో ఆహార భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నోరూరించే పానీపూరీ.. హాట్‌..హాట్‌ ఛాట్‌.. కబాబ్‌.. బిర్యానీ.. పాయా.. ఇలా రకరకాల వంటకాలు నోరూరిస్తుంటాయి. వీటి టేస్ట్‌ అన్ని వర్గాలను విశేషంగా ఆకర్షించడం వరకు బాగానే ఉన్నా.. అపరిశుభ్ర వాతావరణంలో వీటిని తయారు చేస్తే జిహ్వా చాపల్యం తీరడం మాటేమో గాని.. వాంతులు, విరేచనాలతో మంచం పట్టడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మహా నగరంలో ప్రస్తుతం వైరస్‌ సంబంధిత జబ్బులు విజృంభిస్తున్న నేపథ్యంలో కల్తీ ఆహారం కేసులు సిటీజన్లను కలవరపెడుతున్నాయి. ఆహార కల్తీ నిరోధక చట్టాన్ని అమలు చేసేందుకు జీహెచ్‌ఎంసీ వద్ద అరకొరగా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు మాత్రమే అందుబాటులో ఉండడంతో పరిస్థితి రోజురోజుకూ విషమిస్తోంది. వీరు రోజుకు ఐదు చొప్పున నెలకు సుమారు     150 ఆహార నమూనాలను మాత్రమే తనిఖీ చేస్తుండడం గమనార్హం. ఇక గ్రేటర్‌ పరిధిలో గత ఏడాది సుమారు మూడువేల ఆహార కల్తీ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. మరో 978 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. బుక్‌ చేసిన కేసుల్లో 23 మందిపై మాత్రమే క్రిమినల్‌ కేసులున్నట్లు పేర్కొన్నారు. 

తప్పించుకుంటున్న అక్రమార్కులు..
ప్రస్తుతం ఆహార కల్తీకి పాల్పడిన అక్రమార్కులకు ఆహార కల్తీ నిరోధక చట్టం కింద వివిధ రకాల ఉల్లంఘనలకు పాల్పడితే రూ.500– రూ.3000 వరకు మాత్రమే జరిమానాలు విధిస్తుండడంతో పలు హోటళ్లు, తినుబండారాలు, చిరుతిళ్ల దుకాణాల యజమానులు అపరిశుభ్ర పరిసరాల్లో వండి వినియోగదారులకు వడ్డిస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల తనిఖీల్లో అక్రమాలు బయటపడితే తక్కువ మొత్తంలో జరిమానాలను చెల్లించి చేతులు దులుపుకొంటుండడం గమనార్హం. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. సిబ్బంది కొరత కారణంగా నగర వ్యాప్తంగా తనిఖీలు చేయడం వీరికి వీలు కావడంలేదు. వీరి సంఖ్యను సైతం 50కి పెంచాల్సిన అవసరం ఉంది.

జాడలేని మొబైల్‌ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్స్‌..
గ్రేటర్‌ పరిధిలో ఆహార కల్తీని నిరోధించేందుకు మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేస్తామన్న బల్దియా అధికారులు ఒక వాహనాన్ని నగరంలో ప్రవేశపెట్టినప్పటికీ ఇది అలంకారప్రాయంగా మారింది. గ్రేటర్‌ పరిధిలో ఆహార తనిఖీలు నిర్వహించే మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లు సుమారు 50 వరకు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ల్యాబ్‌ల్లోనూ 54 రకాల ఆహార కల్తీ పరీక్షలు నిర్వహించేలా వసతులు ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం నాచారంలోని ఫుడ్‌సేఫ్టీ ల్యాబ్‌లో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు తీసుకున్న ఆహార నమూనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఆలస్యమవుతుండడంతో అక్రమార్కులు సులభంగా తప్పించుకుంటున్నారు.  

భారీ జరిమానాలు విధించే యోచనలో సర్కారు..
ప్రస్తుతం ఆహార కల్తీ నిరోధక చట్టం కింద విధిస్తున్న జరిమానాలు వందల్లో ఉండటంతో ఈ చట్టానికి మరింత పదును పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేబినెట్‌ ఆమోదంతో ఈ చట్టాన్ని త్వరలో అమల్లోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. నూతన చట్టంలో ఆహార కల్తీకి పాల్పడేవారిపై జరిమానాలు ప్రస్తుతం ఉన్న మొత్తానికి పది రెట్లు పెంచనున్నట్లు తెలిసింది. తద్వారా అక్రమార్కులు దారికి వస్తారని.. కల్తీ శ్రుతి మించితే సదరు వ్యక్తులపై క్రిమినల్‌ కేసుల నమోదుకు అవకాశం కల్పించేలా చట్టానికి పదునుపెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది.  

కల్తీ ఆహారంతోరోగాలు తథ్యం  
కల్తీ ఆహారంతో వాంతులు, విరేచనాలు, డయేరియా, జీర్ణకోశ వ్యాధులు, టైఫాయిడ్, హెపటైటిస్, కామెర్లు తదితర వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచిఉంది. అపరిశుభ్ర వాతావరణంలో తయారుచేసిన ఆహార పదార్థాలను తినకపోవడమే మంచిది. రుచికోసం శుచి లేని ఆహారం తీసుకొని ఇబ్బందులపాలు కావద్దు. ప్రస్తుతం వైరల్‌ ఫీవర్స్‌ పంజా విసురుతున్న నేపథ్యంలో సదా అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్‌ బీరప్ప,
గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, నిమ్స్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top