మరో ఐదుగురు డిశ్చార్జి | five students are discharged from yashoda hospital | Sakshi
Sakshi News home page

మరో ఐదుగురు డిశ్చార్జి

Aug 1 2014 1:08 AM | Updated on Sep 2 2017 11:10 AM

మరో ఐదుగురు డిశ్చార్జి

మరో ఐదుగురు డిశ్చార్జి

మాసాయిపేట బస్సు దుర్ఘటన లో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఐదు మంది విద్యార్థులు గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

మాసాయిపేట బాధితుల్లో కోలుకుంటున్న మరో ఇద్దరు 
విషమ పరిస్థితిలోనే ఇద్దరు


హైదరాబాద్: మాసాయిపేట బస్సు దుర్ఘటన లో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఐదు మంది విద్యార్థులు గురువారం ఆస్పత్రి నుం చి డిశ్చార్జి అయ్యారు. బుధవారం 9 మంది విద్యార్థులు డిశ్చార్జి కాగా మరో ఇద్దరిని డిశ్చార్జి చేసినా ఒక రోజు ఇక్కడే ఉంటామని చెప్పారు. గురువారం వారిద్దరితో పాటు మరో ముగ్గురిని వైద్యులు డిశ్చార్జి చేశారు.
 
ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెడికల్ డెరైక్టర్ డాక్టర్ లింగయ్యతోపాటు వారికి చికిత్స చేసిన వైద్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు తమ అనుభవాలను వెల్లడించారు. రుచిత గౌడ్(8), శ్రావణి(6), శిరీష అలియాస్ త్రిష(8), దర్శన్‌గౌడ్ అలియాస్ ధనుష్(6), నబీరా ఫాతిమా(9)లను డిశ్చార్జి చేశారు. నితూష(7) ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ప్రత్యేక వార్డుకు తరలించారు. శరత్ పరిస్థితి ఆందోళనకరంగా  ఉండటంతో వైద్యుల పరిశీలనలోనే కొనసాగుతున్నాడు. ప్రశాంత్(6), వరుణ్‌గౌడ్(7) ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.
 
జూలై 24న జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడిన 20 మంది విద్యార్థులను ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. వైద్యు లు, నర్సింగ్ స్టాఫ్, వివిధ విభాగాల సిబ్బంది అంతా సమష్టిగా వైద్యం అందించడంతో విద్యార్థులు త్వరగా కోలుకుని ఇంటికి వెళ్లగలిగారని డాక్టర్ లింగయ్య చెప్పారు. కార్యక్రమంలో ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్, స్పెషలిస్టు వైద్యులు మారుతి, మురళీమోహన్‌రెడ్డి, రామకృష్ణ, జయంతి, శశిధర్, కార్తీక్  పాల్గొన్నారు.
 
విషాదం.. ఒకింత ఆనందం
డిశ్చార్జి అవుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో కొందరిలో సంతోషం కనిపించగా, ఇద్దరి కుటుంబాల్లో మనసంతా విషాదం తొంగిచూస్తుండగా ఒకింత ఆనందం వ్యక్తమైంది. ఒకరు మరణించగా, మరొకరు కోలుకోవడంతో దుర్ఘటన ఛాయలు వెంటాడుతూనే ఉన్నాయి.
 
స్కూల్ బస్సులో డీజిల్ అయిపోయిందా?
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొన్న దుర్ఘటనలో కొత్త కోణం వెలుగుచూసింది. బస్సులో డీజిల్ అయిపోవడంతో అది పట్టాలపైకి రాగానే ఆగిపోయిందని, ఈ విషయాన్ని స్కూల్ యాజ మాన్యానికి తెలియజేసేందుకు డ్రైవర్ భిక్షపతి ఫోన్‌లో మాట్లాడుతుండగా ప్రమాదం జరిగిపోయిందని కొందరు గ్రామస్తులు రైల్వే పోలీసులకు చెప్పినట్టు తెలిసింది.  
 
ఈ దిశగా రైల్వే పోలీసులు దృష్టిసారించి విచారణ జరుపుతున్నట్టు సమాచారం. లెవల్ క్రాసింగ్ వద్ద వాచ్‌మెన్‌తోపాటు గేటును ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం, స్థానికులు ఆరోపించగా.. డ్రైవర్ బిక్షపతి నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని రైల్వే పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు.రెగ్యులర్ డ్రైవర్ రాకపోవడంతో అనారోగ్యంగా ఉన్న భిక్షపతిపై స్కూలు యాజమాన్యం ఒత్తిడి తీసుకొచ్చి మరీ బస్సు నడిపేలా చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement