కేసీఆర్ భిక్ష వల్లే మంత్రి పదవి
ఆయన మహనీయుడు: ఎర్రబెల్లి
పర్వతగిరిలో ‘పల్లె ప్రగతి’ పరిశీలన
తనకు తానుగా రూ.500 జరిమానా విధించుకున్న మంత్రి
పర్వతగిరి: ‘ముఖ్యమంత్రి కేసీఆర్ మహనీయుడు.. ఈ మంత్రి పదవి ఆయన పెట్టిన భిక్షే’అని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లాలోని తన స్వగ్రామం పర్వతగిరిలో బుధవారం పల్లె ప్రగతి–2 పనులను వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎంపీ పసునూరి దయాకర్, సర్పంచ్ మాలతితో కలసి పరిశీలించారు.
తాను ఏ స్థాయికి ఎదిగినా పుట్టి పెరిగిన గ్రామాన్ని మరిచిపోనని, ఊరు అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తానని చెప్పారు. వర్ధన్నపేట నుంచి మూడు సార్లు, పాలకుర్తి నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ తనను ఏ ముఖ్యమంత్రి గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న దయాకర్రావు మంగళవారం రాత్రి పర్వతగిరిలో బస చేశారు. పర్వతగిరి నుంచి అన్నారం రోడ్డు వరకు వెళ్లే పద్మశాలి కాలనీలోని తన సొంత స్థలంలో చెత్తను గమనించిన మంత్రి.. తనకు రూ.500 జరిమానా విధించాలని పంచాయతీ కార్యదర్శి రమేష్ను కోరారు.