
కందకాల తవ్వకంతో చేను కిందే చెరువు
తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాగునీటి ప్రాజెక్టులు కట్టేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం తరఫున ఆ ప్రయత్నం చేయాల్సిందే.
♦ రూ.4 వేల కోట్లతో ప్రతి ఎకరానికీ సాగునీటి భద్రత..
♦ ఏడాదిలో తెలంగాణ భూముల్లో తవ్వకం పూర్తవుతుంది
♦ తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల వేదిక
♦ నేతలు చంద్రమౌళి, శ్యాంప్రసాద్రెడ్డి
♦ ‘సాక్షి’ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా చిట్యాల,
♦ దేవరకొండల్లో అవగాహన సదస్సులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాగునీటి ప్రాజెక్టులు కట్టేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం తరఫున ఆ ప్రయత్నం చేయాల్సిందే. కానీ, ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు దశాబ్దాలకాలం పట్టవచ్చు. అప్పటివరకు కురిసిన వర్షపునీరు భూగర్భంలో ఇంకిపోకుండా వృథా కావడం వల్ల ఉపయోగం లేదు. తెలంగాణ ప్రభుత్వం తలుచుకుంటే ఏడాదిలో రూ. 4 వేల కోట్లు ఖర్చు పెట్టి, కందకాలు తవ్విస్తే.. కురిసే ప్రతి చినుకునూ సద్వినియోగం చేసుకుని భూగర్భ జలంగా మార్చుకోవచ్చు..’ అని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల వేదిక రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సం గెం చంద్రమౌళి, మేరెడ్డి శ్యాంపస్రాద్రెడ్డి అన్నారు. ఈ నిధులను ఏకకాలంలో వెచ్చిం చడం ద్వారా తెలంగాణలో ఉన్న ప్రతి ఎకరం భూమిలో కందకాలను తవ్వించవచ్చని, తద్వారా ప్రతి వర్షపు బొట్టును భూమిలోకి ఇంకేలా చేయవచ్చని అన్నారు.
బుధవారం నల్లగొండ జిల్లా చిట్యాల, దేవరకొండల్లో ‘సాక్షి’, తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఇంజనీర్ల వేదిక ఆధ్వర్యంలో కందకాల తవ్వకంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సుల్లో చంద్రమౌళి, శ్యాంప్రసాద్రెడ్డి మాట్లాడుతూ కందకాలు తవ్వుకోవడం ద్వారా ‘మన చేను కిందే.. చెరువు’ను ఏర్పాటు చేసుకోవచ్చని, ఈ కందకాల్లోకి వచ్చిన నీరు భూగర్భంలోకి వెళ్లి ఎంతటి కరువు కాటకాల్లో అయి నా చేనుకు ఉపయోగపడేంతటి నీటిని అంది స్తాయని చెప్పారు.
కందకాలను తవ్వుకోవడం వల్ల ఎకరానికి 2 శాతం భూమి కంటే ఎక్కువ నష్టం జరగదని, ఖర్చు కూడా ఎకరానికి రూ. 2 వేల కంటే ఎక్కువ కాదన్నారు. భూమి రకాన్ని బట్టి, భూమి ఉన్న స్థితిని బట్టి పకడ్బందీగా కందకాలను తవ్వుకోవడం ద్వారా నీటిని భూమిలో దాచుకుని.. ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుని వాడుకున్నట్టు నీరు అవసరం అయినప్పుడల్లా తీసుకుని వాడుకోవచ్చన్నారు. కందకాలు తవ్వుకునే విధానాలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిం చారు. సదస్సులకు హాజరైన రైతాంగం అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలిచ్చారు. సదస్సులకు హాజరైన రైతులు తాము కూడా కందకాలు తవ్వించుకుంటామని స్వచ్ఛందం గా ముందుకు రావడం గమనార్హం. కొందరు రైతులు తాము కందకాలు తవ్వుకున్నందున జరిగిన ప్రయోజనాల్ని కూడా వివరించారు. కార్యక్రమంలో‘సాక్షి’ సాగుబడి డెస్క్ ఇన్చార్జ్ పంతంగి రాంబాబు, స్థానిక ప్రజా ప్రతిని ధులు, రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.