ఓటును నోటుకు అమ్ముకోవద్దు

Don't Vote In Election By Taking Money Said By Marre Janardhanreddy - Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌ : ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటును నోటుకు అమ్ముకోవద్దని, నీతి, నిజాయితీతో ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని  ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో తెలంగాణ ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు నాడు అంబేద్కర్‌ రాజ్యాంగంలో ఓటుహక్కు కల్పించారన్నారు.

కొంతమంది స్వార్థపరులు ఓటును నోటుకు అమ్ముకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, ఫలితంగా ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా వెనకబడుతున్నాయన్నారు.  రాములును ఎంపీగా గెలిపించి పార్లమెంట్‌కు పంపించాలని, అప్పుడే ఈ ప్రాంత సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు భగవంతు, విజయ్‌కుమార్, జయశంకర్, నాగేష్, నిరంజనమ్మ, రాములు తదితరులు పాల్గొన్నారు. 

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి 
తాడూరు: టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండలంలోని ఇంద్రకల్, మేడిపూర్‌ గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ హయాంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించిందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధి శూన్యమన్నారు. స్థానంగా అందరికి అందుబాటులో ఉండే రాములును గెలిపించాలన్నారు.

అనంతరం సింగిల్‌ విండో అధ్యక్షుడు సమ్మద్‌పాష ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకులు కృష్ణమోహన్‌రావు శ్రీశైలంతో పాటు కార్యకర్తలు పార్టీలో చేరారు. సమావేశంలో సర్పంచ్‌ రమణ, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు రమేష్, టీఆర్‌ఎస్‌ నాయకులు మధుసూదన్‌రెడ్డి, కార్యదర్శి మల్లెపల్లి వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రాజెక్టులు పూర్తికావాలంటే టీఆర్‌ఎస్‌ ఎంపీలను గెలిపించాలి 
తిమ్మాజిపేట: తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తికావాలంటే టీఆర్‌ఎస్‌ ఎంపీలను గెలిపించాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో పూర్తికావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా టీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలువడం ముఖ్యమన్నారు. పాలమూర్‌–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి కావాలంటే కేంద్రం నిధులు అవసరమన్నారు. కేంద్రంలో ఏర్పాడే ప్రభుత్వంలో టీఆర్‌ఎస్‌ ముఖ్య భూమిక పోషించాలన్నారు. పాలమూర్‌–రంగారెడ్డి పూర్తయితే మండల పరిధిలో పూర్తిస్థాయిలో  సాగునీరు అందుతుందన్నారు.

టీఆర్‌ఎస్‌లో చేరికలు 
టీఆర్‌ఎస్‌ పార్టీలో పలువురు కాంగ్రెస్, ముదిరాజ్‌ సంఘం నాయకులు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. సంఘం నాయకులు వనమోలి బాల్‌రాజు, చింతకాయాల వెంకటయ్య, చింతకాయల నాగయ్య, పెద్దనాగయ్య, పూజరి బాల్‌రాజు, పురమోని బాల్‌రాజు, మాలమహానాడు నీరంజన్, 6వ వార్డు మెంబర్‌ చంద్రమ్మ, ఆటోడ్రైవర్ల యూనియన్‌ సభ్యులు జంగయ్యలు పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్‌ రవీందర్‌రెడ్డి, నాయకులు ప్రదీప్, వేణుగోపాల్‌గౌడ్, ఎంపీపీ జయలక్ష్మి, చింతకింది లింగం, లీలావతి పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top