
రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారిణికి చెక్కును అందజేస్తున్న డీజీపీ సతీమణి అనిత
సాక్షి, కూసుమంచి/తలకొండపల్లి : రైతుబంధు పథకం ద్వారా వచ్చిన రెండు చెక్కులను డీజీపీ మహేందర్రెడ్డి దంపతులు వదులుకున్నారు. మొత్తం రూ.1,59,080 లక్షల విలువ గల చెక్కులను గురువారం తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేశారు. మహేందర్రెడ్డికి ఖమ్మం జిల్లా కిష్టాపురంలో వ్యవసాయ భూమి ఉంది. రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం రూ.81,780 చెక్కు అందించింది. అయితే ఆ మొత్తాన్ని డీజీపీ తిరిగి ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించారు. ఆయన సూచన మేరకు సోదరుడు వెంకటరెడ్డి.. తహసీల్దార్ కృష్ణ, ఏఓ అరుణకుమారిని కలసి చెక్కును అందజేశారు.
అలాగే.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల పరిధిలోని పడకల్ గ్రామంలో డీజీపీ సతీమణి అనిత పేరు మీద సుమారు 19 ఎకరాల భూమి ఉంది. ఇందుకు రూ.77,300 చెక్కును తహసీల్దార్ ఆర్పీ జ్యోతి అందజేశారు. అయితే.. గురువారం ఆ చెక్కును జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డికి డీజీపీ సతీమణి తిరిగిచ్చేశారు. ఆ డబ్బులను ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించాలని కోరారు.