ఎవరు.. ఎక్కడ..?

Congress Candidates List Yet To Come - Sakshi

భువనగిరిలో కుంభం, ఆలేరులో    భిక్షమయ్యగౌడ్‌..?

మునుగోడు, తుంగతుర్తి ఎవరికో..

రేపు జాబితా ప్రకటించే అవకాశం

పార్టీ శ్రేణుల ఎదురుచూపు

ఆసక్తిగా గమనిస్తున్న అధికార టీఆర్‌ఎస్‌

సుదీర్ఘ కసరత్తు, ఆశావహుల వడబోత అనంతరం.. అభ్యర్థుల జాబితా ప్రకటించేందుకు ‘హస్తం’ సిద్ధమైంది. ఎవరెవరు ఎక్కడెక్కడినుంచి బరిలోకి దిగుతారో దాదాపు ఖరారైందని పార్టీ వర్గాల ద్వారా జరుగుతున్న సమాచారంతో అటు ఆశావహుల్లో, ఇటు కేడర్‌లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. భువనగిరి, ఆలేరు విషయంలో ఓ క్లారిటీ వచ్చిందని.. తుంగతుర్తి, మునుగోడు విషయంలోనూ తుది కసరత్తు చేసిన అధిష్టానం ఆశావహులను పిలిపించి బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీలో తీవ్ర ఉత్కంఠను రేకిత్తిస్తుండగా అధికార టీఆర్‌ఎస్‌ ఆసక్తిగా చూస్తోంది.

సాక్షి, యాదాద్రి : కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించేందుకు ముహూర్తం దగ్గర పడింది. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, ఆశావహుల బుజ్జగింపులతో వాయిదా పడుతూ వస్తున్న జాబితా శనివారం వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా సైతం వెల్లడించడంతో ఆశావహుల్లో ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు చేసిన అధిష్టానం.. టికెట్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు ఆశావహులను ఢిల్లీలోని వార్‌ రూంకు పిలిపించి చర్చలు జరిపి బుజ్జగించినట్లు తెలుస్తోంది.
 
ఆలేరు, భువనగిరిపై క్లారిటీ..!
కాంగ్రెస్‌ పార్టీ రేపు విడుదల చేయనున్న తొలి జాబితాలో 74మంది పేర్లు ఖరారైనట్లు ప్రచారం జరుగుతుండగా యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు సంబంధించి క్లారిటీ వచ్చిన ట్లు తెలుస్తోంది.  మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి ఆశావహులను ఢిల్లీకి పిలిపించి బుజ్జగిస్తున్నట్లు సమాచారం.

కొనసాగుతున్న ఉత్కంఠ
కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ రూపొందించిన ఫైనల్‌ జాబి తాపై ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉం ది. పొత్తులో భాగంగా జిల్లా పరిధిలోని కొన్ని సీట్లను తమకు ఇవ్వాలని విపక్షాలు పట్టుబడుతున్నా యి. ప్రధానంగా ఆలేరులో టీజేఎస్, మునుగోడు సీపీఐ కోరుతున్నాయి. ఇక్కడ ఏం జరుగబోతుందన్న టెన్షన్‌ ఆశావహుల్లో నెలకొంది.

ఆలేరుకు భిక్షమయ్య..?
ఆలేరు నియోజకవర్గానికి డీసీసీ అధ్యక్షుడు బూడి ద భిక్షమయ్యగౌడ్‌ పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇదే సీటును మహాకూటమిలోని టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు ఆశిస్తున్నాయి. తొలుత టీడీపీ, సీపీఐ ఆలేరు సీటుకోసం పట్టుబట్టాయి. కానీ ఆ తర్వాత టీపీఎస్‌ కన్వీనర్‌ కల్లూరి రామచంద్రారెడ్డి టీజేఎస్‌లో చేరికతో సమీకరణలు కొంత మారాయి. ఆ సీటు తమకే కేటాయించాలని ఆ పార్టీ అధినేత కోదండరాం పట్టు బడుతూవచ్చారు. కాగా భిక్షమయ్యగౌడ్‌ ఆలేరు టికెట్‌ తనదేనన్న గట్టి నమ్మకంతో ఎప్పటినుంచో ప్రచారం కొనసాగిస్తున్నారు. అలాగే తనకు టికెట్‌ కేటాయించాలని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు పల్లె శ్రీనివాస్‌గౌడ్‌ సైతం  ఏఐసీసీ వరకు ప్రయత్నాలు చేశారు. వీరితో మరికొందరు టికెట్‌ కోసం ప్రయత్నాలు సాగించారు. అయితే ముందునుంచి ధీమాతో ఉన్న భిక్షమయ్యగౌడ్‌కు టికెట్‌ ఖరారైందన్న సంకేతాలు అందుతున్నాయి.

భువనగిరినుంచి..
భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంనుంచి కూటమి భాగస్వామ్య పక్షాలతో  పాటు కాంగ్రెస్‌లోని బీసీ వర్గానికి చెందిన నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌ కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అయినప్పటికీ బీసీ నేతలు తమలో ఎవరో ఒకరికి టికెట్‌ ఇవ్వాలని అధిష్టానంపై ఇంకా ఒత్తిడి తెస్తూనే ఉన్నారు.   ఇప్పటికే టీపీసీసీ నుంచి ఢిల్లీ వరకు చేయని ప్రయత్నమంటూ లేదు.  పోత్నక్‌ ప్రమోద్‌కుమార్, పచ్చిమట్ల శివరాజ్‌గౌడ్, పంజాలరామాంజనేయులు, తడక కల్పన, తంగళ్లపల్లి రవికుమార్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, అందెల లింగంయాదవ్, గర్దాసు బాలయ్య బీసీ సామాజిక వర్గం నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. మరోవైపు  యువతెలంగాణ పార్టీ తరఫున టీజేఎస్‌ నుంచి పోటీ చేయడానికి జిట్టా బాలకృష్ణారెడ్డి సైతం టికెట్‌ ఆశించారు. అయితే టికెట్‌ విషయంలో  సానుకూలత రాలేదు.
 
మునుగోడు..
మునుగోడు నియోజకవర్గంలో కూటమి తతరఫున కాంగ్రెస్, సీపీఐలు పట్టుబడుతున్నాయి. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి పాల్వాయి స్రవంతిలు టికెట్‌ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. అయితే అధిష్టానం గురువారం పాల్వాయి స్రవంతిని ఢిల్లీ పిలిపించి వార్‌ రూమ్‌లో బుజ్జగింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తనకే టికెట్‌ వస్తుందని ప్రచారం ప్రారంభించారు. ఈ నియోజకవర్గంలో గతంలో సీపీఐ, కాంగ్రెస్‌లు హోరాహోరీగా పోటీపడి గెలిచాయి. 2014 ఎన్నికలో ఒక్కసారే  టీఆర్‌ఎస్‌నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలిచారు. ప్రస్తుతం  కూటమిలో పొత్తులో సీటును తమకు కేటాయించాలని సీపీఐ కోరుతోంది. దీంతో ఈ సీటుపై పీఠముడి పడింది. టికెట్‌ పై నిర్ణయాన్ని  అధిష్టానానికి వదిలేశారు.

తుంగతుర్తిలో..
తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రేసులో ఉన్న అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ను అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది. ఇక్కడ దయాకర్‌తోపాటు డాక్టర్‌ రవికుమార్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. అయితే డాక్టర్‌ రవికుమార్‌కు టికెట్‌ ఖరారైందన్న ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే బుజ్జగింపుల కోసం దయాకర్‌ను ఢిల్లీ పిలిపించి  చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top