మళ్లీ  లాక్‌డౌన్‌ ఉండదు

CM Chandrasekhar Rao Says No Further Lockdown In The Country - Sakshi

లాక్‌డౌన్‌ వదంతులపై సీఎం కేసీఆర్‌ అడిగిన ప్రశ్నకు మోదీ జవాబు

లాక్‌డౌన్‌ల దశ ముగిసి.. అన్‌లాక్‌ల దశ ప్రారంభమైందని స్పష్టీకరణ

సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారనే వదంతులు వినిపిస్తున్నాయని, దీనిపై స్పష్టతనివ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన విజ్ఞప్తికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. దేశంలో లాక్‌డౌన్‌ల దశ ముగిసి, అన్‌లాక్‌ దశ ప్రారంభమైందని ప్రధానమంత్రి బదులిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడారు. ‘దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రధానమంత్రి మీడియాతో మాట్లాడుతున్నారనగానే లాక్‌డౌన్‌ ప్రకటిస్తారని అనుకుంటున్నారు. ప్రధానమంత్రి అందరు ముఖ్యమంత్రులతో మాట్లాడకుండా లాక్‌డౌన్‌ విషయంలో నిర్ణ యం తీసుకోరని నేను చెబుతున్నాను. దీనిపై స్పష్టత ఇవ్వండి’అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. దీనికి ప్రధాని మోదీ స్పందించారు. ‘దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ ఉండదు. నాలుగు దశల లాక్‌డౌన్‌ ముగిసింది. అన్‌లాక్‌ 1.0 నడుస్తోంది. అన్‌లాక్‌ 2.0 ఎలా అమలు చేయాలనేదే మనమంతా చర్చించుకోవాలి’అని ప్రధాని స్పష్టం చేశారు. 

కరోనా అదుపులోనే ఉంది..
‘కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నది. కరోనా ప్రస్తుతం అదుపులోనే ఉన్నది. మరణాల రేటు కూడా తక్కువగానే నమోదవుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా సాగిస్తున్న పోరు వల్ల కరోనా విషయంలో తప్పక విజయం సాధిస్తామనే విశ్వాసం మాకుంది. తెలంగాణలో హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడా వ్యాప్తి నివారణకు గట్టిగా ప్రయత్నిస్తున్నం’అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలను ప్రధానికి వివరించారు.

మా సీఎస్‌ కూడా బిహారీనే: నితీష్‌తో కేసీఆర్‌
‘కొద్దిరోజుల్లోనే వ్యాప్తి అదుపులోకి వస్తుందనే విశ్వాసం నాకున్నది. మళ్లీ మామూలు జీవితం ప్రారంభమవుతున్నది. వివిధ రాష్ట్రాల నుంచి కూలీలు, కార్మికులు, హమాలీలు మళ్లీ పని చేసుకోవడానికి వివిధ రాష్ట్రాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. వారికి అవకాశం కల్పించాలి. దేశమంతా ఒక్కటే. ఎక్కడి వారు ఎక్కడికి పోయైనా పనిచేసుకునే అవకాశం ఉండాలి. బిహార్‌ నుంచి హమాలీలు తెలంగాణకు రావడానికి సిద్ధమవుతున్నారు’అని సీఎం చెప్పారు. బిహార్‌ నుంచి వచ్చే హమాలీలను అక్కడి ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ వారిస్తున్నట్లు వచ్చిన వార్తలపై కేసీఆర్‌ సరదాగా స్పందించారు. ‘నితీష్‌ గారు, మేము తెలంగాణలో మీ హమాలీలను బాగా చూసుకుంటాం. మా సీఎస్‌ కూడా మీ బిహార్‌ వారే. దయచేసి పంపించండి’అని కేసీఆర్‌ అన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top