ప్రైవేటు ఆసుపత్రులకు ‘కరోనా’ భయం! | Central Health Department Resents Private Hospitals | Sakshi
Sakshi News home page

ప్రైవేటు ఆసుపత్రులకు ‘కరోనా’ భయం!

May 3 2020 2:53 AM | Updated on May 3 2020 2:53 AM

Central Health Department Resents Private Hospitals - Sakshi

‘కరోనా నేపథ్యంలో రోగులను చూడాలంటేనే భయమేస్తుంది. ఇంట్లో భార్యాపిల్లలు ఉన్నారు. ఈ సమయంలో రిస్క్‌ చేయడం మంచిదికాదు. అందుకే క్లినిక్‌ తెరవట్లేదు. బతికుంటే ఊరెళ్లి వ్యవసాయం చేసుకుంటా..’    – హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు క్లినిక్‌కు చెందిన శ్వాసకోశ స్పెషలిస్ట్‌ వైద్యుడు

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఆసుపత్రులను కరోనా భయం వెంటాడుతోంది. ఆసుపత్రులను తెరిస్తే గుంపులుగా జనం వస్తారని, కరోనా వ్యాప్తి చెందుతుందన్న ఆందోళన యాజమాన్యాల్లో నెలకొం ది. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఔట్‌ పేషెంట్‌ (ఓపీ) సేవలు ప్రారంభించాలని కోరినా చాలా జిల్లాల్లో ప్రైవేట్‌ ఆసుపత్రులు ముందుకు రావట్లేదు. మరోవైపు కొన్ని జిల్లాల్లో ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. ఖమ్మం జిల్లాలో ఓపీ సేవలు ప్రారంభించాలని అక్కడి వైద్యాధికారి ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో తాము వైద్యసేవలందిస్తున్నట్టు అక్కడి ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ యలమంచిలి రవీంద్రనాథ్‌ తెలిపారు. సిద్దిపేటలోనూ ఓపీ సేవలు నడుస్తున్నాయి.

కరీంనగర్‌ జిల్లాలో 15రోజుల క్రితమే ఓపీ సేవలు ప్రారంభించాలని అక్క డి కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు. దీంతో అక్కడ కొన్ని ఆసుపత్రుల్లో ఓపీ సేవలు ప్రారంభిం చారు. శ్వాసకోశ సంబంధ కేసుల విషయంలో మాత్రం అక్కడి ఆసుపత్రులు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లో కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులు రెండు మూడు రోజుల క్రితమే ఓపీ సేవలు ప్రారంభించగా, మరికొన్ని ఇంకా ప్రారంభించలేదు. సాధారణ రోజులతో పోలిస్తే 20–30 శాతానికి మించి రోగులు రావట్లేదని పేర్కొంది. ఓపీ వైద్య సేవలు నిర్వహిస్తున్న ఆసుపత్రులు భౌతికదూరాన్ని పాటిస్తున్నాయి. కరోనా అనుమానిత రోగులుంటే వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు చెబుతున్నారు.

కేంద్రం చెప్పినా కదలిక లేదు..
రోగుల వల్ల కరోనా సోకుతుందనే భయం తో చాలాచోట్ల డాక్టర్లు ఆసుపత్రులు, క్లినిక్‌లను తెరవడంలేదని కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి ప్రీతిసూడాన్‌ రాష్ట్రాలకు లేఖ రాశారు. కొన్ని ఆస్పత్రులు, క్లినిక్‌ లు సేవలందించడానికి ముందు కరోనా పరీక్షలు చేయించుకొని రావాలని పట్టుబడుతున్నాయని, డయాలసిస్‌ వంటి సేవలం దించడానికి సంకోచిస్తున్నాయని ప్రీతిసూడాన్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించిన ప్పటికీ ప్రైవేటు ఆస్పత్రులయాజమాన్యాల్లో కదలిక లేదు.

ఓపీ, ఐపీ సేవలు కొనసాగించాలి: ఐఎంఏ
ఇన్, ఔట్‌ పేషెంట్‌ సేవల్ని యథావిధిగా కొనసాగించాలని ప్రైవేటు ఆసుపత్రులకు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) తెలంగాణ విభాగం సూచించింది. ఓపీ క్లినిక్‌లు కూడా తెరవాలని కోరింది. డాక్టర్లు, ఇతర సిబ్బంది రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రక్షణ పరికరాలు అందుబాటులో లేకుంటే ఆసుపత్రులు తెరవవద్దని పేర్కొంది. డాక్టర్‌కు, రోగికి మధ్య అడ్డుగా ఏదైనా ఉండేలా చూసుకోవాలని, దూరం పాటించాలని సూచించింది. కంటైన్మెంట్, రెడ్‌జోన్లలో మాత్రం ఆసుపత్రులు అసలు తెరవరాదని సూచించింది.

లాక్‌డౌన్‌ తర్వాతే 
లాక్‌డౌన్‌ ముగిశాకే పూర్తిస్థాయిలో నడుపుతామని ఆసుపత్రుల ప్రతి నిధు లు చెబుతున్నారు. రోగులూ  రాకపోవడంతో కార్పొరేట్‌ ఆసుపత్రుల డాక్టర్లు సెలవులను కుటుంబంతో గడుపుతున్నారు. లాక్‌డౌన్‌ ముగిశాక వస్తామని డాక్టర్లు అంటున్నారని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రి తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రం లో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. 22 జిల్లాలు కరోనా రహితంగా మారుతున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో ఓపీ సేవలు ప్రారంభమవుతాయని అంటున్నారు. హైదరాబాద్‌లో కరోనా తీవ్రత ఉన్న ప్రాంతాల్లోని ఆసుపత్రులు, క్లినిక్‌లు ఇప్పటికిప్పుడు తెరుచుకునే పరిస్థితి కనిపించట్లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement