
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ భాస్కర్
జడ్చర్ల : నాలుగేళ్లుగా సెల్ఫోన్లు దొంగిలిస్తూ.. ఎవరికీ చిక్కకుండా తప్పించుకుంటూ.. యథేచ్ఛగా తమ దొంగతనాలను కొనసాగిస్తున్న దొంగల ముఠాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి బుధవారం జడ్చర్ల పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహబూబ్నగర్ డీఎస్పీ భాస్కర్ వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లాకు చెందిన బేతంపల్లి ఎల్లప్ప, వడ్డె గౌరీ, బేతంపల్లి ప్రభు, వడ్డె సంధ్య, వడ్డె ప్రశాంత్లు భూత్పూర్ మండలం అమిస్తాపూర్, దేవరకద్రలో ఆటో డ్రైవర్లుగా చెలామని అవుతూ అద్దె ఇళ్లలో ఉంటూ వివిధ ప్రాంతాలు తిరుగుతూ సెల్ఫోన్లను చోరీ చేసేవారు. ప్రధానంగా సంతలు, బస్టాండ్లు, జాతరలు తదితర జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని సెల్ఫోన్లను చాకచక్యంగా అపహరించేవారు. ఇలా అపహరించిన సెల్ఫోన్లను హైదరాబాద్లో తక్కువ ధరలకు విక్రయించేవారు.
పట్టుబడ్డారు ఇలా..
ఈ నెల 23న కృష్ణారావు అనే వ్యక్తి కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా తన సెల్ఫోన్ను జడ్చర్ల కొత్త బస్టాండ్లో దొంగలు కొట్టేశారని స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కొత్త బస్టాండ్లో నిఘా వేయగా నిందితులు తాము దొంగిలించిన ఫోన్లను హైదరాబాద్లో అమ్మేందుకు వెళ్తూ తమకు చిక్కినట్లు డీఎస్పీ తెలిపారు. వీరిలో వడ్డె గౌరీ, వడ్డే ప్రశాంత్లు తప్పించుకుని పారిపోగా.. మిగతా నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి శ్యాంసంగ్, ఐ ఫోన్లు తదితర కంపెనీలకు చెందిన మొత్తం 72 ఫోన్లను స్వాధీనపర్చుకున్నామని, వీటి విలువ దాదాపు రూ.5 లక్షలు ఉంటుందన్నారు.