
బోధన్ స్కాంలో డిప్యూటీ కమిషనర్ అరెస్ట్
బోధన్ వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన కుంభకోణంలో ఆదివారం పెద్ద వికెట్పడింది. ఎస్పీ హోదాలో పనిచేసే డిప్యూటీ కమిషనర్ను సీఐడీ అరెస్ట్ చేసింది.
♦ కుంభకోణంలోఈయనదే కీలకపాత్ర
♦ ఓ సీటీవోనూ అదుపులోకి తీసుకున్న సీఐడీ
♦ మిగతా 17మందికి కౌంట్ డౌన్ మొదలు
సాక్షి, హైదరాబాద్: బోధన్ వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన కుంభకోణంలో ఆదివారం పెద్ద వికెట్పడింది. ఎస్పీ హోదాలో పనిచేసే డిప్యూటీ కమిషనర్ను సీఐడీ అరెస్ట్ చేసింది. కుంభకోణంలో నిందితులతో సంబంధాలు కొనసాగించడంతో పాటుగా నకిలీ చలాన్లు సృష్టించి, తప్పుడు ఆడిటింగ్కు పాల్పడటం లో ఈయనదే కీలక పాత్రగా సీఐడీ ఆధారాలు సేకరించింది. ఈయనతో పాటు మరో సీటీవో శివరాజు గ్యాంగ్తో కలసి అక్రమాల కు పాల్పడ్డట్లు గుర్తించి ఆయన్ను సైతం అరెస్ట్ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య పన్నుల శాఖలో అక్రమాలకు పాల్పడిన అధికారుల్లో వణుకు మొదలైంది.
కమిషనరే రింగ్ లీడర్..
బోధన్, నిజామాబాద్, కామారెడ్డి, నిజా మాబాద్ రూరల్..ఈ నాలుగు సర్కిల్ కార్యాలయాల్లో రైస్ మిల్లర్లు, వ్యాపారాలు నిర్వహించే వారి నుంచి ట్యాక్స్ వసూళ్లు భారీ మొత్తంలో ఉంటాయి. అయితే గతంలో నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్గా పని చేసిన ఈయన ప్రస్తుతం హైదరాబాద్ కేం ద్రంలో పనిచేస్తున్నారని సీఐడీ అధికారులు స్పష్టంచేశారు. కేసు ప్రారంభ దశలో ఏసీటీ వో, ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
బోధన్ స్కాంలో కీలక నిందితులు శివరాజ్, అతడి కుమారుడు సునీల్ కుమార్తో కలసి ఇప్పుడు అరెస్టయిన సీటీవో కూడా కుంభకోణానికి అండదండలు అందించినట్లు సీఐడీ గుర్తించింది. స్వంత విభాగంలోనే అవినీతి అధికారులపై వేట సాగించిన సీఐడీ ఇక కమర్షియల్ ట్యాక్స్లోని అవినీతి అధికారులను కటకటాల్లోకి నెట్టడం ప్రారంభించింది.
ఈ డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో శివరాజు, సునీల్ ఏయే అధికారికి నెలకు ఎంత కమిషన్ ఇవ్వాలి? ఏయే ప్యాకేజీలు ఇచ్చి టూర్లకు ఆఫర్ ఇవ్వాలన్న అన్ని కార్యక్రమాలు నిర్వహిం చినట్లు సీఐడీ ఆధారాలు సేకరించింది. శివరాజు అండ్ గ్యాంగ్ నుంచి నెలకు రూ.10 లక్షల చొప్పున డీసీ కమిషనర్ పుచ్చుకున్నట్టు సీఐడీ వర్గాలు తెలిపాయి.
అధికారుల్లో వణుకు
సర్కిల్ కార్యాలయాల నుంచి మొదలైన అక్రమాలు నిజామాబాద్ అర్బన్, రూరల్, కామారెడ్డి కార్యాల యాల్లోనూ కొనసాగినట్లు సీఐడీ బయ టపెట్టింది. 2005 నుంచి జరిగిన తతంగంలో మొత్తం 18 మంది అధికారుల పాత్ర స్పష్టం గా ఉందని ఇప్పటికే ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొంది. తాజాగా ఒక సర్కిల్ అధికారిని సీఐడీ అదుపులోకి తీసుకోవడంతో మిగిలిన 17 మందిలో వణుకు మొదలైంది. కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు జాయింట్ కమిషనర్లు, ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు, ఆరుగురు డివిజనల్ కమిషనర్లు, 8 మంది ఏసీటీవోలు స్కాంలో ఆరోపణలెదు ర్కుంటున్నారని, వారికీ కౌంట్డౌన్ ప్రారం భమైనట్లేనని సీఐడీ స్పష్టంచేసింది.
హోదాను బట్టి కమీషన్...
సీఐడీ విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కో అధికారి హోదాను బట్టి శివరాజు అండ్ గ్యాంగ్ కమిషన్ రేటు నిర్ణయించింది. వీరిలో ఏసీటీవోకు నెలకు రూ.లక్ష, డీసీటీవోకు రూ.2.50 లక్షలు, సీటీవోకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు, డిప్యూటీ కమిషనర్లకు రూ.10 నుంచి రూ.15 లక్షలు, అసిస్టెంట్ కమిషనర్ల/జాయింట్ కమిషనర్కు మూడు నెలలకోసారి రూ.10 లక్షల చొప్పున శివరాజు పంపిణీ చేసినట్లు సీఐడీ గుర్తించింది.
అక్రమార్కులను వదిలిపెట్టొద్దు: సీఎంఓ
కుంభకోణంలో ప్రధాన పాత్ర వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ కమిషనర్ను అరెస్ట్చేసేందుకు సీఐడీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అనుమతి కోరింది. బోధన్ స్కాంలో నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టవద్దని, స్పష్టమైన ఆధారాలుంటే అరెస్ట్ చేయాలని సీఎంఓ ఆదేశాలు జారీచేసింది. దీంతో డిప్యూటీ కమిషనర్ను సీఐడీ బృందాలు అరెస్ట్ చేశాయి.