ఏపీ, తెలంగాణ హజ్‌ యాత్రికులకు హైదరాబాద్‌లోనే ఏర్పాట్లు | AP, Telangana haj pilgrims arrange in Hyderabad | Sakshi
Sakshi News home page

ఏపీ, తెలంగాణ హజ్‌ యాత్రికులకు హైదరాబాద్‌లోనే ఏర్పాట్లు

Aug 11 2017 12:09 AM | Updated on Sep 4 2018 5:29 PM

ఏపీ, తెలంగాణ హజ్‌ యాత్రికులకు హైదరాబాద్‌లోనే ఏర్పాట్లు - Sakshi

ఏపీ, తెలంగాణ హజ్‌ యాత్రికులకు హైదరాబాద్‌లోనే ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్‌ హజ్‌ కమిటీ ద్వారా 2017 హజ్‌ యాత్రకు ఎంపికైన యాత్రికులను కేంద్ర హజ్‌ కమిటీ గన్నవరం ఎయిర్‌పోర్టు

తెలంగాణ, ఆంధ్రా హజ్‌ కమిటీల మధ్య కుదిరిన ఒప్పందం
హజ్‌ ప్రత్యేక అధికారి షుకూర్‌


సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ హజ్‌ కమిటీ ద్వారా 2017 హజ్‌ యాత్రకు ఎంపికైన యాత్రికులను కేంద్ర హజ్‌ కమిటీ గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి తీసుకెళ్లేందుకు నిరాకరించడంతో వారు కూడా హైదరాబాద్‌ నుంచి వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర హజ్‌ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్‌ఎ.షుకూర్‌ తెలిపారు. గురువారం నాంపల్లి హజ్‌హౌస్‌లోని కమిటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ యాత్రికులకు ఆగస్టు 11– 22 తేదీల్లో నాంపల్లి హజ్‌ హౌస్‌లో హజ్‌ క్యాంప్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్యాంప్‌లో అన్ని సౌకర్యాలు ఉంటాయన్నారు. కేంద్ర హజ్‌ కమిటీ సూచనల ప్రకారం మొదటి 6 రోజులు తెలంగాణ యాత్రికులు యాత్రకు వెళ్తారని, మిగిలిన 4 రోజులు ఆంధ్రా యాత్రికులు వెళ్తారన్నారు.

 తెలంగాణ యాత్రికులకు వసతి, భోజనం యాత్రకు కావాల్సిన అన్ని సౌకర్యాలు హజ్‌ హౌస్‌లోనే ఏర్పాటు చేస్తారన్నారు. ఈ మాదిరిగానే ఆంధ్రా హజ్‌ కమిటీ అధికారులు, ఆంధ్రా మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి కూడా తమ యాత్రికులకు హజ్‌హౌస్‌లోనే వసతులు కల్పించాలని నిర్ణయించారన్నారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల హజ్‌ కమిటీల మధ్య ఒప్పందం కుదిరిందని షుకూర్‌ తెలిపారు. హజ్‌ క్యాంప్‌ నిర్వహణకు అయ్యే ఖర్చులను యాత్రికుల సంఖ్య, నిష్పత్తి ప్రకారం చెల్లింపులు ఉంటాయన్నారు.

ఈ నేపథ్యంలోనే ఆంధ్రా హజ్‌ కమిటీ హజ్‌ క్యాంప్‌ నిర్వహణకు గాను ముందస్తుగా రూ.30 లక్షలు తెలంగాణ కమిటీకి చెల్లించిందన్నారు. దీంతో ఆంధ్రా యాత్రికులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకొనే బాధ్యత తెలంగాణ హజ్‌ కమిటీపై ఉంటుందన్నారు. ఆంధ్రా యాత్రికుల ప్రయాణం తేదీల్లో ఆంధ్రా హజ్‌ కమిటీ ఉద్యోగులు పూర్తి సహకారం అందిస్తారని షుకూర్‌ తెలిపారు. ఆంధ్రా యాత్రికుల కోసం ఏర్పాట్లపై చివరి వరకూ స్పష్టత లేకపోవడంతో వారు కొంత గందరగోళానికి గురయ్యారు. అయితే ఇరు రాష్ట్రాల హజ్‌ కమిటీలు ఓ పరిష్కార మార్గం కనుగొనడంతో వారికి ఇక్కట్లు తప్పాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement