ఆలేరు: పోలింగ్‌కు సర్వం సిద్ధం

Aleru Constituency Ready For Poling - Sakshi

ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు 

బరిలో 14 మంది అభ్యర్థులు 

పూర్తయిన ఓటర్‌ స్లిప్పుల పంపిణీ

వంద శాతం ఓటింగ్‌ నమోదే లక్ష్యం 

నియోజకవర్గంలో 2,09,266 మంది ఓటర్లు   

సాక్షి, ఆలేరు : పోలింగ్‌ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 7న పోలింగ్‌ జరగనుం ది. ఇందుకు గాను నియోజకవర్గానికి సంబం ధించి ఈవీఎంలు, వీవీప్యాట్లను ఇండోర్‌ స్టేడియంలోని ప్రత్యేక రూంలో భద్రపరిచారు. గురువారం ఎన్నికల సామగ్రి, సిబ్బందిని తరలించేం దుకు ఇండోర్‌ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి శిక్షణ పూర్తయింది. అలాగే ఓటర్‌ స్లిప్పుల పంపిణీ కూడా పూర్తి చేశారు. 
2,09,266 మంది ఓటర్లు..
ఆలేరు నియోజకవర్గంలో 2,09,266 మంది ఓట ర్లు ఉన్నారు. ఇందులో స్త్రీలు 1,04,040 మంది, పురుషులు 1,05,207 మంది, ఇతరులు 19 మంది ఉన్నారు. మొత్తం 303 పోలింగ్‌ కేంద్రాల ను ఏర్పాటు చేశారు. 360 మంది ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారులు, 360 మంది అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్లను నియమించారు. 34 మంది సెక్టోరియల్‌ అధికారులను నియమించారు. 606 మం ది పీఓలను నియమించగా ఒక్కో పోలింగ్‌ కేం ద్రంలో ఇద్దరు పోలింగ్‌ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తారు. నియోజకవర్గంలో 37 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. సమస్మాత్మక గ్రామాల్లో వెబ్‌కాస్టింగ్‌ నిర్వహించనున్నారు. 
డిజిటల్‌ సర్వేలెన్స్‌..
నియోజకవర్గంలో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో డిజిటల్‌ సర్వేలెన్స్‌ ద్వారా వీడియో చిత్రీకరణకు వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు పూర్తిచేశారు. పోలింగ్‌ సిబ్బందిని సకాలంలో చేరవేసేందుకు వాహనాలను ఏర్పాటు చేశారు. 24 కేంద్రాల్లో సీసీ కెమెరాలు, 16కేంద్రాల్లో లైవ్‌ వెబ్‌కాస్టింగ్, 43 కేంద్రాల్లో ఆన్‌లైన్‌ రికార్డింగ్, 223 కేంద్రాల్లో ఆన్‌డ్రాయిడ్‌ మొబైల్‌ రికార్డింగ్, 25 మంది వీడియోగ్రాఫర్లను నియమించారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ సరళిని పర్యవేక్షించేందుకు మైక్రో అబ్జర్వర్లను నియమించారు. 455 ఈవీఎంలు, 363 వీవీప్యాట్లు, 352 కంట్రోల్‌ యూనిట్లను ఏర్పాటు చేశారు. 
దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు..
నియోజకవర్గంలో దివ్యాంగ ఓటర్లు 3,592 మంది ఉన్నారు. వీరిని ఎన్నికల రోజున పోలింగ్‌ కేంద్రానికి తరలించేందుకు 197 ఆటోలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ స్టేషన్‌లోకి సులువుగా వెళ్లేందుకు ర్యాంపులను ఏర్పాటు చేశారు. వీరి కోసం వీల్‌చైర్లను అందుబాటులో ఉంచారు. అంధుల కోసం బ్యాలెట్‌లో బ్రెయిలీ లిపితో అభ్యర్థుల క్రమసంఖ్యగల కార్డును అమరుస్తారు. వీరు ఓటేసేందుకు సహాయకులను అనుమతిస్తారు. 
ఒక పోలింగ్‌ కేంద్రంలో మహిళలకు ప్రత్యేకం..
మహిళల ఓటింగ్‌ శాతం పెంచేందుకు ఈసారి ప్రయోగాత్మకంగా ఆలేరులోని బాలికల ఉన్నత పాఠశాలలో ఒక మహిళ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పూర్తిగా మహిళా సిబ్బందినే నియమించారు. దీంతో పాటుగా నియోజకవర్గంలో ఒక మోడల్‌ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని అన్ని వసతులతో ఆకర్షణీయంగా తీర్చుదిద్దుతారు. పోలింగ్‌ కేంద్రంలో ప్రత్యేక సహాయక కేంద్రం ఉంటుంది. మోడల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఫర్నిచర్, తాగునీరు, దివ్యాంగులు సులువుగా వెళ్లేందుకు ర్యాంపు, మరుగుదొడ్లు, మూత్రశాలలు తదితర సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. 
బరిలో వీరే..
ఆలేరు శాసనసభ స్థానానికి 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బూడిద భిక్షమయ్యగౌడ్‌ (కాంగ్రెస్‌), గొంగిడి సునీత (టీఆర్‌ఎస్‌), దొంతిరి శ్రీధర్‌రెడ్డి (బీజేపీ), మోత్కుపల్లి నర్సింహులు (బీఎల్‌ఎఫ్‌), కల్లూరి రాంచంద్రారెడ్డి (బీఎస్పీ), కందడి మణిపాల్‌రెడ్డి (తెలుగు కాంగ్రెస్‌), కొత్త కృష్ణ (అంబేద్కర్‌ నేషనల్‌ కాంగ్రెస్‌), రేగు ఆనంద్‌ (బీఆర్‌ఎస్‌), జన్నె సరిత (ఎస్‌పీ), గుజ్జుల రాంచంద్రారెడ్డి, బొల్లారం రమేష్, వైల శ్రీనివాస్‌రెడ్డి, మొరిగాడి కృష్ణ, దీరావత్‌ గోపినాయక్‌ వీరంతా స్వతంత్రులు.  

పకడ్బందీగా ఏర్పాట్లు  ..
ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. నూరు శాతం పొలింగ్‌ నమోదు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు ప్రతి పోలింగ్‌  కేంద్రంలో అన్ని ఏర్పాట్లను చేశాం. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి అధికారి వారి పరిధి మేరకు ఎన్నికలు సవ్యంగా జరిగేందుకు తమవంతుగా కృషి చేయాలి. ఓటు హక్కు ఉన్నవారు తప్పనిసరిగా వినియోగించుకోవాలి
 
– మందడి ఉపేందర్‌రెడ్డి, ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top