పింఛనుకు అర్హులు 2.13 లక్షల మంది | 2.13 lakh people are eligible for pension | Sakshi
Sakshi News home page

పింఛనుకు అర్హులు 2.13 లక్షల మంది

Nov 18 2014 3:15 AM | Updated on Sep 2 2017 4:38 PM

జిల్లాలో రెండు లక్షల పదమూడు వేల మందిని పింఛనలకు అర్హులుగా....

ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాలో రెండు లక్షల పదమూడు వేల మందిని పింఛనలకు అర్హులుగా గుర్తించామని, వీరిలో ఇప్పటివరకు లక్షా అరవై ఐదువేల మంది పెన్షన్‌దారుల డేటాను ఎంట్రీ చేసినట్లు కలెక్టర్ డాక్టర్ కె ఇలంబరితి తెలిపారు. సోమవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్,  గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరి రేమండ్‌పీటర్ జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గతంలో 2,24,426 పెన్షన్లు ఉండగా ప్రస్తుతం 2,13,063 మందిని అర్హులుగా గుర్తించినట్లు చెప్పారు. ఇంకా 10వేల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని  తెలిపారు. ఆహర భద్రత కార్డులకు 7,21,852 దరఖాస్తులు అందాయని, వాటిలో ఇప్పటివరకు 2,98,905 దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్లు వివరించారు. ఈ నెలాఖరులోగా పెన్షన్ దరఖాస్తుల పరశీలన పూర్తి చేయడంతో పాటు అర్హులందరికీ పింఛను పంపిణీ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో  జేసీ సురేంద్రమోహన్, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌నాయక్, డీఎస్వో గౌరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇలంబరితి కలెక్టరేట్ నుంచి పింఛన్లు ,ఆర్‌ఓఎఫ్‌ఆర్‌పై ఎంపీడీవోలు, తహశీల్దార్లతో, ఆర్డీవోలతో, ఫారెస్టు అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.

 ఈ నెల 24వ తేదీలోపు పెన్షన్ల ప్రకియను పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో జాబితాలు ప్రదర్శించాలని, దరఖాస్తుల తిరస్కరణకు కారణాలు తెలపాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement