హైదరాబాద్ ప్రళయానికి 110 ఏళ్లు.. | Sakshi
Sakshi News home page

కన్నీటి ఉప్పెన!

Published Tue, Sep 25 2018 8:03 AM

110 Years Complete to Hyderabad Floods - Sakshi

కేవలం రెండు రోజులు.. భారీ వర్షం.. చూస్తుండగానే నగరం జలమయమైంది..ఇళ్లల్లోకి వరదనీరు చేరిపోయింది.. తినడానికి తిండి కాదు కదా కనీసం కూర్చోవడానికి కూడా స్థలం లేదు.. వారు తేరుకోవడానికి అనేక రోజులు పట్టింది..  నగరప్రజలు  ప్రాణాలను కాపాడుకోవడానికి చెట్లు, భవనాలను ఆశ్రయించారు. పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది.  అప్పటి నిజాం నిజాం పాలకుడు మీర్‌మహబూబ్‌ అలీ ఖాన్‌ బహదూర్‌ ప్రభుత్వ ఖజానాను తెరిచి వరద బాధితుల కోసం ఎనిమిది రోజుల్లో సహాయ చర్యలను చేపట్టి ప్రజలకు ఆశ్రయం కల్పించారు. ఈ విపత్తు 1908లో సంభవించింది. రేపటికి (సెప్టెంబర్‌ 26) 110 ఏళ్లు అవుతున్న సందర్భంగాప్రత్యేక కథనం... 

సాక్షి సిటీబ్యూరో:  1908 సంవత్సరం సెప్టెంబర్‌ 26 ఉదయం 6 గంటలు ఆకాశం మొత్తం నల్లటి మబ్బులు కమ్మకున్నాయి. గంట దాటింది. చినుకులు ప్రాంభమయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు వర్షం పెరగింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  సాయంత్రం 6 గంటలకు మూసీ నది నిండిపోయింది.. నగర శివారు ప్రాంతాల చెరువులకు, కుంటలకు గండి పడింది. వికారబాద్, చెవేళ్ల, మొయినా బాద్‌ తదితర ప్రదేశాల్లోని కుంటలు, చెరువులకు కూడా గండి పడి మూసీలో నీళ్లు కలిసాయి. ఆఫ్జల్‌ గంజ్‌తోపాటు ఇతర బస్తీల్లో నీరు భారగా చేరింది. మొదట కొలసావాడి నీటి ప్రవహానికి కొట్టుకపోయింది. అనంతరం హుస్సేనీఆలం, షహీద్‌గంజ్, బద్రీ ఆలావ, ఘాన్సీమీయా బజార్,దారుషిపా, జామ్‌బాగ్, గౌలిగూడ, ఆఫ్జల్‌గంజ్‌ నుంచి రెసిడెన్సి ప్యాలేస్‌ వరకు ప్రాంతంలో నీరు నిండి పోయింది. వందల సంఖ్యలో చెట్లు కూలిపోయాయి.

ఆఫ్జల్‌ దవాఖాన కూలిపోయింది. ఆఫ్జల్‌గంజ్‌ భవనం పైన ఎక్కిన జనం దానికి అనుకొని ఉన్నా చెట్టుపై ఎక్కి వందల మంది ప్రాణాలను కాపాడుకున్నారు. వరదల సాక్షిగా వందల మంది ప్రాణాలు కపాడిన చెట్టు ఇప్పటికీ ఉంది. మూసీకి ఉత్తరం 2 కిలోమీటర్లు, దక్షిణాన ఒక కిలోమీటర్‌ వరకు వరద నీరు ప్రవహించాయి. ఆఫ్జల్‌గంజ్‌ వంతనా కొట్టుకపోయింది. పురానాపూల్‌ వంత మీద నుంచి నీరు ప్రవహించింది. మరుసటి రోజూ అదే పరిస్థితి..  మూడోరోజు  సెప్టెంబర్‌ 28 మూసీ నది 60 అడుగుల ఎత్తులో ప్రవహించింది. 36 గంటల్లో 16 సెంటీమీటర్ల వర్షపాతంనమోదైంది. ఆఫ్జల్‌ గంజ్‌ వద్ద నీటి మట్టం 11 అడుగులకు చేరింది. నీరు ఇటు చాదర్‌ఘాట్‌ దాటి అంబర్‌పేట బురుజు వరకు,  అటు చార్మినార్‌ దాటి శాలిబండ వరకు ప్రవహించాయి.  పేట్లబురుజుపైకి వందల సంఖ్యలో చేరుకున్నారు.  రెండు గంటల్లోనే పేట్లబురుజు నీటి ప్రవాహానికి కొట్టుకపోయింది. దీంతో వందల మంది నీటి ప్రవాహంలో కొట్టుకపోయారు.  ఆ రోజు సాయంత్రానికి గానీ వరద ఉధృతి తగ్గలేదు. దాదాపు 15వేల మంది ప్రాణాలొదిలారు. 2వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. అప్పటి పాలకుడు నిజాం మీర్‌ మహబూబ్‌అలీ  నిరాశ్రయుల కోసం సహాయక చర్యలు ప్రారంభించారు. తమ సంస్థానాల్లోని భవనాల్లో ఆశ్రయం కల్పించారు. వైద్య, అన్నదాన శిబిరాలు ప్రారంభించారు.తరువాత మామూలు పరిస్థితులు నెలకొన్నాయి.

1/2

2/2

Advertisement

తప్పక చదవండి

Advertisement