breaking news
-
ఖర్గే పర్యటన వేళ ఫ్లెక్సీల కలకలం
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. ఇవాళ నగరంలోని ఎల్బీ స్టేడియంలోనిర్వహించబోయే సామాజిక న్యాయ సమర భేరి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అయితే, ఖర్గే పర్యటన వేళ హైదరాబాద్లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశంలో రాజ్యాంగ పరిరక్షణే మా ధ్యేయం.. తెలంగాణలో కాంగ్రెస్ రాక్షస క్రీడ చేస్తోంది. ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదంటూ ప్లెక్సీలు వెలిశాయి. సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారాయి. ‘జై భీం ఎస్సీ,ఎస్టీలే మా లక్ష్యం. జై సంవిధాన్ రాజ్యాంగం అంటే మాకు లెక్కే లేదు’ అనే స్లోగన్లతో ఏర్పాటు చేసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.కాగా, మల్లికార్జున ఖర్గే ఇవాళ(శుక్రవారం) వరుస సమావేశాల్లో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు గాందీభవన్లో టీపీసీసీ పీఏసీ భేటీలో పాల్గొంటారు. అనంతరం అడ్వైజరీ కమిటీతో పాటు పార్టీ ఇటీవల నియమించిన అన్ని కమిటీలతో సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామ, మండల పార్టీ అధ్యక్షుల బహిరంగ సభలో పాల్గొంటారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
పార్టీ ఎజెండా ముఖ్యం.. అధికారమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో ఎలాంటి నిర్ణయమైనా సమష్టిగా చర్చించిన తర్వాతే తీసుకుంటామని, దాన్నిఅమలు చేసే బాధ్యత మాత్రమే రాష్ట్ర అధ్యక్షుడిపై ఉంటుందని బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు చెప్పారు. సొంతంగా, స్వార్థపూరితంగా నిర్ణయాలు తీసుకునే ప్రసక్తే లేదన్నారు. ‘పార్టీ ఎజెండా ముఖ్యం.. 2028లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యం’ అనే నినాదంతో ముందుకెళ్తామని చెప్పారు. పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ కార్యక్రమాలపై గురువారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. అప్పుల గురించి రేవంత్కు అప్పుడు తెలియదా? ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఏడాదిన్నర కాలంలోనే పూర్తిగా విఫలమైంది. సీఎం రేవంత్రెడ్డి వివిధ సందర్భాల్లో మాట్లాడుతూ అప్పుల గురించి చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ఈ అప్పుల సంగతి ఆయనకు తెలియదా? కనీస అవగాహన లేకుండానే హామీలు ఇచ్చారా? అమలు చేయాల్సి వచ్చేసరికి ఆర్థిక పరిస్థితి గురించి చెబుతారా? రైతు రుణమాఫీ ఇంకా పూర్తికాలేదు. రైతుబంధు అందడం లేదు. మహాలక్ష్మీ, గృహలక్ష్మి అంటూ ఎన్నో హామీలు ఇచ్చి... ఇప్పుడు రాష్ట్రం దివాలా తీసిందంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నమే కనిపిస్తోంది. కాంగ్రెస్ హామీలు అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నట్లు ప్రజలు గుర్తించారు. ప్రజాస్వామ్య తెలంగాణ మాటలకే పరిమితమైంది. భైంసాలో ఎంతోమంది బీజేపీ కార్యకర్తలను జైల్లో పెట్టారు. గోరక్షకులను అరెస్టులు చేశారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు.. పదేళ్ల పాలన చూసిన తర్వాత బీఆర్ఎస్ను ప్రజలు వద్దనుకున్నారు. అందుకే కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ విధానాలనే అమలు చేస్తోంది. అందుకే కేవలం ఏడాదిన్నరలోనే ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్.. రెండింటికీ ప్రత్యామ్నాయం బీజేపీ అనే అభిప్రాయం ఇప్పుడు ప్రజల్లో ఉంది. రెండు ప్రభుత్వాలను చూసిన తెలంగాణ ప్రజలు బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ పరిస్థితికి తగినట్లు బీజేపీ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుంది. అధికారంలోకి వచ్చేలా కష్టపడతాం. ఒక్క ఎమ్మెల్యేతో మొదలుపెట్టి.. రాష్ట్రంలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. ఒకప్పుడు ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉండేవారు. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, 8 మంది ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడితో బలమైన పార్టీగా ఎదిగింది. గతంలో కేవలం మూడు, నాలుగు శాతం ఓట్లున్న ఈ పార్టీ..గత పార్లమెంటు ఎన్నికల్లో 22 శాతం ఓట్లతో సగం ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి వస్తామనే ధీమా ఏర్పడింది. గెలుపు గుర్రాలకే ‘స్థానిక’టిక్కెట్లు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నాం. జీహెచ్ఎంసీలో పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్, కాంగ్రెస్లపై ఉన్న వ్యతిరేకత మాకు కలిసివస్తుంది. త్వరలో వర్క్షాప్ నిర్వహిస్తాం. ఎవరెవరికి సీట్లు ఇవ్వాలనే దానిపై చర్చిస్తాం. సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకుంటాం. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తాం. ఇతర పార్టీల నుంచి వచ్చేవాళ్లను చేర్చుకుంటాం. కొత్త నీరు వస్తేనే కదా ప్రవాహం పెరిగేది. టాలెంట్కు తగిన పదవులు కూడా ఇస్తాం. పాత, కొత్త నాయకులనే తేడా అస్సలు లేదు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటా.. రాష్ట్ర అధ్యక్షుడిగా క్షేత్రస్థాయి పర్యటనలకే తొలి ప్రాధాన్యత. పార్టీ పరంగా మాకు 38 జిల్లాలున్నాయి. కార్యాలయానికే పరిమితం కాకుండా నిత్యం ప్రజల మధ్యనే ఉంటా. సమస్యలపై ఉద్యమాలు చేపడతా. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతా. ఇందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొదిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న బీసీ నినాదం ఉత్తమాటే. బీసీ బిల్లు ఇక్కడ రూపొందించి అక్కడ అమలు చేయడమనేది తెలివి తక్కువ చర్య. బిల్లు ఆమోదిస్తే గెజిట్ ఇవ్వాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీ బిల్లు తయారు చేసి కేంద్రాన్ని అమలు చేయమన్నది. మా ప్రధానమంత్రి బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. ప్రతి ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తాం. యువతకు, మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం. ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఇచ్చే సమయాన్ని బట్టి ఈ నెల 5 లేదా 10వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తా. -
సారీ.. వచ్చేసారి.. మంత్రి పదవులు ఆశించిన నేతలతో ఖర్గే
సాక్షి, హైదరాబాద్: అర్హులైన నేతలు మంత్రి పదవులు ఆశించడంలో తప్పులేదని అయితే పార్టీ అంతర్గత పరిస్థితులు రాజకీయ, సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని సర్దుకుపోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, జిల్లాల వారీగా సముచిత న్యాయం చేసేందుకు పార్టీ కట్టుబడి ఉందని, భవిష్యత్తులో వారి వారి అనుభవం, అర్హతలకు అనుగుణంగా పదవులు సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం జరగనున్న పలు సమావేశాల్లో పాల్గొనేందుకు ఖర్గే గురువారం సాయంత్రం హైదరాబాద్కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, పార్టీ నేత హర్కర వేణుగోపాలరావు తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నేరుగా తాను బస చేసే తాజ్ కృష్ణా హోటల్కు చేరుకున్న ఖర్గే అక్కడ..ఇటీవలి కేబినెట్ విస్తరణ సందర్భంగా మంత్రి పదవులు ఆశించిన నేతలతో ముఖాముఖిగా సమావేశమయ్యారు. మేం అర్హులం.. మాకు అవకాశం ఇవ్వాల్సిందే ఏఐసీసీ చీఫ్తో భేటీ అయ్యేందుకు రావాలని గురువారం మధ్యాహ్నం కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పార్టీ సమాచారం ఇచ్చింది. ఈ మేరకు సుదర్శన్రెడ్డి, ప్రేంసాగర్ రావు, బాలునాయక్, రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి సాయంత్రం హోటల్కు చేరుకుని ఖర్గేతో సమావేశమయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆది శ్రీనివాస్కు కూడా సమాచారం ఇచ్చినప్పటికీ నియోజకవర్గాల్లో ముందే నిర్ణయించిన సమావేశాల్లో పాల్గొనాల్సి ఉన్నందున వారు రాలేకపోయారు. కాగా ఈ భేటీలో ఎమ్మెల్యేలు.. తమకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వాలో, తాము ఎలా అర్హులమో వివరించారు. ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, పార్టీ పట్ల విధేయతో ఉంటున్నామని, తమకు ఉన్న అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో తప్పనిసరిగా అవకాశం కల్పించాల్సిందేనని కోరారు. నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదని, ఆ రెండు జిల్లాలకు కూడా తప్పకుండా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కష్టపడండి ..గెలిచి రండి అందరి వాదనలను సావధానంగా విన్న ఖర్గే..ఎమ్మెల్యేల వినతులను పార్టీ తప్పకుండా పరిశీలిస్తుందని, భవిష్యత్తులో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. పార్టీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అర్హులైన వారికి కూడా కొన్ని పదవులు ఇవ్వలేకపోయామని భవిష్యత్తులో తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వీలును బట్టి పార్టీలో ప్రాధాన్యమిస్తామని, సీనియారిటీని తప్పకుండా గౌరవిస్తామని, సామాజిక న్యాయానికి కట్టుబడి ముందుకు వెళ్తామని తెలిపారు. పార్టీ రెండోసారి కూడా అధికారంలోకి వస్తుందని అప్పుడు మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పినట్లు సమాచారం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని, మెజార్టీ స్థానాల్లో గెలవాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్నిటినీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలతో ఖర్గే సమావేశం కొనసాగుతున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హోటల్లోనే ఉన్నారు. సాయంత్రం 6:30 గంటలకు అక్కడికి వచ్చిన ఆయన.. 9 గంటల తర్వాత కూడా అక్కడే వేచి ఉన్నారు. ఖర్గేతో భేటీ అయిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత సీఎంను కూడా కలిశారు. తమకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వాలో, ఖర్గేకి ఏం చెప్పామో వివరించారు. 9 దాటిన తర్వాత హోటల్ నుంచి రేవంత్ తన క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారు. మీనాక్షి నటరాజన్, మహేశ్గౌడ్ కూడా హోటల్లో కొంతసేపు ఉండి ఆ తర్వాత శుక్రవారం నాటి సమావేశాలు, సభ ఏర్పాట్లను సమీక్షించేందుకు వెళ్లారు. కాగా సీఎంను కలిసేందుకు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ హోటల్కు రాగా భద్రతా సిబ్బంది అనుమతించలేదు. చీఫ్ విప్ ఆఫర్ చేసినా.. తాను పార్టీ కోసం చేసిన కృషిని, పార్టీ పట్ల విధేయతను వివరించినప్పటికీ మంత్రి పదవిపై సరైన భరోసా లభించకపోవడంతో అలిగిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు హోటల్ నుంచి విసురుగా వెళ్లిపోయినట్లు తెలిసింది. ఆయనకు చీఫ్ విప్ పదవి ఇస్తామని చెప్పినట్లు సమాచారం. కాగా ప్రేంసాగర్ రావును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం బయట మీడియాతో మాట్లాడిన ప్రేంసాగర్ రావు.. తాను అలిగాననడంలో ఎలాంటి వాస్తవం లేదని, పార్టీ అధ్యక్షుడికి తన మనసులో మాట చెప్పి వెళ్లిపోయానని చెప్పారు. కొండా మురళి దంపతుల వివరణ వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ దంపతులు కూడా ఖర్గేను కలిశారు. జిల్లాకు చెందిన పార్టీ నేతలతో విభేదాలపై వివరణ ఇచ్చినట్టు తెలిసింది. అందరినీ కలుపుకొని వెళ్లాలని, సమన్వయంతో పనిచేయాలని, భవిష్యత్తులో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఖర్గే చెప్పినట్లు తెలిసింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానయ్య, రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళిలు కూడా ఖర్గేతో కాసేపు సమావేశం అయ్యారు. ఖర్గేతో భేటీ అనంతరం ఎవరేమన్నారంటే.. ఉమ్మడి జిల్లాలన్నింటికీ మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరినట్లు మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. ‘పార్టీలో సీనియర్లం ఉన్నాం..మంత్రి పదవి ఇవ్వాలని కోరా..’ అని సుదర్శన్రెడ్డి చెప్పారు. లంబాడా సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత ఇస్తామని ఖర్గే హామీ ఇచ్చారని బాలునాయర్ తెలిపారు. తాను మంత్రి పదవికి ఎలా అర్హుడనో ఖర్గేకి వివరించానని రామ్మోహన్రెడ్డి తెలిపారు. తనది నాలుగు తరాల విధేయత అని చెప్పానన్నారు. నేడు వరస సమావేశాలు మల్లికార్జున ఖర్గే శుక్రవారం వరుస సమావేశాల్లో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు గాందీభవన్లో టీపీసీసీ పీఏసీ భేటీలో పాల్గొంటారు. అనంతరం అడ్వైజరీ కమిటీతో పాటు పార్టీ ఇటీవల నియమించిన అన్ని కమిటీలతో సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామ, మండల పార్టీ అధ్యక్షుల బహిరంగ సభలో పాల్గొంటారని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
‘కేసీఆర్ మాట్లాడితే నేను మాట్లాడతా.. వారితో సంబంధం లేదు’
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అన్నిఅంశాలపై చర్చ జరుపుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. కేసీఆర్, మేము ఉద్యమంలో పని చేశామని, తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని కోమటిరెడ్డి అన్నారు. తమకు హరీష్ రావు, కేటీఆర్లతో సంబంధం లేదని, వారు తమ లెక్కల్లోకి రారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ‘ హరీష్రావు ఉత్తి ఎమ్మెల్యే, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాదు. అసెంబ్లీకి ప్రతిపక్ష నేత వచ్చి మా తప్పు ఒప్పులను చెప్పాలి. కేసీఆర్ సలహాలు ఇస్తే స్వీకరిస్తాం. తప్పులను చూపిస్తే సరిదిద్దుకుంటాం. కేసీఆర్తోనే లెక్క.. హరీష్రావు ఎవరో నాకు తెలీదు. ఫోన్ ట్యాపింగ్ చేసింది హరీష్రావు, కేటీఆర్లు,. కేసీఆర్ చుట్టూ ఉంటూ కేసీఆర్కు చెప్పి ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్రావు, కేటీఆర్లు కీలకం’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. -
వరంగల్ రాజకీయంలో కొత్త ట్విస్ట్.. మీనాక్షితో కొండా దంపతుల ప్రత్యేక భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ, మురళి ఎపిసోడ్లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్తో కొండా దంపతులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ.. ఇంచార్జి మీనాక్షికి 16 పేజీల నివేదికను అందజేశారు. ఈ నివేదికలో వరంగల్ జిల్లాలోగ్రూప్ రాజకీయాల గురించి వివరించినట్టు సమాచారం.ఈ క్రమంలో తమపై వచ్చిన ఆరోపణలపై కొండా దంపతులు ఇద్దరు సమాధానం చెప్పారు. ఉమ్మడి వరంగల్లో నియోజకవర్గం వారిగా ఇంచార్జీకి రిపోర్ట్ ఇచ్చినట్టు తెలిపారు. నిజాలు తెలుసుకున్న తర్వాత ఎవరిది తప్పుంటే వాళ్ళపై చర్యలు తీసుకోమని కోరారు. రాజీనామా చేసిన తర్వాతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని వారిద్దరూ నివేదికలో క్లారిటీ ఇచ్చారు. నాయిని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మీనాక్షి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పుకొచ్చారు.అనంతరం, కొండా మురళి సాక్షితో మాట్లాడుతూ..‘నేను వెనకబడిన వర్గాల ప్రతినిధిని. నలభై నాలుగు ఏళ్ల నుండి నా ఎపిసోడ్ నడుస్తూనే ఉంది. వైఎస్సార్ హయం నుంచి మేము నిబద్ధతతో పనిచేస్తున్నాం. ఒకరి గురించి నేను కామెంట్ చేయను. నాకు ప్రజాబలం ఉంది. పని చేసే వారిపైనే విమర్శలు వస్తాయి. క్షమశిక్షణ కమిటీ పరిధిలో ఉన్నా నన్ను రెచ్చగొడుతున్నారు. నేను మొదటిసారి కాంగ్రెస్ ఇంచార్జిని కలిశాను. రేపటి సభకు వరంగల్ నుండి ఎంత జనసమీకరణ చేయాలని మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీని బతికించడం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం నా లక్ష్యం. రేవంత్ రెడ్డిని ఇంకో పదేళ్లు సీఎంగా ఉండేలా చూడడం నా లక్ష్యం. బీసీ బిడ్డగా పీసీసీకి నేను అన్ని రకాలుగా మద్దతు ఉంటుంది.స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ కాంగ్రెస్ గెలిచేలా నేను తీసుకుంటాను. రేపు ఎమ్మెల్సీ ఎవరికి ఇచ్చినా గెలిపించే బాధ్యత నాదే. నేను ఎవరికి భయపడేది లేదు. బీసీ కార్డుతోనే పనిచేస్తా.. బీసీల అభ్యున్నతికి పనిచేస్తాను. సురేఖ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే నేను జోక్యం చేసుకుంటున్నాను. నాకు భయం లేదని ముందు నుంచే చెబుతున్నాను. ఇప్పుడు కూడా అదే అంటున్నాను. పెద్ద పెద్ద కేసులకే నేను భయపడలేదు. ఇదే సమయంలో నాపై ఆరోపణలు చేస్తున్న వారు కూడా నాకు భయపడరు. మా ఇంట్లో ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి. నా కూతురు ఏమనుకుంటుందో నాకు ఎలా తెలుసు?. నా కూతురు ఫ్యూచర్ ఏంటో ఆమె డిసైడ్ అవుతుంది. మాది పరకాల.. వంశపారంపర్యంగా పరకాల అడిగితే తప్పేంటి?. భవిష్యత్లో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అని వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో గతంలో నటి సమంత, నటుడు నాగార్జునపై సురేఖ చేసిన వ్యాఖ్యలపై కూడా మురళి తన లేఖలో వివరణ ఇచ్చారు. మహేష్ బాబు, రాజమౌళిలపై కొండా సురేఖ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని లేఖలో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో జరిగిన అంశాలను మాత్రమే తాను పేర్కొన్నట్లు చెప్పారు. కొందరు కావాలని సురేఖ వ్యాఖ్యలను వక్రీకరించినట్లు పేర్కొన్నారు. కొండా సురేఖ ఫోన్ ట్యాపింగ్ విషయాలను చెప్పింది తప్ప సినీ ప్రముఖులను ఉద్దేశించినవి కావని లేఖలో క్లారిటీ ఇచ్చారు. ఈ అంశంపై ఇప్పటికే ఏఐసీసీ పెద్దలకు వివరణ ఇచ్చినట్లు మురళి వెల్లడించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. నాకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నాను. రూల్స్ ప్రకారమే నేను పని చేస్తున్నాను. నా డిపార్ట్మెంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ పరిశీలించుకోవచ్చు. మంత్రిగా నేను ఇప్పటివరకు ఎలాంటి తప్పులు చేయలేదు. నా మంత్రి పదవిపై ఎవరు మాట్లాడినా నేను స్పందించను అంటూ కామెంట్స్ చేశారు. -
చంద్రబాబుపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలు మార్లు చంద్రబాబు తీరును బహిరంగంగానే విమర్శించారు. తాజాగా, మరోమారు అదే తరహాలో చంద్రబాబుపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ‘తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారు. ఇరిగేషన్, రోడ్డు కాంట్రాక్ట్లు చూసేది బాబు కోవర్టులే. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాయడం కాదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి’ అంటూ వ్యాఖ్యానించారు. -
‘నాడు బాబుకు బ్యాగులు మోసి బ్యాడ్మెన్.. నేడు బనకచర్ల బొంకుమెన్’
సాక్షి, హైదరాబాద్: బనకచర్ల విషయంలో కాంగ్రెస్ నేతల తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభవన్లోనే చంద్రబాబు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందన్నారు. తెలంగాణ నీటి హక్కులను రేవంత్ మరణశాసనం రాశారని సంచలన ఆరోపణలు చేశారు. గురు దక్షిణలో భాగంగానే ఒప్పందం చేసుకున్నారని వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్లపై బీఆర్ఎస్ పోరాటం చేస్తే.. కాంగ్రెస్ మొద్దు నిద్ర పోతోంది. మధ్యాహ్నం మేం ప్రెస్మీట్ పెడితే రాత్రి ఉత్తమ్ లేఖ రాశారు. బ్యాక్ డేట్ వేసి మీడియాకు ప్రభుత్వం రిలీజ్ చేసింది. బనకచర్లపై బొంకుడు రాజకీయాలు బంద్ చేయాలి. రేవంత్, ఉత్తమ్ కలిసిన తర్వాతే కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారు. ఈ విషయాన్ని జనవరిలో బీఆర్ఎస్ బయటపెట్టింది.సీఎం రేవంత్కు బేసిన్ల గురించి కనీసం అవగాహన లేదు. స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్లో అని రేవంతే చెప్పారు. రేవంత్ టెక్నికల్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి.. కానీ, ఆయన హృదయం టీడీపీలోనే ఉంది. బనకచర్లను ఆపే చిత్తశుద్ది రేవంత్కు లేదు. బెజవాడ బజ్జీలు తిని బనకచర్లకు జెండా ఊపారు. నాడు బాబు బ్యాగులు మోసి బ్యాడ్మెన్గా పేరు తెచ్చుకున్నారు. నేడు అదే బాబు కోసం బనకచర్ల బొంకుమెన్గా మారిపోయారు. చంద్రబాబును ప్రజాభవన్లో కలిశాక చీకటి ఒప్పందం కుదిరింది. గురు దక్షిణలో భాగంగానే చీకటి ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణ నీటి హక్కులను రేవంత్ మరణశాసనం రాశారు. తెలంగాణ పుటల్లో సీఎం రేవంత్ ద్రోహిగా మిగిలిపోతారు. రేవంత్ చిల్లర మల్లర రాజకీయాలు మానేసి రాష్ట్రం కోసం పోరాడాలి. నిన్నటి ప్రజంటేషన్లో అన్ని అబద్దాలే. రేవంత్ అబద్ధాలను బీఆర్ఎస్ చీల్చి చెండాడుతుంది. కేసీఆర్ మీదు ముఖమంత్రి రేవంత్ నిందలు మోపుతున్నారు. సీఎం వాస్తవాలు మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గొంతు కోస్తోంది. మాకు తెలంగాణ రాష్ట్ర హక్కులే ముఖ్యం. బనకచర్లపై ప్రజంటేషన్ ఇస్తే అన్ని పార్టీలను పిలవాలి కదా?. అహంకారంతో మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారు అని ఘాటు విమర్శలు చేశారు. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రేసులో మేయర్ విజయలక్ష్మి?
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కాలంలో జీహెచ్ఎంసీలోని కార్పొరేటర్ల హడావుడి పెరిగింది. అన్ని కార్యక్రమాల్లోనూ తామున్నామంటూ ముందుకొస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమంటూ సర్కిల్, జోనల్ అధికారులతో పాటు ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ను, ఉన్నతాధికారులను కలుస్తున్నారు. తమ పరిధిలోని అభివృద్ధి పనులపై ఆరా తీస్తున్నారు. త్వరితంగా చేయాల్సిందిగా తొందర పెడుతున్నారు. అంతే కాదు.. స్థానిక సమస్యలపైనా పాలకమండలి సమావేశాల్లో గళమెత్తుతున్నారు. అవినీతి, అక్రమాలు, అవకతవకలపై ప్రశ్నలతో అధికారులను ఇరుకున పెడుతున్నారు. బోగస్ బర్త్, డెత్ సర్టిఫికెట్ నుంచి మొదలు పెడితే, వివిధ అంశాల్లో అవినీతిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. వేయని రోడ్లకు బిల్లులు కాజేస్తున్నారంటూ ఇంజినీర్ల అక్రమాలను కళ్లకు కడుతున్నారు. నాలుగేళ్ల పాటు లేనిది.. గడచిన నాలుగేళ్లుగా లేని చైతన్యం ఇప్పుడే ఎందుకొచ్చింది అనే ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి. త్వరలోనే వారి పదవీకాలం ముగియనుండటం అందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పాలక మండలికి దాదాపు ఏడు నెలల సమయం మాత్రమే ఉంది. తిరిగి గెలవాలంటే ప్రజల్లోకి వెళ్లక తప్పదు. తీరా ఎన్నికలు వచ్చాక వెళ్తే ప్రజలు తిరగబడ్తారని, అభాసుపాలవుతారని తెలిసి ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా తమ దీర్ఘకాల సమస్యలు పరిష్కారమైతే తమకదే పదివేలంటున్నారు ప్రజలు. ఇది అందరి కార్పొరేటర్ల పరిస్థితి కాగా, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల పరిధిలోని కార్పొరేటర్ల పరిస్థితి ఇంకొంచెం భిన్నంగా ఉంది. అందుకు కారణం త్వరలో జూబ్లీహిల్స్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుండటమేనని చెబుతున్నారు. ‘జూబ్లీహిల్స్’పై కన్ను.. ఆ నియోజకవర్గాల్లోని కార్పొరేటర్లతో పాటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సైతం గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు సోమవారం ఉదయం నుంచే పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. జూబ్లీహిల్స్ పరిధిలోనే ఉన్న యూసుఫ్గూడ చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్తో పాటు రహ్మత్నగర్, యూసుఫ్గూడ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజల ఫిర్యాదులు ఓపికగా విన్నారు. జాప్యం లేకుండా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇదివరకు లేని విధంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎక్కువసేపు ఉంటున్నారు. మే యర్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ జూబ్లీహిల్స్ కూడా పొరుగునే ఉండటాన్ని ఈ సందర్భంగా పలువురు ప్రస్తావిస్తున్నారు. రాబో యే ఎన్నికల్లో తాను మళ్లీ కార్పొరేటర్గా పోటీ చేయ నని ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీపై ఆమె చూపు ఉందేమో అనే వ్యాఖ్యానాలు సైతం వినిపిస్తున్నాయి. -
సంఘటితం.. సంఘర్షణ.. సిద్ధంచేయడం
సాక్షి, హైదరాబాద్: ‘పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావుపై మూడు ప్రధాన బాధ్యతలున్నాయి. కార్యకర్తలను సంఘటితం చేయడం.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై సంఘర్షణ చేయడం.. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేసేలా పార్టీ నాయకత్వాన్ని సిద్ధం చేయడం’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే వ్యాఖ్యానించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో జరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ప్రకటన, సన్మాన కార్యక్రమంలో ఎన్.రామంచందర్రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు శోభ కరంద్లాజే ప్రకటించి ఆయకు నియామకపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆమె కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతోపాటు ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపైనా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. ఈ రెండింటికీ ప్రత్యామ్నాయమైన బీజేపీకి అధికారం ఇవ్వాలనే యోచనలో ప్రజలు ఉన్నారని.. ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలని కేడర్కు సూచించారు. ‘తెలంగాణలో ఇప్పుడు బీజేపీకి పరిస్థితి ఆశాజనకంగా ఉంది. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయండి. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యపరచండి. అలా చేస్తే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం. తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు కాంగ్రెస్కు ఏటీఎంలుగా తయారయ్యాయి. ఇక్కడి ప్రజాధనాన్ని లూటీ చేసి పార్టీ పెద్దలకు కట్టబెడుతున్నాయి. ఇరు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే రోజులు ఎంతో దూరం లేవు’అని పేర్కొన్నారు. 11 ఏళ్ల మోదీ పాలనలో రాష్ట్రానికి రూ. 12 లక్షల కోట్లు: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందని కొందరు తెలివితక్కువగా మాట్లాడుతున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి రూ. 12 లక్షల కోట్లు ఖర్చు చేసిందని.. ఈ అంశంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. బీఆర్ఎస్ పాలనంతా దోచుకోవడంతోనే గడిచిపోయిందని.. ఇప్పుడున్న రేవంత్ ప్రభుత్వం కూడా అదే సంస్కృతిని కొనసాగిస్తోందని దుయ్యబట్టారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిచోటా బీజేపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఎవరు అధ్యక్షుడిగా ఉన్నా అందరూ ఐకమత్యంగా పనిచేయాలని కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. నాలుగుసార్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశానని.. తన హయంలో ఏమైనా లోటుపాట్లు జరిగితే క్షమించాలని కోరారు. బీఆర్ఎస్తో కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం: కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్తో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అందుకే ఫోన్ ట్యాపింగ్, ఈ–కార్ రేస్ కేసుల్లో ఎలాంటి చర్యలు లేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టకుండా కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ రెండు పారీ్టలను నమ్మని ప్రజలు బీజేపీకి అధికారం ఇవ్వాలని చూస్తున్నారన్నారు. సౌమ్యుడిగా కనిపించినా సమస్య వస్తే టఫ్గా ఉంటా: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ సామాన్య కార్యకర్తలాగే కష్టపడి పనిచేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు తెలిపారు. అయితే తాను సౌమ్యుడిగా కనిపించినా సమస్య వచి్చనప్పుడు చాలా టఫ్గా వ్యవహరిస్తానన్నారు. సిద్ధాంతం కోసం పోరాడతానని, గతంలో 14సార్లు జైలుకు వెళ్లి వచ్చానని.. విద్యార్థుల కోసం లాఠీచార్జిలో తన చెయ్యి, కాలు దెబ్బతిన్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తానన్నారు. బీజేపీలో ఉమ్మడి నాయకత్వం ఉంటుందని.. అందరి అభిప్రాయంతోనే తాను నిర్ణయాలు తీసుకుంటానని రాంచందర్రావు తెలిపారు. ఇప్పుడు అందరి లక్ష్యం పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే కావాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీలోని కొత్త వాళ్లు, పాత వాళ్లు కలిసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. బీఆర్ఎస్ వాట్సాప్ యూనివర్సిటీతో, కాంగ్రెస్ ఫేక్ న్యూస్లతో ట్రోలింగ్ చేస్తోందని, అలాంటి వాటికి జడిసేది లేదన్నారు. పేరులేని పేపర్లతో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసే వారిపై క్రిమినల్ కేసులు వేసి జైలుకు పంపిస్తానని హెచ్చరించారు.జాతీయ కౌన్సిల్ సభ్యులు... రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక అనంతరం జాతీయ కౌన్సిల్కు ఎన్నికైన వారి పేర్లను ప్రకటించారు. వారిలో కేంద్ర మంత్రులు జి.కిషన్రెడ్డి, బండి సంజయ్కుమార్, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు, ఎంపీలు కె.లక్ష్మణ్, డీకే అరుణ, గోడం నగేశ్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, గరికపాటి మోహన్రావు, పి.సుధాకర్రెడ్డి, ఎం.ధర్మారావు, చింతా సాంబమూర్తి, కె.గీతామూర్తి, పద్మజారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఏవీఎన్ రెడ్డి, బంగారు శ్రుతి, అరుణజ్యోతి, బండారు రాధిక, జి.ప్రేమేందర్రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, దుగ్యాల ప్రదీప్, మర్రి శశిధర్రెడ్డి, పాయల్ శంకర్ ఉన్నారు. మరికొందరు నామినేషన్ వేసినప్పటికీ పేర్లను తర్వాత ప్రకటిస్తామన్నారు. -
బీఆర్ఎస్ కోసమే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ పునరుజ్జీవం కోసమే ఆ పార్టీ నేతలు నీళ్ల రాజకీయం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు నిర్లక్ష్యమే నేడు తెలంగాణ రైతులకు శాపంగా మారిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి– బనకచర్ల ప్రాజెక్టుపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి మంగళవారం ప్రజాభవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో సీఎం మాట్లాడారు. ‘వాళ్లు (బీఆర్ఎస్) 2023లో ఓడిపోయారు. 2024లో డిపాజిట్లు కోల్పోయారు. 2025 ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకలేదు. ఇప్పుడు నదుల పునరుజ్జీవం కాదు.. పార్టీ పునరుజ్జీవం కోసం నీళ్ల సెంటిమెంట్ను వాడుకుంటున్నారు. పక్క రాష్ట్రం సీఎంను, ఈ రాష్ట్రం సీఎంను భూతాలుగా చిత్రీకరించాలని కుట్రలు చేస్తున్నరు. క్షుద్రపూజలు చేసినట్టుగా ఆయన (కేసీఆర్) ఫాంహౌస్లో కూర్చుని ఆలోచన చేస్తున్నడు. ఈ విషయాలను ప్రజలందరికీ వివరించాలి’అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం సూచించారు. మరణ శాసనం రాసింది కేసీఆర్, హరీశ్రావులే.. తొమ్మిదిన్నరేళ్లు పాలనలో కేసీఆర్, హరీశ్రావు తీసుకున్న నిర్ణయాలు నేడు తెలంగాణకు గుదిబండగా మారాయని సీఎం విమర్శించారు. ‘కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల నికర జలాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఎలా వాడుకోవాలన్న అంశంపై 2015 సెప్టెంబర్ 18న కేంద్ర జలశక్తి శాఖ సమావేశం నిర్వహించింది. ఆ సమావేశానికి నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు, సాగునీటి రంగ సలహాదారులు విద్యాసాగర్ రావు హాజరై ఏపీ 512 టీఎంసీలు వాడుకోవచ్చని, తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని అంగీకరిస్తూ సంతకం పెట్టి తెలంగాణ రైతాంగం పాలిట మరణశాసనం రాసి వచ్చారు. 2020లో కూడా సమావేశానికి వెళ్లి మళ్లీ సమ్మతి తెలిపారు. 2015లో కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి ఉమాభారతి నేతృత్వంలో, తర్వాత జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో కృష్ణా జలాల్లో మన హక్కుల కోసం కేసీఆర్ వాదించలేదు. కృష్ణా జలాలే కాదు గోదావరి జలాలనూ కేసీఆర్ ఏపీకి తాకట్టు పెట్టిండు. ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి కృష్ణా, గోదావరి జలాలపై చర్చిద్దాం’అని సీఎం బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. రాచపుండును పెట్టింది కేసీఆరే.. ‘ఏటా 3,000 టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని 2016 సెపె్టంబర్ 21న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తొలిసారి నాటి సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు. గోదావరి జలాల్లో తెలంగాణ వాటా 968 టీఎంసీలు, ఏపీ వాటా 518 టీఎంసీలను పూర్తిస్థాయిలో వాడుకునే విధంగా రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కట్టుకున్న తర్వాతే మిగులు జలాలు, వరద జలాల లభ్యత ఎంతో లెక్క తేలుతుంది. ఆ తర్వాతే ఆ జలాల్లో దామాషా ప్రకారం రెండు రాష్ట్రాల వాటాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి. ఏటా 3,000 టీఎంసీల వరద సముద్రంలో కలుస్తోందని కేసీఆర్కు ఏ దేవుడు చెప్పిండు? లేని ఏకును, రాచపుండును పెట్టిందే కేసీఆర్. దాని ఆధారంగానే గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు డీపీఆర్ తయారు చేయించడానికి చంద్రబాబు 2016లో జీవో ఆర్టీ నం.262 జారీ చేశారు. దీనికి కొనసాగింపుగా 2019 సెపె్టంబర్ 29న జీవో ఆర్టీ నం.230 ఇచ్చారు. వ్యాప్కోస్ 4 ప్రత్యామ్నాయాలు సూచించగా, 4వ ప్రత్యామ్నాయంగా 400 టీఎంసీలు తరలించవచ్చని నివేదిక ఇచి్చంది. ఇప్పుడు ఏపీ 200 టీఎంసీలను తరలిస్తామని చూపించడం తాత్కాలికం. ప్రీఫీజిబిలిటీ రిపోర్టు ప్రకారం 300 టీఎంసీల ప్రాజెక్టును డిజైన్ చేశారు. అదనంగా 100 టీఎంసీల పంపులను ఫిట్ చేయడం లేదు. 400 టీఎంసీలను నెల్లూరు, ప్రకాశంకు ఎలా తీసుకెళ్లాలో 2016లోనే కేసీఆర్ చెప్పిండు. ఇదే అదనుగా చంద్రబాబు పనులు మొదలు పెట్టిండు. 2019లో జగన్ సీఎం కాగానే గోదావరి జలాలను ఏ విధంగా పెన్నాకు తరలించాలో ఆయనకు కేసీఆరే నేర్పిండు. కేసీఆర్ రోజా ఇంటికి వెళ్లి గోదావరి జలాలు మీకిచ్చి రాయలసీమను రత్నాల సీమ చేస్తా అన్నాడు. 2016–19 మధ్యలో కేసీఆర్ సంపూర్ణంగా సహకరించారు’అని సీఎం ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులకు అభ్యంతరం తెలుపకుండా ఏపీ సీఎం చంద్రబాబు ఎన్ఓసీ ఇవ్వాలని రేవంత్రెడ్డి కోరారు. సమస్యల పరిష్కారంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం వివాదం సృష్టిస్తోందని విమర్శించారు. నీటి కేటాయింపుల బాధ్యతను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. బీజేపీ పరోక్షంగా బీఆర్ఎస్ను బతికించడానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీపడబోదని స్పష్టం చేశారు. సదస్సులో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తమ పోరాటం వల్లే బనకచర్ల ప్రాజెక్టును కేంద్ర పర్యావరణ శాఖ తిరస్కరించిందని తెలిపారు. -
‘రేవంత్.. మీకు, మీ హైడ్రాకు ఇవేమీ కనబడవు’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి మండిపడ్డారు. ప్రధానంగా హైడ్రా కూల్చివేతలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంపై కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. తమ ఇళ్లు కూల్చొద్దని, హైకోర్టు స్టే ఆర్డర్ ఉందని నిరుపేదలు నెత్తి నోరు మొత్తుకున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం చూపకపోవడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. ఈ మేరకు అనేక ప్రశ్నలు సంధించారు కేటీఆర్. ‘ కొడంగల్లో రెడ్డికుంటని పూడ్చి మహల్ కట్టవచ్చు.. మీ అన్న తిరుపతిరెడడఇకి దుర్గం చెవురు ఎఫ్టీఎల్లో ఇల్లు ఉండవచ్చు. మీ రెవిన్యూ మంత్రి హిమాయత్ సాగర్లో ప్యాలసులు కట్టవచ్చు. మీ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి చెరువు నడుమ గెస్ట్ హౌస్ కట్టవచ్చు. కేవీపీ లాంటి పెద్దలు చెరువు బఫర్ లో గెస్ట్ హౌసులు కట్టుకోవచ్చు. పెద్ద బిల్డర్లు మీకు లంచం ఇచ్చి మూసి నదిలోనే అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు. ఇవేమీ మీకు, మీ హైడ్రాకు కనబడవు’ అని ప్రశ్నించారు.మిస్టర్ రేవంత్ రెడ్డి, ⭕️ నువ్వు కొడంగల్లో రెడ్డికుంటని పూడ్చి మహల్ కట్టవచ్చు ⭕️ మీ అన్న తిరుపతి రెడ్డికి దుర్గం చెరువు FTLలో ఇల్లు ఉండవచ్చు ⭕️ మీ రెవిన్యూ మంత్రి హిమాయత్ సాగర్ లో ప్యాలసులు కట్టవచ్చు ⭕️ మీ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి చెరువు నడుమ గెస్ట్ హౌస్ కట్టవచ్చు⭕️… pic.twitter.com/Vnuqyfb6i2— KTR (@KTRBRS) July 1, 2025 -
ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై బీజేపీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై ఆ పార్టీ స్పందించింది. మా పార్టీకి వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. రాజాసింగ్ ఆరోపణల్లో నిజం లేదని.. రాజాసింగ్ క్రమశిక్షణా రాహిత్యం పరాకాష్టకు చేరిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్కు లేఖ ఇవ్వాలి. పార్టీ అధ్యక్షులకు ఇచ్చిన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడికి పంపిస్తున్నాం’’ అని బీజేపీ పేర్కొంది.కాగా, రాజాసింగ్ తీసుకున్న సంచలన నిర్ణయం.. తెలంగాణ బీజేపీలో కల్లోలం రేపుతోంది. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాంచందర్రావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా.. బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలనుకున్నా.. కానీ, నా మద్దతుదారుల్ని బెదిరించారు. నామినేషన్ వేయడానికి వస్తే.. వేయనివ్వలేదు. వాళ్లు అనుకున్న వాళ్లకే పదవి ఇచ్చారు. అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఎంతో పోరాడాం. కానీ, పార్టీ అధికారంలోకి రాకూడదనే ఎక్కువ మంది కోరుకుంటున్నారు. బీజేపీ కోసం సర్వం ధారపోశాను. నేను, నా కుటుంబం టెర్రరిస్టుల టార్గెట్లో ఉన్నాం. పార్టీ కోసం ఇంత పని చేసినా ఏం లాభం?. అందుకే పార్టీకి లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నా. మీకో దండం.. మీ పార్టీకో దండం. లక్షల మంది కార్యకర్తల బాధను ప్రతిబింబించే రాజీనామా ఇది(అంటూ లేఖను చూపించారాయన). బీజేపీకి రాజీనామా చేసినా.. హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటాను అని రాజాసింగ్ ప్రకటించారు. -
Raja Singh: ఆ గ్యాప్ కొనసాగుతూనే వచ్చింది..
రాజాసింగ్.. నిన్న మొన్నటి వరకూ బీజేపీలో ఓ సంచలనం. తెలంగాణలో బీజేపీ ఎదుగుదల కోసం కృషి చేసిన నాయకుల జాబితాలో రాజాసింగ్ కచ్చితంగా ఉంటారు. అయితే పార్టీకి ఉన్నపళంగా రాజీనామా చేశారు రాజాసింగ్. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఆశించి నామినేషన్ వేయడానికి బీజేపీ కార్యాలయానికి వచ్చిన రాజాసింగ్.. ఆపై కొద్ది సేపటికే పార్టీకి గుడ్ బై అంటూ ప్రకటించారు. ‘మీకో దండం.. మీ పార్టీకో దండం’ అని రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ రాంచందర్రావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా. బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలనుకున్నా. కానీ, నా మద్దతుదారుల్ని బెదిరించారు. నామినేషన్ వేయడానికి వస్తే.. వేయనివ్వలేదు. వాళ్లు అనుకున్న వాళ్లకే పదవి ఇచ్చారు. అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నా’ అని రాజాసింగ్ ప్రకటించారు. అసలు బీజేపీ అధిష్టానంతో రాజాసింగ్కు గ్యాప్ ఎలా ఏర్పడింది.. ఎక్కడ ఏర్పడింది అనే అంశాల్లో కొన్నింటిని పరిశీలిస్తే..ఆనాటి గ్యాప్.. కొనసాగుతూనే వచ్చింది..!రాజాసింగ్ అంటే బీజేపీ అధిష్టానానికి నమ్మకం. అది ఒకప్పుడు మాట. అది క్రమేపీ దూరం అయ్యింది. మూడేళ్ల క్రితం బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించారు రాజాసింగ్. 2022లో నుపూర్ శర్మ ఇస్లాం మత ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యలపై ఆమెను బీజేపీ సస్పెండ్ చేసిన తర్వాత, రాజాసింగ్ ఆమెను సమర్థిస్తూ వీడియో విడుదల చేశారు. ఇది బీజేపీ అధిష్టానం వైఖరిని తప్పుబట్టినట్లయ్యింది. అధిష్టానాన్ని చాలెంజ్ చేసినట్లు ఉండటంతో రాజాసింగ్ను వివరణ ఇవ్వాలని కోరింది అధిష్టానం. ఈ క్రమంలోనే రాజాసింగ్ సస్పెన్షన్కు గురయ్యారు. 2022 ఆగస్టు 23వ తేదీన రాజాసింగ్ను బీజేపీ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత 2024 అక్టోబర్ 22వ తేదీన రాజాసింగ్పై సస్పెన్షన్ ఎత్తివేయడంతో తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దొరికింది రాజాసింగ్కు. అయితే అప్పట్నుంచి అధిష్టానంతో గ్యాప్ మాత్రం కొనసాగుతూనే వచ్చింది. 2024 ఎంపీ ఎన్నికల్లో బీజేపీ నుంచి హైదరాబాద్ ఎంపీగా ఎమ్మెల్యే రాజాసింగ్ను పోటీ చేయిస్తే అనూహ్య ఫలితాలు సాధించవచ్చనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా నడిచింది. అధిష్టానం రాజాసింగ్ను హైదరాబాద్ నుంచి పోటీ చేయించాలని చూసింది. ఇక్కడ రాజాసింగ్ మాత్రం ఎంపీగా విముఖత వ్యక్తం చేసిన కారణంగానే ఆయన మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేశారనేది మరో చర్చ. సస్పెన్షన్ గురైన సందర్భంతో పాటు తరచూ వివాదాలు కూడా రాజాసింగ్-అధిష్టానం మద్య గ్యాప్కు కారణమైంది. ఇటీవల కాలంలో పార్టీ లైన్కు భిన్నంగా రాజాసింగ్ వ్యవహరించడంతో ఆయన్ను అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. ప్రధానంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు సైతం రాజాసింగ్ మద్దతు పలికారు. బీఆర్ఎస్–బీజేపీ మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయన్న కవిత వ్యాఖ్యలను రాజాసింగ్ సమర్ధించారు. ఇవన్నీ కూడా అధిష్టానానికి కోపం తెప్పించాయి. రాజాసింగ్ రాజీనామా చేసే క్రమంలో అధిష్టానం పెద్దలు ఎవరూ కూడా ఆయన్ను బుజ్జగించే పని చేయకపోవడమే ఇందుకు ఉదాహరణ. ప్రధానంగా చూసుకుంటే 2022 నుంచే అధిష్టానంతో రాజాసింగ్కు సఖ్యత చెడిపోతూ వచ్చిందని, అదే ఇంతవరకూ తెచ్చిందనేది విశ్లేషకుల అభిప్రాయం. -
‘మీకో దండం.. మీ పార్టీకో దండం’.. బీజేపీకి రాజాసింగ్ రాజీనామా
తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల కల్లోలం రేపింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. చాలాకాలం తర్వాత బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయన.. కాసేపటికే ఈ ప్రకటన చేయడం గమనార్హం.హైదరాబాద్, సాక్షి: తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల కల్లోలం రేపింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. చాలాకాలం తర్వాత బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయన.. కాసేపటికే ఈ ప్రకటన చేయడం గమనార్హం.రాంచందర్రావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా. బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలనుకున్నా. కానీ, నా మద్దతుదారుల్ని బెదిరించారు. నామినేషన్ వేయడానికి వస్తే.. వేయనివ్వలేదు. వాళ్లు అనుకున్న వాళ్లకే పదవి ఇచ్చారు. అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నా. రాష్ట్ర అధ్యక్షుడికి రాజీనామా లేఖ ఇవ్వడానికే వచ్చా. నాకు మద్దతుగా ముగ్గురు కౌన్సిల్ సభ్యులు కూడా రాజీనామా చేశారు. రాజాసింగ్ మా పార్టీ సింబల్ మీద గెలిచాడు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదని, సస్పెండ్ చేయాలని కిషన్రెడ్డే స్పీకర్ను కోరాలి.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఎంతో పోరాడాం. కానీ, పార్టీ అధికారంలోకి రాకూడదనే ఎక్కువ మంది కోరుకుంటున్నారు. బీజేపీ కోసం సర్వం ధారపోశాను. నేను, నా కుటుంబం టెర్రరిస్టుల టార్గెట్లో ఉన్నాం. పార్టీ కోసం ఇంత పని చేసినా ఏం లాభం?. అందుకే పార్టీకి లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నా. మీకో దండం.. మీ పార్టీకో దండం. లక్షల మంది కార్యకర్తల బాధను ప్రతిబింబించే రాజీనామా ఇది(అంటూ లేఖను చూపించారాయన). బీజేపీకి రాజీనామా చేసినా.. హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటాను అని రాజాసింగ్ ప్రకటించారు. -
‘బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం ఫిక్సింగ్లో భాగమే’
ఢిల్లీ : తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం బీజేపీ-బీఆర్ఎస్ల మ్యాచ్ ఫిక్సింగ్లో భాగమేనన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి. బీజేపీ-బీఆర్ఎస్లు మ్యాచ్ ఫిక్సింగ్లో ఉన్నాయనే విషయం దీని ద్వారా నిరూపితమైందంటూ సెటైర్లు వేశారు. ఈరోజు(సోమవారం, జూన్ 30) ఢిల్లీ నుంచి మాట్లాడిన చామల.. కేసీఆర్ గెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని, అటువంటప్పుడు దోచుకోవడానికి ఏముంటుందని ప్రశ్నించారు కిరణ్కుమార్రెడ్డి‘మీరు(కేంద్రం) ఏమైనా నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తుంది. బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలుపుకోసం బీఆర్ఎస్ చేసింది అందరికీ తెలుసు. రానున్న రోజుల్లో కూడా ఆ రెండు పార్టీలు అదే రూట్ మ్యాచ్తో ముందుకు వెళ్లనున్నాయి. హైదరాబాద్లో మెట్రోకు పునాదులు వేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. కిషన్రెడ్డి.. తెలంగాణ, హైదరాబాద్ సమస్యల విషయంలో నోరు విప్పరు. హైదరాబాద్ నగర ప్రజకు కిషన్రెడ్డి చేసిందేమిటి?, ఈ ఏడాది కేంద్రం నయా పైసా ఇవ్వలేదు. విభజన హామీలు నెరవేర్చలేదు. హైదరాబాద్ మెట్రో కోసం ఐదారుసార్లు సీఎం రేవంత్ ఢిల్లీకి వచ్చారు. మనం కట్టిన ట్యాక్సుల్లో మన వాటా వెనక్కి రావడం లేదు. సీఎం రేవంత్ తన ప్రయత్నం తాను చేస్తున్నారు.. కిషన్రెడ్డి కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచెయ్యాలి’ అని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి సూచించారు. బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఆయనే.. -
హైడ్రాపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
హైడ్రాపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా హైడ్రా వ్యవహరిస్తోందని.. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.హైదరాబాద్, సాక్షి: మాదాపూర్ సున్నం చెరువు దగ్గర హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సోమవారం గరం అయ్యారు. చెరువును బఫర్ జోన్ చేయకుండానే కూల్చివేతలు చేపట్టారంటూ హైడ్రా అధికారులపై మండిపడ్డారాయన. ‘‘చెరువులు కబ్జాకు గురికాకుండా అభివృద్ధి చేయాలన్నది సీఎం రేవంత్రెడ్డి ఆలోచన. కానీ, హైడ్రా తీరు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేలా ఉంది. హైడ్రా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. సున్నం చెరువు బఫర్ జోన్ చేయకుండా కూల్చివేతలు చేపట్టారు. ఈ అంశంపై సీఎం రేవంత్ను కలుస్తా’’ అని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. ఇదిలా ఉంటే.. సున్నం చెరువు హైడ్రా కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. పలువురు ప్రొక్లెయిన్కు అడ్డం పడి హైడ్రా డౌన్ డౌన్.. హైడ్రా కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అన్యాయంగా తమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అధికారులు మాత్రం భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగించారు. -
పాశమైలారంలో ఇది మూడో ఘటన: హరీష్రావు
పాశమైలారం ఘటన ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బాధితులకు భారీగా పరిహారం అందించాలని డిమాండ్ చేసిన ఆయన.. ప్రమాదంపై న్యాయ విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సాక్షి, సంగారెడ్డి: పటాన్చెరు పారిశ్రామికవాడ పాశమైలారంలో కెమికల్ ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై మాజీ మంత్రి హరీష్రావు స్పందించారు. ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారాయన. సోమవారం ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పాశమైలారంలో ఈ మధ్యకాలంలో జరిగిన ఇది మూడో ఘటన. అయినా కూడా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. ఈ ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలి. ఎంత మంది చనిపోయారో కూడా క్లారిటీ లేదు. ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి. మృతి చెందిన వాళ్ల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి. గాయపడిన వాళ్లకు రూ. 50 లక్షలు అందించాలి’’ అని ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు. గాయపడ్డ 26 మందికి ఆస్పత్రుల్లో చికిత్స అందుతోంది. వాళ్లకు మెరుగైన వైద్యం అందాలి. అవసరమైతే కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందించాలి అని హరీష్ రావు కోరారు. సోమవారం ఉదయం 9గం. ప్రాంతంలో పాశమైలారంలోని కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో ఘోర ప్రమాదం సంభవించింది. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ సహా చాలా ప్రాంతం కుప్పకూలిపోగా.. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
బీజేపీ అధ్యక్షుడి ఎంపిక.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీలో కోల్డ్ వార్ నడుస్తోంది. బీజేపీ అధ్యక్షుడి నియామకంపై కాషాయ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ హైకమాండ్ను టార్గెట్ చేసి రాజాసింగ్ విమర్శలు గుప్పించారు.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావును అధిష్టానం ఖరారు చేసింది. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ రాజాసింగ్ స్పందించారు. రాజాసింగ్ మాట్లాడుతూ..‘రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్ఠానం నిర్ణయించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటు వేసి ఎన్నుకోవాలి. అంతేకానీ, పార్టీలో మావాడు, మీవాడు అంటూ నియమించుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే కచ్చితంగా ఎన్నిక నిర్వహించాలి’ అని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు కూడా రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేసి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ వీడియోలో రాజాసింగ్.. ‘నన్ను అధ్యక్షుడిగా చూడాలని చాలా మంది కార్యకర్తలు ఫోన్లు చేస్తున్నారు. అందుకే నాకో అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నా. నన్ను నియమిస్తే.. పార్టీలో గోరక్షణ విభాగాన్ని ఏర్పాటు చేస్తా. గోరక్షణకు పాటుపడే కార్యకర్తలకు రక్షణగా నిలబడతా. బీజేపీ అవసరాన్ని గడపగడపకు చాటిచెబుతా. ఎన్నికలకు ఆర్నెల్ల ముందే అభ్యర్థులను ప్రకటిస్తాం. అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు. వీఐపీలా ఉండే వారు కాకుండా.. హిందుత్వం కోసం పనిచేసే వ్యక్తినే నియమిస్తే బాగుంటుంది. రాజాసింగ్ అధ్యక్షుడు కావొద్దని అడ్డుకునే ఒక బృందం పనిచేస్తోంది’ అంటూ ఆరోపణలు చేశారు. -
బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఆయనే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనే సస్పెన్స్కు తెరపడినట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పేరు బీజేపీ అధిష్టానం ఖరారు చేసినట్టు సమాచారం. ఈ మేరకు సోమవారం ఉదయం హైకమాండ్ నుంచి ఆయనకు ఫోన్ వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం రెండు గంటలకు రామచందర్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అధ్యక్ష ఎన్నికకు పెద్దగా పోటీ లేకుండానే.. అందరి సమ్మతితో ఎన్నిక జరిపే విధంగా హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది.మరోవైపు.. తెలంగాణలో బీజేపీలోని కీలక నేతలకు హైకమాండ్ నుంచి ఫోన్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు అధికారికంగా అధ్యక్ష అభ్యర్థికి సమాచారం ఇస్తామన్న హైకమాండ్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అందరూ అందుబాటులో ఉండాలంటూ పలువురు నేతలకు సమాచారం ఇచ్చారు. దీంతో, సదరు నేతలంతా 11 గంటలకు వచ్చే కాల్ కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం. నామినేషన్ల స్వీకరణ రాష్ట్ర కార్యాలయంలోనే..బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సోమవారం నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పరిశీలన, ఉపసంహరణకు అవకాశం కల్పించారు. జూలై 1వ తేదీన అధ్యక్ష ఎన్నిక, ప్రకటన ఉంటుంది.అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో 119 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, 38 జిల్లా శాఖల అధ్యక్షులు, 17 మంది జాతీయ కౌన్సిల్ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన అంశంపై పార్టీ నాయకత్వం ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా మన్నెగూడ సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ అభయ్పాటిల్, సంస్థాగత ఇన్చార్జ్ చంద్రశేఖర్ తివారి తదితరులు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. -
కొండా మురళి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్లో కొత్త ట్విస్ట్!
సాక్షి, వరంగల్: తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ, కొండా మురళి రాజకీయ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. వరంగల్ రాజకీయం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ఇలాంటి తరుణంలో కొండా మురళి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.తాజాగా వరంగల్లో ఆర్యవైశ్య సంఘం కార్యక్రమంలో కొండా మురళి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొండా మురళి మాట్లాడుతూ..‘గత ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చుపెట్టి విజయం సాధించాం. నాకు 500 ఎకరాల భూమి ఉంది.. ఎన్నికల కోసం 16 ఎకరాలు అమ్మాల్సి వచ్చింది. నా రాజకీయ జీవితంలో ఉన్నత వర్గాలతోనే నా పోటీ ఉంటుంది. వాసవి కన్యక పరమేశ్వరీ సాక్షిగా చెబుతున్నా నాకు ఎవరి పైసా అవసరం లేదు. నేను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. అలాగే, నేను ఎవరికీ భయపడను’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. గత కొద్దిరోజులుగా కాంగ్రెస్లో కొండా దంపతుల రాజకీయంపై ఉమ్మడి వరంగల్ జిల్లా హస్తం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కొండా మురళి వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇటీవల పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆయన శనివారం గాంధీభవన్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. గాంధీభవన్కు పెద్దసంఖ్యలో కార్యకర్తలతో తరలివచ్చిన ఆయన.. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి ముందు వివరణ ఇచ్చారు. ఆరు పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందించారు.అనంతరం కొండా మురళి మాట్లాడుతూ.. ‘‘నా వ్యాఖ్యలపై మల్లు రవికి వివరణ ఇచ్చాను. కాంగ్రెస్ నేతలంటే నాకు గౌరవం ఉంది. కొందరు నేతలపై వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవద్దు. నేను బలవంతుడినో, బలహీనుడినో అందరికీ తెలుసు. కార్యకర్తలను పట్టించుకోవాలని మాత్రమే కోరాను. రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం కావాలి. బీసీలకు మేలు జరగాలని 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే తపన మా అందరిలో ఉంది’’ అని పేర్కొన్నారు. -
నై.. తెలంగాణ అన్న వ్యక్తి సీఎం గద్దెనెక్కారు: హరీశ్రావు
అమరచింత: తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సమయంలో ‘నై తెలంగాణ’అన్న వ్యక్తి, నేడు తెలంగాణ సీఎంగా గద్దెనెక్కి ఇక్కడి వనరులను ఆంధ్రకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. వనపర్తి జిల్లా అమరచింతలో ఆదివారం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాయిచంద్ విగ్రహావిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గతంలో కొడంగల్ నుంచి రేవంత్రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, తన పాటల తూటాలతో రేవంత్ను అక్కడి నుంచి తరిమికొట్టిన ఘనత సాయిచంద్కే దక్కిందన్నారు.అలాంటి సాయి మన మధ్య లేకపోవడంతోనే ఈనాడు నై తెలంగాణ అన్న వ్యక్తులు రాజ్యమేలుతు న్నారని దుయ్యబట్టారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో జరుగుతున్న కుట్రలను ప్రతి తెలంగాణ వాది అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నా రు. కేసీఆర్ను నామరూపాలు లేకుండా చేస్తా అని ప్రగల్భాలు పలుకుతు న్న సీఎం రేవంత్రెడ్డి.. కేసీఆర్ ఒక శక్తి అనే విషయాన్ని మరచిపోతున్నార న్నారు. ఆసరా పెన్షన్ల పెంపు ఏమైందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ నవీన్రెడ్డి, మరో నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
ఎన్నిక ఏకగ్రీవమే!
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ యెండల లక్ష్మీనారాయణ ఎన్నిక ప్రకటన విడుదల చేశారు. అధ్యక్ష స్థానానికి పోటీ చేయాలనుకునేవారు సోమవారం నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. జూలై 1వ తేదీన అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. ఈ మేరకు పార్టీ పెద్దలు ఎన్నిక ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో 119 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, 38 జిల్లా శాఖల అధ్యక్షులు, 17 మంది జాతీయ కౌన్సిల్ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన అంశంపై పార్టీ నాయకత్వం ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా మన్నెగూడ సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ అభయ్పాటిల్, సంస్థాగత ఇన్చార్జ్ చంద్రశేఖర్ తివారి తదితరులు పార్టీ రాష్ట్ర నాయ కత్వానికి దిశానిర్దేశం చేశారు. అధ్యక్ష ఎన్నికకు పెద్దగా పోటీ లేకుండానే..అందరి సమ్మతితో ఎన్నిక జరిపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే సోమవారం నాటి నామినేషన్ల ప్రక్రియలో అందరి సమ్మతితో ఒక అభ్యర్థి మాత్రమే నామినేషన్ దాఖలు చేసేలా క్షేత్రస్థాయి నాయకత్వంతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. నామినేషన్ వేసిన కొన్ని గంటల వ్యవధిలోనే నామినేషన్ పరిశీలన నిర్వహిస్తారు. ఒకరికంటే ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్ వేస్తే... విత్డ్రాకు కూడా అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియంతా నామమాత్రమేనని పార్టీ నేతలు అంటున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే పలువురు ఢిల్లీ పెద్దలను కలిసి అవకాశం కల్పించాలంటూ ఎవరికి వారు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం క్షేత్రస్థాయి నాయకత్వంతో సమాలోచనలు చేసి అభిప్రాయాలను సైతం స్వీకరించినట్టు తెలిసింది. అధ్యక్ష ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే వ్యవహరిస్తారు.నామినేషన్ల స్వీకరణ రాష్ట్ర కార్యాలయంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సోమవారం నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పరిశీలన, ఉపసంహరణకు అవకాశం కల్పించారు. జూలై 1వ తేదీన అధ్యక్ష ఎన్నిక, ప్రకటన ఉంటుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పోటీలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు పేరు బలంగా వినిపిస్తున్నాయి. ఈసారి అధ్యక్ష స్థానాన్ని బీసీకే ఇస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ఈటల బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయనకు అవకాశం ఎక్కువగా ఉంటుందనే ప్రచారముంది. -
కాంగ్రెస్కు ఏటీఎం: అమిత్షా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆరోపించారు. రేవంత్రెడ్డి సర్కార్ ఢిల్లీలో కాంగ్రెస్ నాయకత్వానికి ఏటీఎంలా మారిందని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు వచ్చాయని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కాళేశ్వరం, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సింగరేణి నియామకాల వంటి వాటి ద్వారా రాష్ట్రాన్ని భారీగా లూటీ చేసి, ఏటీఎంలా మార్చి దోచేసుకుందని ఆరోపించారు. ఆదివారం నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఎంపీ అర్వింద్, బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలతో కలిసి అమిత్షా ప్రారంభించారు. పసుపు రైతులతో మాట్లాడారు. పసుపు బోర్డు లోగోను ఆవిష్కరించారు. రైతు మహా సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.అధికారం మారినా అవినీతి మారలేదు‘రాష్ట్రంలో అధికారం మారినప్పటికీ అవినీతి మారలేదు. బీఆర్ఎస్ చేసిన అవినీతిపై రేవంత్రెడ్డి ప్రభుత్వం కేసులు నమోదు చేయడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి మించి అవినీతికి పాల్పడుతోంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు నాయకులు, కార్యకర్తలు సంకల్పం తీసుకోవాలి. ఆపరేషన్ సిందూర్కు ఆధారాలు చూపించాలంటూ రాహుల్బాబా ఏవేవో పిచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు. మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో పాకిస్తాన్కు భారత్ తడాఖా ఏంటో చూపించింది. పదేళ్లలో మూడుసార్లు ఆ దేశంపై దాడి చేసింది. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ చేశాం. యూరి, పుల్వామా, పహల్గామ్ దాడులకు ధీటైన బదులు ఇచ్చాం. ఆపరేష¯న్ సిందూర్ ద్వారా పాకిస్తాన్ గడ్డపైకి వెళ్లి దాడి చేశాం. అక్కడి ఉగ్రవాదుల స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. కీలక టెర్రరిస్టులను మట్టుబెట్టింది. కానీ గతంలో కాంగ్రెస్ సర్కార్.. పాకిస్తాన్ విషయంలో మెతక వైఖరి అవలంబించింది..’ అని అమిత్షా విమర్శించారు. 2026 మార్చిలోగా నక్సల్స్ ఏరివేత‘దేశ భద్రతను మోదీ ప్రభుత్వం పటిష్టం చేçస్తోంది. దేశంలో అశాంతికి కారణమైన నక్సల్స్ ఏరివేతకు అపరేషన్ కగార్ చేపట్టాం. (ఆపరేషన్ కగార్ చేయాలా.. వద్దా అని సభికులను ప్రశ్నించారు) దశాబ్దాలుగా నక్సల్స్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. లొంగిపోవాలని గతంలోనే హెచ్చరించినా లొంగిపోలేదు. అందుకే కగార్ చేపట్టాం. 2026 మార్చిలోగా దేశంలో నక్సల్స్ లేకుండా చేసి ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుంటాం. మావోయిస్టులు వెంటనే హత్యాకాండను విడిచి లొంగిపోవాలి..’ అని కేంద్ర హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. పసుపు పంటకు రాజధానిగా ఇందూరు‘తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీ మేరకు మోదీ ప్రభుత్వం జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. భారతీయ సంప్రదాయాల్లో, ఔషధాల తయారీలో వినియోగించే పసుపు పంటను నిజామాబాద్ జిల్లా రైతాంగం అధికంగా సాగు చేస్తోంది. అందుకే ఈ ప్రాంత రైతుల ఆకాంక్షను గౌరవిస్తూ ప్రధాని మోదీ నిజామాబాద్లో పసుపు బోర్డును నెలకొల్పారు. ఇప్పుడు నిజామాబాద్ పసుపు పంటకు రాజధాని నగరంగా మారింది. నిజామాబాద్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. అనేక దశాబ్దాలుగా ఈ పంట పండిస్తున్నప్పటికీ రైతులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా లాభాలు సమకూరడం లేదు. ప్రస్తుతం బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు ఇప్పుడు అందుతున్న మద్దతు ధర కంటే రానున్న రెండు మూడు సంవత్సరాల్లో క్వింటాలుకు అదనంగా కనీసం రూ.7 వేల వరకు ఎక్కువ ధర దక్కుతుంది. ఎగుమతులు భారీగా పెరిగితే ధర కూడా భారీగా పెరిగిపోతుంది. పసుపు బోర్డు ద్వారా రైతులకు నాణ్యమైన పంటను సాగు చేసేలా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, ఎగుమతుల వరకు దళారుల ప్రమేయం లేకుండా చేయడం జరుగుతుంది. 2030 వరకు అంతర్జాతీయ స్థాయిలో ఒక బిలియన్ డాలర్ల విలువ చేసే పసుపు ఉత్పత్తులను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భారత్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్, ఆర్గానిక్ పంటను ప్రోత్సహించేందుకు రీసెర్చి అండ్ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పుతోంది..’ అని అమిత్షా వెల్లడించారు.స్థానిక రైతుల పోరాటం ఫలించింది: తుమ్మలతెలంగాణ పసుపు రైతుల చిరకాల వాంఛను గుర్తించి పసుపు బోర్డును ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు. బోర్డు ఏర్పాటుతో ఈ ప్రాంత రైతుల పోరాటం ఫలించినట్లయిందని అన్నారు. బోర్డు ద్వారా అధునాతన సాగు విధానాలు, యాంత్రీకరణ, సరికొత్త పరిశోధనలు, మెరుగైన మార్కెటింగ్, ఎగుమతుల వంటి వసతులతో పసుపు రైతులకు ప్రయోజనం కలిగేలా కేంద్రం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల సంక్షేమమే పరమావధిగా పాలన చేస్తోందని, తీవ్ర ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ రైతాంగ ప్రయోజనాల కోసం ఏడాది కాలంలోనే రూ.లక్ష కోట్ల వరకు ఖర్చు చేశామని చెప్పారు. బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ.. పసుపు బోర్డును ఏర్పాటు చేసినందుకు ప్రధాని మోదీకి, అమిత్షాకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బోర్డు కార్యదర్శి భవానిశ్రీ, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య, కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
‘నేను కూడా అధ్యక్ష పదవి అడగాలనుకుంటున్నా’
హైదరాబాద్: మరో రెండు రోజుల్లో తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు రాబోతున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. రేపు(సోమవారం, జూన్ 30వ తేదీ) నామినేషన్ ప్రక్రియ ఉండబోతుందని, ఎవరికి వారే తానే ప్రెసిడెంట్ అని చెప్పుకుంటున్నారని రాజాసింగ్ అన్నారు. తనకు అనేక మంది కార్యకర్తలు ఫోన్లు, మెసేజ్లు చేస్తున్నారన్నారు. మనం ఎందుకు ప్రెసిడెంట్గా పోటీ చేయకూడదని చాలా మంది అడుగుతున్నారన్నారు. అందుకే తాను కూడా అధ్యక్ష పదవి అడగాలని అనుకుంటున్నానని తెలిపారు. చాలా మంది కార్యకర్తల మనస్సులో ప్రెసిడెంట్ అంటే ఎలా ఉండాలో అనుకునే విషయాన్ని రాజాసింగ్ పేర్కొన్నారు‘బీజేపీకి వీఐపీ లాంటి వ్యక్తి ప్రెసిడెంట్ ఉండకూడదు. కార్యకర్తలు అన్న అని పిలిచే ప్రజల మనిషి అయిన వారు ప్రెసిడెంట్ గా ఉండాలి. నేను ప్రెసిడెంట్ అయితే గోరక్ష కోసం ప్రత్యేకంగా టీమ్ ఏర్పాటు చేస్తా. బీజేపీ కార్యకర్తలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అండగా ఉండేలా ఏర్పాట్లు చేస్తా.. నేరుగా కలిసే ప్రయత్నం చేస్తా. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ స్టైల్ లో ముందకు వెళ్తాం. యోగి పేరు వింటే దొంగలు, గూండాలు, రౌడీలు యూపీ వదలి వేరే రాష్ట్రానికి పారిపోతున్నారు. ఆ సిస్టమ్ ను తెలంగాణలో అమలు చేస్తాం. రాజాసింగ్ ప్రెసిడెంట్ కావాలి అనుకునే వాళ్లు నా పేరును కేంద్ర నాయకులకు చెప్పండి’ అని రాజాసింగ్ స్పష్టం చేశారు. -
‘అందరికీ ఇచ్చారు అవకాశం.... ఈసారి బీజేపీకి ఇవ్వండి అధికారం’
నిజామాబాద్: వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం ఇవ్వాలని కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతును రాజును చేయడమే మోదీ సర్కారు లక్ష్యమని, అందుచేత బీజేపీకి అధికారం ఇవ్వాలని బండి సంజయ్ విన్నవించారు. నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్షా ప్రారంభించారు. దీనిలో భాగంగా ఇందూరు రైతు మహా సమ్మేళన సభలో బండి సంజయ్ ప్రసంగించారు. ‘ రైతును రాజును చేయడమే మోదీ సర్కారు లక్ష్యం. పసుపు బోర్డు సాధించుకున్న ఇందూర్ రైతులు హీరోలు. ధర్మపురి అరవింద్ పసుపు అరవింద్ అయ్యారు’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.బండి సంజయ్న ప్రసంగానికి ఆహ్వానించిన క్రమంలో సభ చఘ్పట్లతో దద్దరిల్లింది. ప్రజా స్పందనను ఆస్వాదిస్తూ బండి సంజయ్ ప్రసంగాన్ని ఆలకించారు అమిత్ షా. దేశ ప్రజల ఆరోగ్యంలో పసుపు రైతులది కీలక పాత్ర: అమిత్ షా