తిరువళ్లూరులో వర్ద బీభత్సం | Sakshi
Sakshi News home page

తిరువళ్లూరులో వర్ద బీభత్సం

Published Tue, Dec 13 2016 2:04 AM

Warda cyclone in Chennai

తిరువళ్లూరు:తిరువళ్లూరు జిల్లాను వార్దా తుపాన్‌ అతలాకుతలం చేసింది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షంతో జిల్లాలో బీభత్స పరిస్థితి ఏర్పడింది.  తిరువళ్లూరు జిల్లాలో వార్దా తుపాన్‌ ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో అందుకు రెట్టింపు ప్రభావాన్ని చూపింది. జిల్లాలో ఆదివారం రాత్రి 12 గంటలకు ప్రారంభమైన వర్షం సామవారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కుండపోతలా కురిసింది. బలమైన ఈదురు గాలులు వీయడంతో రాత్రి నుంచే చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేయడంతో అంధకారంగా మారింది. జిల్లా అంతా నిర్మాణుష్యంగా మారింది. దీంతో పాటు సెల్‌ఫోన్లు,  ఇంటర్‌నెట్, బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు పూర్తిగా స్తంభించాయి. ఉదయం  నుంచే భారీ వర్షం పడడంతో ఆవడి, పట్టాభిరాం, ఏకాటూరు తదితర ప్రాంతాల్లో రైలు తీగలు తెగిపడడంతో రైలు సేవలను పూర్తిగా నిలిపి వేశారు. దీంతో వేలాది మంది ప్రయాఇకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.  తిరువళ్లూరు నుంచి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు రైలు పెట్టేల్లోనే తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారికి తాగునీరు, అన్నంతో పాటు ఇతర వస్తువులు దొరక్కపోవడంతో అవస్థలు పడ్డారు. జిల్లా నుంచి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లే బస్సులను నిలిపి వేశారు.

 రోడ్డులో  భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో చాలా మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు.  సముద్ర తీర ప్రాంతాలకు చెందిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి తరలించారు.  మత్స్యకారులను చేపల వేటకు అనుమతించకపోవడంతో పాటు సముద్రతీర ప్రాం తాలకు చెందిన ప్రజలను ఎప్పటికప్పడు అధికారులు అప్రమత్తం చేశారు. జాతీయ విపత్తు నిర్వాహణ సంస్థ ఆధ్వర్యంలోని ప్రత్యేక టీమ్‌ను సిద్ధంగా ఉంచారు.  కలెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి ప్రస్తుత పరిస్థితులను  అంచనా వేస్తూ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.  జిల్లాలో ఇప్పటి వరకు 12 విద్యుత్‌ స్తంభాలు కూలిపోగా, పోలీవాక్కం, కడంబత్తూరు తదితర ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  ఇది ఇలా వుండగా జిల్లాలో నీ ప్రభుత్వ ప్రయివేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఉదయం నుంచే కారు చీకటి కమ్ముకుంది. ఉదయం నుంచి స్వల్పగాలులు వీచినా మధ్యాహ్ననానికి గాలి మరింత పెరిగి బీభత్సం సృష్టించింది. ఇప్పటికే జిల్లా అంతటా వందలాది విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో మరో రెండు రోజుల వరకు విద్యుత్‌ వచ్చే పరిస్థితి

ఉండదని అధికారులు వెల్లడించారు.
అచ్చిరాని డిసెంబర్‌: తిరువళ్లూరు జిల్లాకు డిసెంబర్‌ నెల అచ్చిరావడం లేదన్న అభిప్రాయం ఉంది. గత డిసంబర్‌లో కురుసిన భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేయగా, ప్రస్తుతం భారీ ఈదురు గాలీతో తమ ప్రతాపాన్ని చూపింది.  దీంతో జిల్లాలో డిసెంబర్‌ నెలంటేనే హడలిపోయే పరిస్థితి ఏర్పడింది.

Advertisement
Advertisement