రాష్ర్టంతో పాటు ఆంధ్రప్రదేశ్లో జరిగి ఘోర రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అత్యవసర ద్వారాలు లేని వోల్వో బస్సులను నిషేధిస్తామని రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి తెలిపారు.
మే 1 నుంచి అమలు..
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంతో పాటు ఆంధ్రప్రదేశ్లో జరిగి ఘోర రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అత్యవసర ద్వారాలు లేని వోల్వో బస్సులను నిషేధిస్తామని రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి తెలిపారు. సోమవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో వోల్వో బస్సుల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాల్లో చాలా మంది అమాయక ప్రయాణికులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలకు అనేక మార్గదర్శకాలు జారీ చేశామని గుర్తు చేశారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఆ మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అందులో భాగంగా అత్యవసర ద్వారాలు లేని వోల్వో బస్సుల సంచారాన్ని అనుమతించే ప్రసక్తే లేదని, వాటిని సీజ్ చేస్తామని చెప్పారు. బస్సుల్లో అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవడానికి ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలకు చాలా గడువు ఇచ్చామని తెలిపారు.
అత్యవసర ద్వారాలను ఏర్పాటు చేయాలని వోల్వో సంస్థకు కూడా సూచించామని వెల్లడించారు. బస్సుల నిర్మాణ దశలోనే అత్యవసర ద్వారాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కంపెనీలకు సైతం సూచించామని తెలిపారు. లేనట్లయితే అలాంటి బస్సులను ప్రభుత్వం ఇక కొనుగోలు చేయబోదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రైవేట్ వోల్వో బస్సులకు అత్యవసర ద్వారాలు లేకుంటే సీజ్ చేస్తామని తేల్చిచెప్పారు.