చార్జీలు రెండింతలు


సాక్షి, ముంబై: వేసవి సెలవులకు స్వగ్రామాలకు వెళ్లిన ముంబైకర్లు నగరానికి తిరుగుముఖం పట్టడం ప్రైవేటు బస్సు యజమానులకు వరంగా మారింది. రద్దీ బాగా పెరిగిపోతుండడంతో ఇదే అదనుగా భావించిన వీరంతా ఒక్కసారిగా చార్జీలు పెంచేశారు. రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్ దొరక ్కపోతుండడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రయాణికులు  ప్రైవేటు బస్సులను ఆశ్రయించక తప్పడం లేదు. ఏప్రిల్  నెలలో పాఠశాలలకు సెలవు ప్రకటించిన సమయంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. పాఠశాలలు జూన్ 16 నుంచి ప్రారంభం కానుండడంతో స్వగ్రామాలకు వెళ్లినవారంతా తిరుగుముఖం పట్టారు.



 ముంబై-క ణకావ్లీ మధ్య రద్దీ లేని సమయంలో చార్జీ కింద రూ.350-400 వసూలుచేసిన ప్రైవేటు బస్సు యజమానులు ఇప్పుడు రూ.750-800 వరకు వసూలు చేస్తున్నారు. ముంబై- ఔరంగాబాద్ మధ్య రద్దీ లేని సమయంలో ఏసీకి రూ.900-1000 వరకు వసూలు చేయగా ఇప్పుడు రూ.1200-1300 వరకు వసూలు చేస్తున్నారు. ఇక నగరం నుంచి నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల దిశగా బస్సులను నడిపే ఆపరేటర్లు కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారు. ముంబై-సికింద్రాబాద్‌ల మధ్య నడిచే దేవగిరి ఎక్స్‌ప్రెస్ మినహా నిజామాబాద్ నుంచి ముంైబె కి నేరుగా వచ్చే రైళ్లు లేవు. దీంతో దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలుకు విపరీతమైన రద్దీ ఉంటుంది. ఇక సీజన్‌లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.



 వెయిటింగ్ లిస్టు సంఖ్య 400కి చేరుకుంటున్నప్పటికీ టికెట్లను కొనుగోలు చేయడానికి సైతం వెనకాడడం లేదు. అందులో ఎక్కేందుకు స్థలం దొరికితే చాలని ప్రయాణికులు అనుకుంటారు. ఇక చేసేదేమీలేక మరికొందరు ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న ప్రైవేటు బస్సు యజమానులు అందినంత దోచుకుంటున్నారు రద్దీలేని సమయాల్లో చార్జీ కింద రూ.600-700, అదే జూన్ తరువాత అయితే రూ.900-950 వరకు వసూలు చేస్తున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top