ఆ ఎమ్మెల్యేలకు గాలం.. | palaniswamy targets panneer selvams camp mlas | Sakshi
Sakshi News home page

ఆ ఎమ్మెల్యేలకు గాలం..

Feb 20 2017 9:01 PM | Updated on Sep 5 2017 4:11 AM

ఆ ఎమ్మెల్యేలకు గాలం..

ఆ ఎమ్మెల్యేలకు గాలం..

పన్నీరు వెన్నంటి ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్ని, 12 మంది ఎంపీలను తమ వైపుకు తిప్పుకునేందుకు తగ్గ కసరత్తుల్లో అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ వ్యూహరచనల్లో పడ్డారు.

చెన్నై:
పన్నీరు వెన్నంటి ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్ని, 12 మంది ఎంపీలను తమ వైపుకు తిప్పుకునేందుకు తగ్గ కసరత్తుల్లో అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ వ్యూహరచనల్లో పడ్డారు. ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ ఆదేశాను సారంగా ఎమ్మెల్యేలను ఆహ్వానించడమా లేదా పదవీ గండం తప్పదన్న హెచ్చరికతో బలవంతంగా తిప్పుకోవడమా అన్న అస్త్రాల్ని ప్రయోగించేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లో పన్నీరును వీడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యేలు తేల్చడం విశేషం. అమ్మ జయలలిత మరణంతో అన్నాడీఎంకే రెండుగా చీలింది. చిన్నమ్మ శశికళ శిబిరం, అమ్మ విధేయుడు పన్నీరు శిబిరంగా కార్యకర్తలు చీలారు. అధికారం లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు సాగినా, స్పీకర్‌ ధనపాల్‌ రూపంలో క్యాంప్‌ రాజకీయాలతో చిన్నమ్మ విధేయుడు పళనిస్వామికి బలం సమకూరింది. చిన్నమ్మ వీరశపథాన్ని నెరవేర్చామన్న ఆనందంలో ఉన్న టీటీవీ దినకరన్, ఇక, పన్నీరును ఒంటరి చేయడం లక్ష్యంగా వ్యూహ రచనల్లో పడ్డారు.

పన్నీరు వెన్నంటి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలను మళ్లీ తమ వైపునకు తిప్పుకోవడం లక్ష్యంగా కసరత్తుల్ని వేగవంతం చేశారు. ప్రభుత్వం తమ చేతిలో ఉన్న దృష్ట్యా, ఇటువైపుగా వస్తే భవిష్యత్తు బాగుటుందని, లేనిపక్షంలో పాతాళంలోకి నెట్టడం ఖాయం అన్న బెదిరింపు ధోరణితో ముందుకు సాగేందుకు సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. పరప్పన అగ్రహార చెరలో ఉన్న చిన్నమ్మ శశికళతో భేటీ అనంతరం ఆమె ఆదేశానుసారంగా  ఆహ్వానం పలకడం లేదా, పదవీ గండాన్ని సృష్టించే విధంగా హెచ్చరికలతో ముందుకు సాగేందుకు నిర్ణయించినట్టు ఆ శిబిరంలో చర్చ సాగుతోంది. ప్రధానంగా తమకు ఎమ్మెల్యేల మద్దతు కీలకంగా ఉన్న దృష్ట్యా, 11 మంది ఎమ్మెల్యేలను గురిపెట్టి గాలం వేయడానికి తీవ్ర ప్రయత్నాలు సాగించే పనిలో ఉన్నట్టు చెబుతున్నారు. కేవలం మెజారిటీ నలుగురే ఉన్నందున, డీఎంకే ఎత్తుగడల్ని ఢీకొట్టాలంటే, అటు వైపుగా ఉన్న వాళ్లను ఇటువైపు రప్పించుకోవడం ద్వారా సాధ్యమన్న భావనతో దినకరన్‌ అడుగులు వేస్తున్నట్టు పేర్కొంటున్నారు.

అమ్మ డీఎంకేతో ముందుకు:
అధికారం చిన్నమ్మ శిబిరం చేతికి చేరినా, ఎక్కువ కాలం ఈ ప్రభుత్వం కొనసాగేనా అన్న అనుమానాల్ని వ్యక్తం చేసే వాళ్లు రాష్ట్రంలో ఎక్కువగానే ఉన్నారు. ఆ దిశగా ఈ ప్రభుత్వాన్ని కూల్చడం లక్ష్యంగా తమ వైపు నుంచి పన్నీరు శిబిరంలోని ఎమ్మెల్యేలు ప్రయత్నాలు వేగవంతం చేయడానికి నిర్ణయిం చినట్టు తెలిసింది. ఎమ్మెల్యేలు శిబిరం నుంచి బయటకు వచ్చి ఉండడంతో, తమ సన్నిహితుల ద్వారా తమకు మద్దతుగా నిలిచేందుకు ఇది వరకు నిర్ణయించిన వారితో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. చిన్నమ్మ అధికారాన్ని ఢీకొట్టే విధంగా పార్టీ రెండాకుల చిహ్నాన్ని ఎన్నికల కమిషన్‌ ద్వారా చేజిక్కించుకునే ప్రయత్నాలు వేగవంతం చేయడం లేదా, అమ్మ డీఎంకే నినాదంతో ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే వ్యూహంతో పన్నీరు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు అక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం మద్దతు ఇస్తుండడం ఆహ్వానించదగ్గ విషయం.
 
పన్నీరు వెన్నంటే:
ఎన్ని బెదిరింపులు వచ్చినా, అడ్డంకులు ఎదురైనా పన్నీరు వెంట నడిచేందుకు 11 మంది ఎమ్మెల్యేలు నిర్ణయించారు. అసెంబ్లీలో స్పీకర్‌ వ్యవహరించిన తీరును, ప్రధాన ప్రతి పక్షం మీద జరిగిన దాడిని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విద్యాసాగర్‌రావుకు పన్నీరు సెల్వం నేతృత్వంలో ఎమ్మెల్యేల బృందం ఫిర్యాదు చేసింది. బలపరీక్ష ప్రజా స్వామ్యానికి విరుద్ధంగా జరిగిందని, దీనిని అంగీకరించ వద్దు అని, మళ్లీ బలపరీక్షకు ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. అనంతరం పన్నీరు సెల్వం తరఫున ఎమ్మెల్యే, మాజీ మంత్రి పాండియరాజన్‌ మీడియాతో మాట్లాడారు.మరో రోజు బలపరీక్షకు స్పీకర్‌ చర్యలు తీసుకుని ఉండాల్సిందని, అయితే, ప్రధాన ప్రతి పక్షంతో పాటు, కాంగ్రెస్‌ సభ్యులు సైతం సభలో లేని సమయంలో ఓటింగ్‌ నిర్వహించారని మండిపడ్డారు. అన్ని వివరాలను, ఆధారాలను గవర్నర్‌ ముందు ఉంచామన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా పన్నీరు వెంట ముందుకు సాగుతామని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. త్వరలో మంచి నిర్ణయం వెలువడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement