సాక్షి, హైదరాబాద్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నాయకురాలు జయలలితకు చెందిన హైదరాబాద్లోని ఇంటిని అధికారులు సీజ్ చేశారు. శ్రీనగర్ కాలనీలోని జయలలిత ఇంటిని అధికారులు సీజ్ చేశారు. రూ.83 లక్షల ఇంటి పన్ను పెండింగ్లో ఉండడంతో చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె పలుసార్లు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆమెను అభిమానులు పురట్చి తలైవి (విప్లవ నాయకురాలు), అమ్మ అని పిలుచుకునేవారు. రాజకీయాల్లోకి రాకముందు జయలలిత సినిమాల్లోనూ నటించారు.
మరోవైపు, జయలలితకు భారీగా ఆస్తులు ఉన్నాయి. జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు అప్పట్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులు గతంలో తమిళనాడు ప్రభుత్వానికి చేరాయి. పసిడి ఆభరణాలు, నగదుతో పాటు ఆస్తుల పత్రాలను మూడు ట్రంకు పెట్టెల్లో అధికారులు తమిళనాడు సర్కారుకు అప్పగించారు.


