మూడు మహా ప్రాజెక్టులకు ఓకే | Navi Mumbai, Pune, Nagpur Airport projects to take off | Sakshi
Sakshi News home page

మూడు మహా ప్రాజెక్టులకు ఓకే

Nov 14 2013 12:48 AM | Updated on Sep 2 2017 12:34 AM

రెండు నూతన విమానాశ్రయాల నిర్మాణంతోపాటు మరొక దాని విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

న్యూఢిల్లీ: రెండు నూతన విమానాశ్రయాల నిర్మాణంతోపాటు మరొక దాని విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టులను సత్వరమే చేపట్టాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన బుధవారం దేశరాజధానిలో జరిగిన సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్, రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తదితరులు పాల్గొన్నారు. వాణిజ్య రాజధానితోపాటు ఇతర ప్రధాన నగరాలను అభివృద్ధి బాటలో ముందుంచేందుకు కీలక ప్రాజెక్టులు చేపట్టాల్సిన ఆవశ్యకతపై ఈ సందర్భంగా ఈ సమావేశంలో చర్చించారు. పుణే, నవీముంబైలలో కొత్త విమానాశ్రయాల నిర్మాణంతోపాటు నాగపూర్ విమానాశ్రయాన్ని విస్తరించాలని ఈ సమావేశంలో నిర్ణయించారని ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు ఎటువంటి అడ్డంకులు లేవన్నారు.
 
 కాగా ముంబై నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు 60 కిలోమీటర్ల పొడవున రూ. 20 వేల కోట్ల అంచనా వ్యయంతో దీనిని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి విదితమే. కాగా, చర్చిగేట్-విరార్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు కోసం నగరవాసులు మరికొంతకాలం ఎదురుచూడక తప్పదు. ఇందుకు కారణం  ముంబైలో ట్రాఫిక్ స్థితిగతులపై మరొకసారి అధ్యయనం చేసిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడమే. ఈ విషయాన్ని రైల్వే శాఖ అధికారి బుధవారం వెల్లడించారు. 60 కిలోమీటర్ల మేర నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టుకు రూ. 20 వేల కోట్లు ఖర్చవ్వచ్చని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ప్రాజెక్టుపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. కాగా ప్రతిపాదిత ముంబై ట్రాన్స్‌హార్బర్ లింక్ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చ వాన్ ఈ సందర్భంగా పీఎం మన్మోహన్‌సింగ్‌కు విన్నవించారు.

Advertisement
 
Advertisement
Advertisement