పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ పదవికి ఆ దేశ మాజీ క్రికెటర్, ప్రస్తుత ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్ ఆసక్తి కనబరుస్తున్నారు.
లాహోర్:పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ పదవికి ఆ దేశ మాజీ క్రికెటర్, ప్రస్తుత ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్ ఆసక్తి కనబరుస్తున్నారు. పీసీబీ చైర్మన్ పదవిని చేపట్టడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సోమవారం ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. తనను అడిగితే ఆ పదవిని తప్పకుండా స్వీకరిస్తానని తెలిపారు. 'పీసీబీ చైర్మన్ పదవి చేపట్టడానికి నేను సిద్ధం. మరో రెండు నెలల్లో ఐసీసీ అధ్యక్ష పదవీ కాలం ముగిసిపోతుంది. ఆ తరువాత పాక్ క్రికెట్ జట్టుకు సేవలందించడానికి సిద్ధంగా ఉన్నాను' అని జహీర్ అబ్బాస్ పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన ఆసియాకప్, వరల్డ్ టీ 20ల్లో పాక్ జట్టు పేలవ ప్రదర్శన అనంతరం పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్పై విమర్శలు తారాస్థాయికి చేరాయి. వరల్డ్ కప్లో కనీసం రెండో రౌండ్కు చేరలేకపోయిన పాక్ జట్టు ఆట తీరుపై ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ క్రికెట్లో సమూల మార్పులు తీసుకురావాలంటే పీసీబీ చైర్మన్తో పాటు, పాక్ క్రికెట్ లో క్రియాశీలకంగా ఉన్నవారిని మార్చాల్సిన అవసరం ఉందని అప్పట్లోనే షరిష్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ లో పలు మార్పులకు రంగం సిద్దమైంది.