
'టీమిండియాతో జరజాగ్రత్త'
వన్డే సిరీస్ లో టీమిండియాతో జాగ్రత్తగా ఉండాలని దక్షిణాఫ్రికా కోచ్ రస్సెల్ డొమిన్గో హెచ్చరించాడు.
కోల్ కతా: వన్డే సిరీస్ లో టీమిండియాతో జాగ్రత్తగా ఉండాలని దక్షిణాఫ్రికా కోచ్ రస్సెల్ డొమిన్గో హెచ్చరించాడు. ట్వంటీ 20 సిరీస్ ను గెలిచామన్న అత్యుత్సాహాన్నిదరిచేరనీయకుండా వన్డే సిరీస్ లో పోరాడితేనే టీమిండియాతో విజయం సాధ్యమవుతుందన్నాడు. ఒకవేళ అలా జరగని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని దక్షిణాఫ్రికా ఆటగాళ్లను హెచ్చరించాడు.
'టీమిండియాతో జరజాగ్రత్త. ఆ జట్టు వన్డేల్లో అత్యంత ప్రమాదకారి. దాన్ని దృష్టిలో ఉంచుకుని సిరీస్ కు సిద్ధంకండి. ట్వంటీ 20 సిరీస్ ను కోల్పోయిన టీమిండియా ఎదురుదాడికి దిగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మూడు ఫార్మెట్లలో టీమిండియా మెరుగ్గా ఉంది' అని సఫారీ ఆటగాళ్లకు డొమిన్గో దిశానిర్ధేశం చేశాడు. ప్రస్తుతం తమ దృష్టి ఆదివారం కాన్పూర్ లో జరుగనున్న తొలి వన్డేపైనే ఉందన్నాడు. ఆ తరువాతే మిగతా మ్యాచ్ లు గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ట్వంటీ 20 సిరీస్ గెలిచిన అనంతరం దక్షిణాఫ్రికాపై మీడియా ప్రభావం ఎక్కువగా ఉందని, వీలైనంత వరకూ ఆటగాళ్ల మీడియాకు దూరంగా ఉంటే మంచిదని డొమిన్గో తెలిపాడు. ప్రేక్షకుల్ని నుంచి ఎదురయ్యే ఇబ్బందులు గురించి మాట్లడటానికి ఇష్టపడని డొమిన్గో.. తాము మీడియా తాకిడితో సతమతమవుతున్నట్లు తెలిపాడు. రకరకాలైన మీడియా ప్రతినిధుల నుంచి అనేక రకాలైన ప్రశ్నలు రావడం ఆటగాళ్లను ఇబ్బందులకు గురి చేస్తుందన్నాడు.