కటక్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన సహచరులతో కలిసి కటక్ వీధుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. వెస్టిండీస్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా మూడో వన్డే ఆదివారం కటక్లో జరగనుంది. ఈ నేపథ్యంలో మూడు రోజులు విశ్రాంతి దొరికింది. శుక్రవారం ఇరు జట్లకు ప్రాక్టీస్ సెషన్ లేకపోవడంతో కోహ్లి తన సహచరులతో కలిసి చిల్ అయిన ఫోటోలను తన ట్విటర్లో షేర్ చేశాడు.' ఈ రోజు ప్రాక్టీస్ సెషన్ లేకపోవడంతో నా సహచరులకు ఒత్తిడి లేకుండా ఉండేందుకు అందరం కలిసి బయటికి వచ్చాం. ఈ మధ్యాహ్నం సహచరులతో కలిసి ఆనందంగా ఆస్వాదిస్తున్నా' అంటూ ట్వీట్ చేశాడు. కాగా, ఈ ఫోటోలో కోహ్లితో పాటు కేఎల్ రాహుల్, రిషబ్పంత్, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్, యజువేంద్ర చాహల్లు ఉన్నారు.
చెన్నైలో జరిగిన మొదటి వన్డేలో 8 వికెట్లతో విండీస్ చేతిలో పరాజయం పాలైంది. అయితే విశాఖలో జరిగిన రెండో వన్డేలో రోహిత్, రాహుల్ శతకాలకు తోడు అయ్యర్, పంత్ల మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో 387 పరుగులు చేసింది. ఆపై విండీస్ను 280 పరుగులకు ఆలౌట్ చేసి లెక్కను సరిచేసింది. ఇదే మ్యాచ్లో చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్తో మెరిసిన సంగతి తెలిసిందే. కాగా కీలకంగా మారిన మూడో వన్డేలో విజయం సాధించి 2019కి గుడ్బై చెప్పాలని టీమిండియా భావిస్తోంది.