
‘తెలుగు’ వెలిగింది
ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్ తొలి రోజు తెలుగు టైటాన్స్ కూత బలంగా వినిపించింది.
►టైటాన్స్ జట్టు శుభారంభం
►తొలి మ్యాచ్లో తలైవాస్పై ఘన విజయం
►ఘనంగా ప్రారంభమైన ప్రొ కబడ్డీ లీగ్
ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్ తొలి రోజు తెలుగు టైటాన్స్ కూత బలంగా వినిపించింది. సొంత గడ్డపై అట్టహాసంగా ఆరంభమైన ఈ టోర్నీలో ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయాన్ని సొంతం చేసుకుంది. రాహుల్, నీలేశ్ దూకుడైన ఆట టైటాన్స్ను గెలిపించింది. మరోవైపు సచిన్, చిరంజీవిలాంటి హేమాహేమీలు యజమానులుగా తొలిసారి లీగ్లోకి అడుగు పెట్టిన తమిళ్ తలైవాస్ నిరాశాజనకంగా లీగ్ను ప్రారంభించింది.
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్లో ఆతిథ్య తెలుగు టైటాన్స్ జట్టుకు ఘనమైన ఆరంభం లభించింది. ఐదో సీజన్లో భాగంగా శుక్రవారం జరిగిన టోర్నీ తొలి మ్యాచ్లో టైటాన్స్ 32–27 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్ను చిత్తు చేసింది. మూడు సార్లు డూ ఆర్ డై రైడింగ్లలో పాయింట్లు రాబట్టిన నీలేశ్ సాలుంకే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
రాహుల్ సూపర్ 10...
ఇరు జట్లు తొలి రైడ్లలో రక్షణాత్మక ధోరణి కనబర్చగా... ప్రపంజన్ పాయింట్తో తమిళ్ ముందుగా ఖాతా తెరిచింది. ఆ తర్వాత రాహుల్ ప్రదర్శనతో టైటాన్స్ 4–3తో ఆధిక్యంలో నిలిచింది. అయితే తలైవాస్ పోరాడటంతో స్కోరు 8–8తో సమమైంది. ఈ దశలో నీలేశ్ రెండు పాయింట్లతో మళ్లీ ఆధిక్యంలో నిలపగా... తర్వాతి నిమిషంలో ప్రత్యర్థిని ఆలౌట్ చేసి తెలుగు టీమ్ 14–8తో దూసుకుపోయింది. తొలి అర్ధ భాగం ముగిసే సరికి టైటాన్స్ 18–11తో ముందంజలో ఉంది. రెండో అర్ధ భాగంలో కోలుకున్న తలైవాస్ ఆఖర్లో గట్టి పోటీనిచ్చింది. 37వ నిమిషంలో టైటాన్స్ 32–21తో గెలుపునకు చేరువైంది.
ఈ దశలో తలైవాస్ వరుసగా ఆరు పాయింట్లు రాబట్టడం విశేషం. అయితే చివరకు టైటాన్స్దే పైచేయి అయింది. తెలుగు ఆటగాళ్లలో రాహుల్ 10 పాయింట్లు సాధించగా, నీలేశ్ 7 పాయింట్లు, విశాల్ 5 పాయింట్లు స్కోర్ చేశారు. కబడ్డీ లీగ్లో ఓవరాల్గా రాహుల్కు ఇది 25వ సూపర్–10 స్కోర్ కావడం విశేషం. తలైవాస్ జట్టు తరఫున ప్రపంజన్ 7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, అజయ్ ఠాకూర్ 6 పాయింట్లు సాధించాడు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మ్యాచ్కు ముందు జాతీయ గీతాలాపన చేశాడు. రెండో మ్యాచ్లో పుణేరి పల్టన్ 33–21తో యు ముంబాను ఓడించింది. శనివారం జరిగే మ్యాచ్ల్లో జైపూర్ పింక్ పాంథర్స్తో దబంగ్ ఢిల్లీ; తెలుగు టైటాన్స్తో పట్నా పైరేట్స్ తలపడతాయి.