అయ్యో.. నేను డిసిల్వా కాదు.. డిక్వెల్‌!

Sri Lanka Cricketer Dickwella Answer Over Pakistani Journalist Double Blunder - Sakshi

రావల్పిండి: శ్రీలంక క్రికెట్ జట్టు ప్రస్తుతం పాకిస్తాన్‌లో పర్యటిస్తోంది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా బుధవారం రావల్పిండి క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్ ఆరంభమైంది. బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు రెండో రోజు ఆట ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. ఈ క్రమంలో గురువారం ఆట ముగిసిన తర్వాత లంక క్రికెటర్‌ నిరోషన్‌ డిక్వెల్‌ విలేకరులతో మాట్లాడాడు. ఈ సందర్భంగా రిపోర్టర్ల ప్రశ్నలు డిక్వెల్‌తో పాటు అక్కడున్న మిగతా ఆటగాళ్లకు నవ్వులు తెప్పించాయి. ఇంతకీ విషయమేమిటంటే... మ్యాచ్‌ గురించి ఓ విలేకరి మాట్లాడుతూ... ‘ మీరు చాలా బాగా ఆడారు. సెంచరీకి దగ్గరగా ఉన్నారు. ఈ పిచ్‌పై శతకం సాధిస్తానని అనుకుంటున్నారా అని డిక్వెల్‌ను ప్రశ్నించాడు. 

ఇందుకు చిరునవ్వులు చిందించిన డిక్వెల్‌... ‘నేను డిసిల్వాను కాదు. డిక్వెల్‌ను అంటూ బదులిచ్చాడు. అయినప్పటికీ మరో విలేకరి సైతం ఇలాంటి ప్రశ్ననే సంధించడంతో..‘ మీరు నా గురించేనా మాట్లాడేది. నేను డిక్వెల్. ఇప్పటికే ఔట్‌ అయ్యి పెవిలియన్‌లో కూర్చున్నాను. ఒకవేళ రెండో ఇన్నింగ్స్‌లో వీలైతే సెంచరీ గురించి ఆలోచిస్తా’ అంటూ డిక్వెల్‌ ఓపికగా మళ్లీ అదే సమాధానమిచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో మ్యాచ్‌ వివరాలు, ఆటగాడి పేరు కూడా తెలుసుకోకుండా విలేకర్ల సమావేశానికి ఎలా వస్తారు. కనీస అవగాహన లేకుండా ప్రశ్నలు అడగడం సబబేనా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో డిక్వెల్‌ 33 పరుగులు చేసి ఔటయ్యాడు. అదే విధంగా గురువారం ఆట ముగిసే సరికి ధనంజయ డిసిల్వా(72 బ్యాటింగ్‌) అజేయంగా నిలిచాడు. 

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top