సిటీలో క్రికెట్ ఫీవర్
భారత్–విండీస్ మ్యాచ్కు డిమాండ్
వెబ్సైట్లు పనిచేయక స్పోర్ట్స్ లవర్స్ ట్రబుల్స్
సాక్షి,సిటీబ్యూరో: భారత్– వెస్టిండీస్ల తొలి 20–20 క్రికెట్ మ్యాచ్ కోసం నగరం సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ ఆర్జీఏ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్లో భారత్ తరఫున కోహ్లీతో పాటు టాప్ స్టార్ ఆటగాళ్లంతా అడనుండడంతో ఈ మ్యాచ్ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా కనీస టికెట్టు ధరను రూ.800గా నిర్థారించి ఆపై రూ.1000 నుంచి రూ.12500 నిర్ణయించారు. వీటి అమ్మకాలను టికెట్స్ ఈవెంట్ డాట్ ఇన్, ఈవెంట్స్ నౌ, పేటీఎం యాప్ల ద్వారా అందుబాటులోకి తెచ్చారు. అయితే, కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ కాకపోవటంతో దళారులు బ్లాక్ మార్కెట్లో టికెట్ల బేరాలు మొదలుపెట్టారని పోలీస్లకు బుధవారం ఫిర్యాదులు అందాయి. మరోపైపు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్కు నగరం వేదిక కావడంతో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం నుంచే స్టేడియాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఉప్పల్ పరిసరాలను నిఘా నీడలో ఉంచారు.