
తెలుగు టైటాన్స్తోనే రాహుల్
ఐపీఎల్ తర్వాత ఎంతో ప్రజాదరణ పొందిన ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకులను అలరించనుంది.
ముంబై: ఐపీఎల్ తర్వాత ఎంతో ప్రజాదరణ పొందిన ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకులను అలరించనుంది. జూలైలో లీగ్ జరగనున్న నేపథ్యంలో మే 22, 23 తేదీల్లో ఢిల్లీలో ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. మొత్తం 350 మంది ఆటగాళ్లు వేలానికి అందుబాటులో ఉండగా... గత సీజన్లో తమ జట్ల తరఫున అసాధారణ ప్రతిభతో రాణించిన ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు తమతోనే కొనసాగించనున్నాయి. లీగ్లో అత్యంత సక్సెస్ఫుల్ రైడర్గా పేరొందిన రాహుల్ చౌదరీని తెలుగు టైటాన్స్ అట్టిపెట్టుకుంది.
రాహుల్తో పాటు యు–ముంబా కెప్టెన్ అనూప్ కుమార్, దబంగ్ ఢిల్లీ ఆల్రౌండర్ మిరాజ్ షేక్, బెంగాల్ వారియర్స్ తరఫున జంగ్ కౌన్ లీ, బెంగళూరు బుల్స్ డిఫెండర్ ఆశిష్ కుమార్, పాట్నా పైరేట్స్కు అత్యంత విలువైన ఆటగాడు ప్రదీప్ నర్వాల్, పుణేరి పల్టన్ జట్టులో దీపక్ హుడా ఐదో సీజన్లోనూ ఆయా ఫ్రాంచైజీలకే ప్రాతినిధ్యం వహించనున్నారు. కేవలం జైపూర్ పింక్ పాంథర్స్ మాత్రం మిగతా ప్రాంచైజీలకు భిన్నంగా ఏ ఆటగాడినీ తమతో కొనసాగించడం లేదు. ఇదిలా ఉండగా గతేడాది పోలిస్తే ఈసారి అదనంగా 4 జట్లు లీగ్లో చేరనున్నాయి. తమిళనాడు, గుజరాత్, ఉత్తర్ప్రదేశ్, హరియాణా ఫ్రాంచైజీలకు చెందిన జట్లు ఈసారి అరంగేట్రం చేయనున్నాయి.