ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌కు ముందే నిధులు | Prior to the first match of IPL funds | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌కు ముందే నిధులు

Mar 31 2017 1:06 AM | Updated on Sep 5 2017 7:30 AM

ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు బీసీసీఐ నూతన పరి పాలక కమిటీ

రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు ఊరట ∙సీఓఏ నిర్ణయం

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు బీసీసీఐ నూతన పరి పాలక కమిటీ (సీఓఏ) ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్‌ నిధుల చెల్లింపు విధానానికి చేసిన మార్పుల కారణంగా తమ తొలి మ్యాచ్‌ జరగడానికి ముందే ఆయా సంఘాలకు నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఇంతకుముందు ఒక్కో ఐపీఎల్‌ మ్యాచ్‌ నిర్వహణకు నిబంధనల ప్రకారం రూ.60 లక్షలు అందేవి. అయితే ఇందులో రూ.30 లక్షలు మ్యాచ్‌కు ముందు ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఇచ్చేది. మిగతా మొత్తం లీగ్‌ ముగిసిన రెండు వారాలకు బోర్డు చెల్లించేది. తాజాగా 10 రాష్ట్ర క్రికెట్‌ సంఘాల అధికారులతో జరిగిన సమావేశంలో సీఓఏ ఈ విధానంలో మార్పును తీసుకువచ్చింది. బీసీసీఐ చెల్లించే వాటాను కూడా మ్యాచ్‌కు ముందే ఇచ్చేందుకు నిర్ణయించింది.

‘ఇప్పుడు తొలి మ్యాచ్‌కు ముందే మొత్తం నిధులు అందుకోనున్నాం. సీఓఏ మా సూచనలకు గౌరవమివ్వడం సం తోషంగా ఉంది. ఇంతకుముందులాగా కాకుండా బోర్డు కూడా మ్యాచ్‌కు ముందే తమ వాటా ఇవ్వనుంది’ అని ఓ రాష్ట్ర క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు తెలిపారు. ఈ నేపథ్యంలో కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు కనిష్టంగా తమ తొలి మ్యాచ్‌కు ముందే రూ.4.20 కోట్లు (7 మ్యాచ్‌లకు కలిపి) అందుకోనుంది. కాన్పూర్‌లో జరిగే రెండు మ్యాచ్‌ల కోసం యూపీసీఏ రూ.1.20 కోట్లు పొందుతుంది. మరోవైపు బోర్డు ఎస్‌జీఎం ఏర్పాటు చేసుకునేందుకు తమ అనుమతి అవసరం లేదని సీఓఏ స్పష్టం చేసింది. అలాగే ఐపీఎల్‌ చైర్మన్‌గా రాజీవ్‌ శుక్లా కొనసాగుతారని కమిటీ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement